కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్.డి.ఎ. కాకుండా మిగిలిన పార్టీలను కూడగట్టి ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేయాలన్న ఆకాంక్షకు కొదవే లేదు. లక్ష్యం ఒకటే అయినా ప్రతిపక్ష ఐక్యతా యత్నం భిన్న మార్గాల్లో సాగుతోంది. ఏకోన్ముఖమైన ప్రయత్నం ఏదీ కనిపించడం లేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత ప్రాంతీయ పార్టీల ప్రాభవం గణనీయంగా తగ్గింది. కానీ సార్వత్రిక ఎన్నికలకు ఏడాది న్నర సమయం ఉండగానే మోదీని నిలువరించి తీరవలసిందేనన్న కోరిక అయితే ప్రతిపక్ష ఐక్యత కోసం కృషి చేస్తున్న పక్షాలలో బలంగానే ఉంది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు మళ్లీ బలంగా రంగం మీదకు వస్తున్నాయి. మొదట మమతా బెనర్జీ ఈ అంశాన్ని ప్రస్తా వించారు. బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందే ఆమె ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకురాగలిగారు. శాసన సభ ఎన్నికలలో బీజేపీని చిత్తుగా ఓడిరచి ఇదివరకు ఎన్నడూ లేనన్ని సీట్లు సంపాదించిన తరవాత ఆమె తన రాజకీయ ప్రభావాన్ని జాతీయ స్థాయికి విస్తరింప చేయాలనుకున్నారు. సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ లాంటి వాటిని ప్రత్యర్థులను దెబ్బతీసే పరసవేదిగా మోదీ ప్రభుత్వం మార్చేసింది. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ మంత్రివర్గంలోని పార్థా చటర్జీ లాంటి వారిని జైలులో తోసేశారు. పార్థా చటర్జీ మీద సోదాలు జరిగిన తరవాత కట్టలు కట్టలు డబ్బు, బంగారం దొరికాయంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ మమతా బెనర్జీ మంత్రివర్గంలోని వారు ఆమెలాగా అవినీతికి దూరంగా ఉండేవారు కాదన్న అభిప్రాయం జనంలో బలంగా నాటుకుపోయింది. అందువల్ల ఐక్యతా యత్నాలకు మమత ఇటీవలి కాలంలో కొంచెం దూరంగా ఉంటు న్నారు. అయినా బీజేపీ మీద ఆమె వ్యతిరేకత ఏ మాత్రం తగ్గలేదు. మరో వేపున పంజాబ్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయ కత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా ఘన విజయం సాధించింది. అంటే దిల్లీతో సహా ఇప్పుడు పంజాబ్ కూడా కేజ్రీవాల్ ఆధిపత్యంలో ఉంది. దీనితో ఆమ్ ఆద్మీ పార్టీని దేశమంతటికీ విస్తరించగలమన్న ధీమా కేజ్రీ వాల్కు వచ్చింది. అందుకే త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమా చల్ ప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఎత్తున పోటీ చేయాలనుకుంటోంది. కేజ్రీవాల్ దృష్టి ప్రధానంగా గుజరాత్ మీదే ఉంది. గత శాసనసభ ఎన్నికలలోనే బీజేపీ చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు అతి కష్టం మీద అధికారం నిలబెట్టుకోగలిగింది. కిందటి ఎన్నికలలో గుజరాత్లో కాంగ్రెస్ అనూహ్యంగా బలం పెంచుకోగలిగింది. అందువల్ల తానూ ఓ ప్రయత్నం చేసి చూద్దామన్న ఆలోచన కేజ్రీవాల్కు వచ్చింది. కేజ్రీవాల్ ఇంత వరకు బీజేపీతో నేరుగా తలపడే ప్రయత్నం చేయలేదు. ఆయన శరాలన్నీ కాంగ్రెస్ మీదే ప్రయోగించేవారు. కాంగ్రెస్ బలహీనపడ్డ చోటల్లా ఆ స్థానాన్ని తాను పూరించాలనుకున్నాడు. గుజరాత్ ప్రధానమంత్రి రాష్ట్రం అయినందువల్ల మోదీతో నేరుగా తలపడక తప్పని పరిస్థితి కేజ్రీవాల్కు ఎదురైంది. మోదీని ఢీకొట్టాలన్న ఆలోచన కేజ్రీవాల్కు ఉన్నప్పటికీ దేశ వ్యాప్తంగా ఆయన పార్టీకి అస్తిత్వమే లేదు. ఒక్కో అడుగు ముందుకు వేయా లన్నది ఆయన వ్యూహం. ఇతర ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని మోదీని ఎదిరించాలన్న ఆలోచన కేజ్రీవాల్కు అసలే లేదు. ఇతర ప్రతిపక్షాలకు, కేజ్రీవాల్కు మధ్య ఉన్న సామ్యమల్లా మోదీని ఎదిరించడమే. తక్షణం తాను ప్రధానమంత్రి పదవి అధిష్ఠిస్తానన్న భ్రమ కేజ్రీవాల్కు లేకపోవచ్చు. ఆయన దృష్టి 2024 సార్వత్రిక ఎన్నికల మీద కూడా ఉందనిపించడం లేదు. ఆయన ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తే 2029 ఎన్నికల నాటికి ఆమ్ ఆద్మీ పార్టీని బలీయమైన శక్తిగా దిద్ది తీర్చగలమని భావిస్తున్నట్టున్నారు. కేజ్రీవాల్ది ఏకోనారాయణ అన్న ప్రతిపక్షం.
