విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: అమరావతిలోని సచివాలయంలో రోడ్లు, రవాణా శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.. ఇరువురి భేటీ సందర్భంగా గత నెలలో విజయవాడ నగర పరిధిలో బుడమేరు ముంపు కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆర్ అండ్ బీ రోడ్లు నీట మునిగిన అంశం చర్చకు వచ్చింది. ముఖ్యంగా నాడు నూజివీడు వెళ్లే రోడ్డుకు కొన్ని చోట్ల తాత్కాలికంగా గండి కొట్టి… వరద నీటిని బయటకు విడుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఆ రోడ్డును పునర్మించారు. అయితే భవిష్యత్తులో వరదల సమస్య పునరావృతం అయితే, వాటికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలనే ఆలోచనతో మంత్రులు చర్చించారు. ముఖ్యంగా నాడు తాత్కాలికంగా తొలగిం చిన రోడ్ల స్థానంలో బాక్స్ కల్వర్టులు నిర్మించేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖతో, విజయవాడ మున్సిపల్ కార్పొ రేషన్ సమన్వయం చేసుకుని ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రులు రోడ్లు మరియు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొన్నారు.