ప్రాంతీయ పార్టీలలో రెండు ధోరణులు కనిపిస్తాయి. మొదటి రకం ప్రాంతీయ ఆకాంక్షలను, అవసరాలను, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడం కోసం ఏర్పడిన తెలుగు దేశం లాంటివి. కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రాంతీయ పార్టీలుగా ఎదిగినవి రెండో రకం. ఇందులో తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లాంటివి ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు చిలీపోయి ఉప ప్రాంతీయ పార్టీలు ఏర్పడిన సందర్భాలూ ఉన్నాయి. ప్రాంతీయ ఆకాంక్షల సాధనకు మాత్రమే ఏర్పడ్డ పార్టీలు క్రమేణా జాతీయ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ నుంచి చీలిపోయిన సమాజ్వాది పార్టీ లాంటివాటికి ప్రాంతీయంగానే బలంగా ఉన్నా జాతీయ ఆకాంక్షలు కూడా లేకపోలేదు. సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జె.డి.(యు), రాష్ట్రీయ జనతా దళ్ లాంటివి ఈ కోవలోకి వస్తాయి. సాధారణంగా తమ రాష్ట్రాలలో ఎన్నికలలో గణనీయమైన విజయాలు సాధించినప్పుడు జాతీయ స్థాయికి విస్తరించాలని ప్రయత్నిస్తాయి. తెలుగు దేశం, డి.ఎం.కె., అన్నా డి.ఎం.కె. లాంటివి పొరుగున ఉన్న పుదుచ్చేరికి విస్తరించాయే తప్ప జాతీయ ఆకాంక్షలు ఎన్నడూ వ్యక్తం చేయలేదు. అయితే అవి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సందర్భాలు లేక పోలేదు. అన్నా డి.ఎం.కె. వాజపేయి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయకపోవడంతో ఆ ప్రభుత్వం పడి పోయింది. అకాలీదళ్ అయితే 1920ల నుంచే అస్తిత్వంలో ఉంది. కానీ 1967లో సం యుక్త విధాయక్ దళ్ మంత్రివర్గాలు ఏర్పడినప్పుడు మాత్రమే మొదటి సారి అధికారం చవిచూసింది. ఆ తరవాత కేంద్ర ప్రభుత్వంలోనూ పాలు పంచుకుంది. కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ దిల్లీలో 2015 నుంచి అధికారంలో ఉంది. క్రమంగా జాతీయ రాజకీయాల్లో చోటు సంపాదించాలని ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నం కారణంగానే పంజాబ్ లో అధికారం సంపాదించింది. ఇతర రాష్ట్రాలలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అడపాదడపా ఎన్నికలలో పోటీ చేస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్ బలహీన పడిన తరవాతే ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత పెరిగింది. 2014 లో మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత అయితే మోదీతో కత్తు కలిపాయి లేదా తెరమరుగైనాయి. ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని దెబ్బతీయడం మోదీ ప్రత్యేక కార్యక్రమంగా పెట్టుకున్నారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ రాకుండా నిలవరించడంలో కాంగ్రెస్ కోలుకోవడం ఒక కారణమైనా ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని కట్టడి చేయగలిగాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు చివరకు మోదీకి మద్దతు ఇవ్వడమూ చూస్తున్నాం. ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం స్వల్పమే. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో స్నేహం చేసి తమ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని చూసిన ప్రాంతీయ పార్టీలు కొన్ని అయితే సైద్ధాంతికంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో విభేదించి ప్రతిపక్షంగా నిలిచినవి మరికొన్ని. ఇటీవలి ఎన్నికల ఫలితాలను రెండు దృక్కోణాలనుంచి చూస్తున్నారు. బీజేపీకి మెజారిటీ రాకపోయినా ఎన్నికల ఫలితాలు మోదీ పదేళ్ల పాలనను ప్రజలు ఆమోదించారని దండోరా వేసుకుంటూ ఉంటే దీనికి వంత పాడే ప్రాంతీయ పార్టీలూ ఉన్నాయి. ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల ఫలితాలు బీజేపీ నైతిక పరాజయంగానే భావిస్తున్నాయి.
