తెలంగాణ హైకోర్టుదే నిర్ణయాధికారమని స్పష్టీకరణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకే వదిలేసింది. దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణారెడ్డి అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. గతంలో ఏపీ నుంచి తెలంగాణకు కేసును బదిలీ చేస్తూ వివేకా సతీమణి, కుమార్తె సునీతలను నిజమైన బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరన్నదానిపై సుప్రీంలో స్పష్టత తీసుకోవాలని ఎంవీ కృష్ణారెడ్డికి హైకోర్టు తెలిపింది. హైకోర్టు నిర్ణయంతో ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీంను ఆశ్రయించారు.
ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్పై స్పష్టత ఇవ్వకుండా పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోడానికి తాము సిద్ధంగా లేమని జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సంజయ్కుమార్ ధర్మాసనం తేల్చి చెప్పింది. వాద ప్రతివాదులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో హైకోర్టు ముందే చెప్పుకోవచ్చని ధర్మాసనం స్వతంత్రత కల్పించింది. సుప్రీంకోర్టు అభిప్రాయాలతో సంబంధం లేకుండా… హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని తేల్చి చెప్పింది. లిఖితపూర్వక ఆదేశాలు గురువారం ఇస్తామని ధర్మాసనం వెల్లడిరచింది.