ఆంధ్రప్రదేశ్కు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతూ ఏపీతో సహా మరికొన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడులలోని మిగిలిన ప్రాంతాలు.. వాయవ్య బంగాళాఖాతం, సిక్కిం, బిహార్లలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించగా.. ప్రస్తుతం ఏపీతో పాటు యానాం వైపు పడమటి గాలులు వీస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు రాయలసీమలోని పుట్టపర్తి వరకు విస్తరించాయి అని చెబుతున్నారు. ఏపీలో దక్షిణ కోస్తాలోని శ్రీహరికోట వరకూ ఆదివారం నైరుతి రుతుపవనాలు విస్తరించిన సంగతి తెలిసిందే.ఈ ప్రభావంతో సోమవారం కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిశాయి. రానున్న 24 గంటల్లోనూ అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంటున్నారు.