బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దొంగ దెబ్బ తీసి బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. కూటమిలో చేరిపోవడం ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనను ఒక్క కుదుపు కుదిపిన మాట నిజమే. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు తానే సూత్రధారి అయి ఉండి నితీష్ ఏ సాధించాలనుకుని బీజేపీ అండన చేరారో తెలియదు. ఇలాంటి పల్టీలు ఆయన ఇంతకు ముందు కూడా కొట్టారు. పైకి గొప్ప ఆకాంక్షలు ఏమీ లేనట్టు కనిపించినా అంతరాంతరాల్లో ఆయనకు ప్రధానమంత్రి కావాలన్న ఆలోచన ఉండేది. కానీ మాటల్లో మాత్రం సర్వసంగ పరిత్యాగిలా ఉండే వారు. బీహార్లోని మహా ఘట్బంధన్లో అంతా సవ్యంగా సాగడం లేదని మాత్రమే ఆయన చెప్పారు. కానీ ఇటీవల ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన సమావేశం జరగడానికి ముందే ఈ ఐక్య సంఘటన గెలిస్తే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గే ప్రధానమంత్రి అభ్యర్థి కావాలని మమత ఏకపక్షంగా ప్రకటించేశారు. ఇందులో ఆమెకు నితీశ్ కుమార్ విషయంలో ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణం. నిజానికి ‘‘ఇండియా’’ కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్న చర్చే జరగలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడి ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే అప్పుడు ఆ విషయం ఆలోచించవచ్చు, తాను ప్రధానమంత్రిని కాదలుచుకోలేదని రాహుల్ గాంధీ స్పష్టంగానే ప్రకటించారు. అందువల్లే మమత ఖడ్గే పేరు ప్రతిపాదించారు. అంతేకాకుండా ‘‘ఇండియా’’ సమన్వయ కర్తగా నితీశ్ను నియమించాలన్న ఆలోచనను మమత బహిరంగంగా చెప్పకుండానే అడ్డం కొట్టారు. ఈ పరిణామాల తరవాత ‘‘ఇండియా’’లో తనకు పెద్ద ప్రయోజనం ఏమీ లేదని నితీశ్ భావించారు. పైకి నీతులు చెప్తూనే లోపాయికారీగా బీజేపీతో మంతనాలు జరిపి చివరకు చేరిపోయారు. ఈ నిర్ణయంతో నితీశ్ కుమార్ మీద సద్భావన ఘోరంగా దెబ్బతిన్నది. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆయన ఒక్క ఉదుటున వదిలేశారు. బీజేపీతో ఆయన చేతులు కలపడం కొత్తేమీ కాదు. కానీ సైద్ధాంతికంగా నితీశ్ సోషలిస్టు భావజాలం ఉన్న వారన్న నమ్మకం ఏ మూలనో అందరిలో దాగి ఉండేది. ఆయనలో పదవీ కాంక్ష తప్ప సోషలిస్టు, సెక్యులర్ భావాలు ఇసుమంత కూడా లేవని తేలిపోయింది. నితీశ్ పార్టీలో సీనియర్ నాయకుడైన కె.సి.త్యాగీ అయితే ‘‘ఇండియా’’ నాయకత్వాన్ని లాగేసుకోవాలని చూస్తోంది అని తీవ్రమైన వ్యాఖ్యే చేశారు. దీన్ని నితీశ్ ఖండిరచలేదంటే ఈ వ్యాఖ్యలకు ఆయన మద్దతు ఉన్నట్టే లెక్క. మళ్లీ నితీశ్ ఎన్.డి.ఎ. సరసన చేరాలని నిర్ణయించుకోవడం ఆయన మీద సదభిప్రాయాన్ని మంట గలిపింది. 2013లో మోదీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకే ససేమిరా సమ్మతం కాదని కరడుగట్టిన సెక్యులర్ వాదినన్న అభిప్రాయం కలిగించి ఆ తరవాత కొన్నాళ్లకే బీజేపీని ఆలింగనం చేసుకున్న వ్యక్తి నితీశ్. