బెంగళూరు : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ భారతీయ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. అతి చిన్నవయసు లోనే తనువు చాలించడంతో ఆయన సాటి నటీ నటులు, అభిమానులు ఆ విషాదం నుంచి ఇంకా కోలు కోలేకపోతున్నారు. పునీత్ ఆఖరుగా కన్నడ తెరపై కనిపించిన చిత్రం ‘యువరత్న’. ఈ సినిమా లాక్ డౌన్ టైమ్లో డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై.. మంచి విజయం సాధించింది. తెలుగు వెర్షన్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆయన చనిపోక ముందు షూటింగ్ మధ్యలో ఉన్న చిత్రం ‘జేమ్స్’. దీనికి సంబంధించి పునీత్ యాక్షన్ పార్ట్ పూర్తయిందట. అలాగే సినిమా కూడా చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకుందట. ఈ సినిమాను అభిమానుల కోసం వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. అయితే ఆయన గొంతు కాకుండా వేరే గొంతుతో డబ్బింగ్ చెప్పిస్తే.. ఎవరికీ సంతృప్తికరంగా ఉండదనిపించి.. దీని కోసం సరికొత్త టెక్నాలజీ ఉపయోగించబోతున్నారట. ‘జేమ్స్’ షూటింగ్ సమయంలో పునీత్ రాజ్ కుమార్ పలికిన డైలాగ్స్ను.. సరికొత్త టెక్నాలజీతో క్వాలిటీ పెంచి విజువల్స్కు సింక్ చేయబోతున్నారని సమాచారం. దీని కోసం ఓ ముంబై కంపెనీ రంగంలోకి దిగుతోంది. వచ్చే ఏడాది మార్చి 17న పునీత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట. పునీత్తో ‘రాజకుమార’ అనే సూపర్ హిట్ సినిమా తీసిన చేతన్ కుమార్ ‘జేమ్స్’ కు దర్శకుడు. ఈ సినిమాని తొందరలోనే ముగించి విడుదల తేదీ ప్రకటించాలి అనుకొనే లోపే పునీత్ చనిపోవడం అందరినీ బాధిస్తోంది. అభిమానుల చివరి జ్ఞాపకంగా మిగిలిపోయిన ‘జేమ్స్’ సినిమాకి కన్నడనాట ఏ రేంజ్ లో ఆదరణ దక్కుతుందో చూడాలి.