బిహార్లో రాజకీయ సమీకరణలు మారిపోయి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. తేజస్వీ యాదవ్ నాయ కత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి.) తో నితీశ్ పొత్తు ప్రతిపక్ష ఐక్యతకు కొత్త చిగుళ్లు తొడిగింది. ఇటీవల నితీశ్ మూడు రోజులు దిల్లీలో పర్యటించి కేజ్రీవాల్తో సహా ప్రతిపక్ష నాయకులందరినీ కలుసుకుని బీజేపీని గద్దె దించవలసిన అవసరం ఏమిటో బీజేపీయేతర నాయకులకు వివరిస్తున్నారు. ప్రతిపక్షాలు గెలిస్తే ఎవరు ప్రధానమంత్రి అన్నది ఇప్పుడు ప్రస్తావించవలసింది కాదనీ, ముందు మోదీని గద్దె దించితే తరవాత నాయకుడి సంగతి ఆలోచించవచ్చునన్నది నితీశ్ ఎత్తుగడ. అయితే మిగతా ప్రతిపక్ష నాయకులతో పోలిస్తే నితీశ్ చతురుడైన నాయకుడు. ఆయన వ్యూహం ఏమిటో చివరి క్షణం దాకా తెలియనివ్వరు. కానీ నితీశ్కు ఉన్న సుదీర్ఘ పరిపాలనానుభవం, అవినీతి మకిలి అంటని వ్యక్తిత్వం ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థి అన్న ఊహాగానాలకు తావిస్తోంది. ఇంకో వేపు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు (కె.సి.ఆర్.) కూడా ప్రతి పక్షాల ఐక్యత కోసం ఒక విడత దేశాటన ప్రారంభించారు. బిహార్, కర్నా టకలో నితీశ్, తేజస్వి యాదవ్ ను కర్నాటకలో జె.డి.(ఎస్) నాయకుడు కుమారస్వామితో మంతనాలు జరిపారు. నితీశ్, కె.సి.ఆర్. ఈ ప్రయత్నా లను కొనసాగించడం ఖాయం. ఒక్కటే తేడా నితీశ్ గోప్యంగా ఉంటారు. కె.సి.ఆర్. మోదీ మీద నేరుగా విరుచుకుపడతారు. తెలంగాణాలో బల పడడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కె.సి.ఆర్.కు ఎసరు తెస్తాయి కనక బీజేపీ వ్యతిరేకత కె.సి.ఆర్.లో గూడుకట్టుకు పోయింది. సోమవారం శాసన సభలో మోదీ ప్రభుత్వ విధానాల మీద ఆయన పెద్ద ఎత్తున దాడి చేసి ప్రతి పక్ష ఐక్యతకు తన తపన తీవ్రత వ్యక్తం చేశారు. అయితే కె.సి.ఆర్. ప్రతిపక్ష ఐక్యతలో కాంగ్రెస్కు స్థానం లేదు. కేజ్రీ, మమత వైఖరీ అదే. కాంగ్రెస్ ఎంత బలహీనపడ్డా దేశవ్యాప్తంగా అస్తిత్వం ఉన్న ప్రతిపక్ష పార్టీ అదొక్కటే. కాంగ్రెస్ను మినహాయించే ప్రతిపక్ష కూటమి ఎన్.సి.పి. నాయకుడు శరద్ పవార్కు కూడా సమ్మతం కాదు. ఈ లెక్కలన్నీ అలా ఉంచినా కాంగ్రెస్ను మినహాయించే ప్రతిపక్ష ఐక్యత మోదీని ఢీకొనడానికి సరిపోదు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితీ మారొచ్చు. కానీ ప్రతిపక్షాలు ద్విముఖ పోటీని అనివార్యం చేయకపోతే మోదీని నిలువరించడం కష్ట సాధ్యమే. ఈ వాస్తవం దృష్టిలో ఉంచుకుంటే ప్రతిపక్ష ఐక్యత ప్రస్తుతానికి ఏనుగు-నలుగురు గుడ్డివాళ్లు అన్న చందంగానే ఉంది. మోదీని దించడానికి భిన్న దారుల్లో వెళ్తే అది మోదీకే అనుకూలం అయ్యే ప్రమాదం ఉంది. వ్యక్తిగత ఎజెండాలు, సొంత పలుకుబడి పెంచుకోవడం మీద ధ్యాస ఉంటే అంతిమ లక్ష్యానికి గండి పడక తప్పదు.