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎప్పుడూ అంతుపట్టని వ్యవహారమే. రాజకీయంగా పైకి ఎదగాలన్న కోరిక ఎవరికైనా ఉండొచ్చు. కానీ లక్ష్య సాధనకు అనుసరించే మార్గం కూడా సవ్యమైంది అయి ఉండాలి. అవసరార్థం కప్పగంతులు వేస్తే నితీశ్ కుమార్లాంటి వారి కీర్తి కూడా అడుగంటుతుంది. ప్రతిపక్షాలతో తెగతెంపులు చేసుకుని వెళ్లి పోయినా నితీశ్ ప్రతిపక్ష నాయకులను దుయ్యబట్టక పోయినా తన పరువు నిలబెట్టడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర బీహార్లో ప్రవేశించనున్న సమయంలోనే ఈ పరిణామాలన్ని జరిగాయి. నితీశ్ విద్రోహం తలపెట్టినా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గే కానీ రాహుల్ గాంధీ కానీ అనుచితమైన, పరుషమైన వ్యాఖ్యలు చేయలేదు. ఇది అక్షరాలా సమంజసమైన వైఖరి. ప్రతిపక్ష ఐక్య సంఘటన లోని పక్షాలన్నింటినీ ఒక్క తాటి మీద నడిపించవలసిన బాధ్యత ఆ సంఘటనలో అతి పెద్ద పక్షంగా కాంగ్రెస్ మీదే ఉంది. ‘‘ఇండియా’’ నిర్వహణ ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ అహంకార పూరితమైందన్న గుసగుసలు కూడా వినిపిం చకుండా చూసుకోవడం కాంగ్రెస్ బాధ్యత. ‘‘ఇండియా’’ సమన్వయకర్తగా నితీశ్ను నియమించడం కొన్ని పక్షాలకు సమ్మతం కాలేదు. ఏకాబి óప్రాయంతో ఈ పని జరిగితే మంచిదని అగ్ర నాయకులు భావించారు. ఏకాభిప్రాయ సాధనకు అవకాశం ఇవ్వకుండానే నితీశ్ నిష్క్రమించారు. మమతతో చర్చించడం ఏమిటి, ఆమెను ఒప్పించడం ఏమిటి అన్న ధోరణిలో నితీశ్ వ్యవహరించారు. నితీశ్ ఫిరాయింపు ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలోని ఏ పక్షానికీ రుచించలేదు. కేజ్రీవాల్, శరద్ పవార్ కూడా నితీశ్ నిర్ణయాన్ని మెచ్చలేదు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అధికార దాహం తీరని నితీశ్ అమాంతం ఫిరాయించడంతో ఆయన మీద ఉన్న గౌరవం ఒక్క సారిగా తగ్గిపోయింది. ఆయన నమ్మదగిన వారు కాదన్న అభిప్రాయం సర్వత్రా వెల్లడైంది. ‘‘ఇండియా’’లో ఇప్పటికీ సీట్ల పంపిణీలో అనేక అడ్డంకులున్నాయి. వీటిని సంయమంతో, లక్ష్య సాధన మీద దృష్టి ఉంచి సర్దుబాటు చేసుకోవాలి. అవసరమైతే కొంత మేర త్యాగాలు చేయడానికి కూడా సిద్ధ పడాలి. ఇవేవీ నితీశ్ పట్టించుకోలేదు. తనకు పెద్ద పీట వేయలేదన్న కారణంగా ప్రతిపక్ష నావను నట్టేట ముంచాలన్న దుష్ట చింతన ప్రదర్శించారు. బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని తృణమూల్ అధినాయకురాలు ప్రకటించినప్పుడు, పంజాబ్లో సీట్ల పంపిణీ గురించి ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే వైఖరి అనుసరించినా కాంగ్రెస్ కానీ ఇతర ‘‘ఇండియా’’ పక్షాలు కానీ తొందరపడి విమర్శలు గుప్పించలేదు. అన్ని పక్షాలూ సంయమం పాటించి తమ బలాబలాలపై వాస్తవ ఆధారితమైన అంచనాతో ముందుకు వస్తే తప్ప బీజేపీని ఓడిరచాలన్న ప్రయత్నం సఫలం కాదు. రామ మందిర ఆవిష్కరణ తరవాత 2024లో బీజేపీ విజయం సునాయాసం అన్న ప్రచారం జరుగుతూ ఉండవచ్చు. కానీ మోదీతో సహా చాలా మంది గ్రహించని, అంచనా వేయడానికి ప్రయత్నించని అంశం ఒకటుంది. మోదీ ఎన్ని మాయాజాలాలు చేసినా ఆయనను వ్యతిరేకించే, ఈ సారి ఆయనకు అధికారం దక్కకుండా చూడాలన్న భావన ఉన్న ప్రజల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ బెట్టు చేస్తూ ఉండవచ్చు. మమతతో తనకు గతం నుంచీ ఉన్న పేచీలను పెద్దవి చేసి రాద్ధాంతం చేస్తున్న అధీర్ రంజన్కు కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కళ్లెం వేసి తీరవవలసిందే. వ్యక్తిగత అంశాలు అసలు లక్ష్యానికి విఘాతం కలిగంచకూడదు. కాంగ్రెస్ మరింత సంయమంతో, లక్ష్యాన్ని ఛేదించడం మీద దృష్టి పెడ్తే తప్ప నితీశ్ లాంటి వారి విద్రోహం వల్ల కలిగే నష్టాన్ని పూరించడం కుదరదు. ఈ సారి మళ్లీ మోదీ గెలిస్తే ఆ తరవాత ఎన్నికలే ఉండవు అని ఖడ్గే చేసిన హెచ్చరిక అవాస్తవం కాదు. ప్రస్తుతావసరం చాతుర్యంతో పాటు సంయమం.