కీలకమైన ఉత్తరప్రదేశ్ లో 80 స్థానాల్లో 37 సీట్లు సాధించి అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్వాది పార్టీ తన పూర్వ వైభవాన్ని సంపాదించింది. సమాజ్ వాదీతో పొత్తు కారణంగానే కాంగ్రెస్కు ఆరు స్థానాలు దక్కాయి. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గంతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ కేవలం తొమ్మిది స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. మహారాష్ట్రలో 48 సీట్లు ఉంటే కాంగ్రెస్ 13 చోట్ల గెలిచి మొదటి స్థానం దక్కించుకుంది. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు ఎనిమిది చోట్ల, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది చోట్ల విజయం దక్కింది. అంటే మెజారిటీ స్థానాలు ప్రతిపక్ష ఖాతాలోనే పడ్డాయి. ఉత్తర ప్రదేశ్ లో 37 స్థానాలలో విజయం సాధించిన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటాలని అనుకుంటున్నారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు కలిపి అఖిలేశ్ పి.డి.ఎ. ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్ లో విజయం తరవాత ఈ కూటమిని దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరింప చేయాలని అఖిలేశ్ సంకల్పించారు. దానికి తోడు తాను స్వయంగా రాష్ట్ర రాజకీయాలకు పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారు. ఆయన మొన్నటి దాకా కర్హల్ శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. సార్వత్రిక ఎన్నికలలో కనౌజ్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి శాసన సభా స్థానాన్ని వదులుకున్నారు. దీన్నిబట్టి అఖిలేశ్ భవిష్యత్ కార్యాచరణను ఊహించవచ్చు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి స్థానాన్ని కూడా విడనాడారు. జాతీయ స్థాయిలో చూసినా సమాజ్ వాదీ పార్టీ మూడవ స్థానంలో నిలుస్తోంది. మెజారిటీ సాధించలేని మోదీకి తెలుగు దేశం, జె.డి.(యు) ఊతకర్రలుగా నిలిచాయి. మోదీకి మద్దతు ఇవ్వడానికి ఈ రెండు పార్టీలు పెద్ద కోర్కెల జాబితాలనే అందజేశాయి. ఏ కోరిక మీద ఎలాంటి ఒప్పందం కుదిరిందో తెలియదు. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు గతంలో కేంద్ర రాజకీయాల్లో పాత్ర పోషించినా ఇప్పుడు మోదీ ప్రభుత్వంలో భాగస్వామ్యానికి మించిన లక్ష్యాలు ఏవీ ఆయనకు ఉన్నట్టు కనిపించడం లేదు. ఆయన దృష్టి అంతా ఆంధ్ర ప్రదేశ్ మీదే. కేంద్రం నుంచి అందవలసిన నిధులు, కేంద్ర సహాయంతో ఏర్పాటయ్యే భారీ ప్రాజెక్టులు అందితే ఆయన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా మీద పట్టుబట్టక పోవచ్చు. తెలుగు దేశం పార్టీకి స్పీకర్ పదవి దక్కాలని మాత్రం ఆయన గట్టిగా పట్టుబడ్తున్నారు. ఆ పదవి రాకపొయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కొనసాగించే ఆలోచనలోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు దాటినా ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ కు రాజధానిలేదు. అమరావతిలో రాజధాని నిర్మించాలన్న చంద్రబాబు కల జగన్ హయాంలో కకావికలైంది. ఈ అయిదేళ్లలో అమరావతిలో రాజధాని నిర్మించగలిగితే చంద్రబాబుకు అంతకన్నా మించింది ఏమీ ఉండదు. నితీశ్ కుమార్ బీజేపీ మద్దతుతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు గట్టెక్కితే చాలుననుకుంటున్నారు. బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాల్లో విజయం సాధించి బీజేపీని 12 సీట్లకు పరిమితం చేయగలిగింది. బెంగాల్లో బీజేపీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడమే ఆమె ప్రథమ లక్ష్యం కనక ప్రస్తుత దశలో ఆమె జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబరిచే అవకాశం లేదు. అఖిలేశ్ జాతీయ స్థాయిలో నిర్ణాయక పాత్ర పోషించగలిగితే భవిషత్తులో అది ప్రతిపక్షాలకు ఉపకరిస్తుంది.