ఇరవై మూడేళ్ల కింద ఏర్పడిన జార్ఖండ్్ రాష్ట్ర ముఖ్యమంత్రి సోమవారం విశ్వాస పరీక్షలో నెగ్గడం విచిత్రం కాదు కానీ జార్ఖండ్్ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి బీజేపీ పన్నిన కుట్ర మాత్రం ఘోరంగా విఫలమైంది. సోమవారం నాటి విశ్వాస పరీక్షలో జార్ఖండ్్ శాసన సభలో మొత్తం 81 మంది ఉంటే 47 మంది జార్ఖండ్్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్.జె.డి. సీపీఐ (ఎం.ఎల్.) సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. 29 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. అవినీతి ఆరోపణ కింద ఎన్ఫోర్స్మెంటు డైరెక్టొరేట్ చాలా కాలంగా ఇటీవలి దాకా ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సొరేన్ ను ముప్పు తిప్పలు పెట్టింది. నోటీసుల మీద నోటీసులు జారీ చేసింది. చివరకు సొరేన్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి తీసుకొచ్చింది. సొరేన్ మంత్రివర్గ సభ్యుడు చంపై సొరేన్ తదుపరి ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు. ఆ దశలో జార్ఖండ్ గవర్నర్ సి.పి. రాధాకృష్ణను సైంధవుడిలా అడ్డం పెట్టారు. రెండు రోజుల పాటు ఉలక లేదు పలక లేదు. అంటే దాదాపు 48 గంటల పాటు జార్ఖండ్్లో ప్రభుత్వమే లేకుండా పోయింది. తప్పుకోక తప్పదని హేమంత్ సొరేన్ నిర్ణయించుకున్న తరవాత చంపై సొరేన్ ముఖ్యమంత్రి స్థానంలోకి వస్తారనుకున్నారు. రెండు రోజులు ఆలస్యంగానైనా ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తన బలం నిరూపించుకోవడానికి పది రోజుల గడువు ఉన్నా ఆయన సోమవారమే విశ్వాస పరీక్షకు సిద్ధ పడ్డారు. విశ్వాస పరీక్ష జరిగినప్పుడు 77 మంది సభలో ఉన్నారు. 47 మంది చంపై సొరేన్ ప్రభుత్వాన్ని సమర్థించారు. అయితే విశ్వాస పరీక్ష లాంటివి జరిగినప్పుడు చాలా రాష్ట్రాలలో ఒక విచిత్రమైన ఆనవాయితీ కొనసాగుతోంది. తమకు మద్దతు ఇచ్చే సభ్యులను ఎదుటి పక్షం కోనేయకుండా వారిని మరో రాష్ట్రంలోకి తీసుకెళ్లి జాగ్రత్త పడ్తున్నారు. చంపై సొరేన్ కూడా తన మద్దతుదార్లను హైదరాబాద్కు చేర్చారు. వారు ఆదివారం రాత్రే రాంచీ చేరుకున్నారు. డబ్బిచ్చి ఎమ్మెల్యేలను కొనడం బీజేపీ సునాయాసంగా చేయగలిగినపని. అందుకే వారిని హైదరాబాద్కు తీసుకురావలసి వచ్చింది. హేమంత్ సొరేన్ రాజీనామా చేయడానికి ముందు పెద్ద నాటకమే జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికార్ల బృందం దిల్లీలోని హేమంత్ సొరేన్ ఇంటి మీద దాడి చేసింది. కానీ అక్కడ సొరేన్ కనిపించలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముఖ్యమంత్రి కనిపించకుండా పోయారని బీజేపీ ప్రచారం చేసింది. కానీ అందరి కళ్లూ కప్పి హేమంత్ సొరేన్ జార్ఖండ్ చేరుకుని కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి కావలసిన పనులన్నీ చక్కబెట్టారు. జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వాన్ని కాపాడడానికి హేమంత్ సొరేన్ ఒక రకంగా పెద్ద సాహసమే చేశారు. జార్ఖండ్్ నుంచి దిల్లీ వెళ్లడానికి వినియోగించిన విమానాన్ని అక్కడే వదిలేసి రోడ్డు మార్గాన 1300 కిలో మీటర్లు ప్రయాణించి రాంచీ చేరుకున్నారు. నిఘా విభాగాల, మీడియా కళ్లుగప్పి ఆయన తన లక్ష్యం సాధించారు.
గత బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అధికారులు హేమంత్ సొరేన్ ను ఏడుగంటలపాటు ప్రశ్నలతో ముంచెత్తారు. తనను అరెస్టు చేస్తారని గ్రహించిన సొరేన్ చాలా ధైర్యంగా వ్యవహరించారు. అరెస్టు మెమో మీద సంతకం చేయడానికి నిరాకరించారు. ఆ తరవాత రాజీనామాచేసి ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఏర్పాట్లు చేసేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రికార్డు ప్రకారం సొరేన్ అరెస్టు అయిఉంటే జార్ఖండ్్ లో రాష్ట్రపతి పాలన విధించేది. దీనికి అడ్డుకట్టవేసి సొరేన్ ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు. ఈ లోగా చంపై సొరేన్ శాసన సభా పక్ష నాయకుడిగా ఎన్నికైపోయారు. అరెస్టు మెమో మీద సంతకం చేయనందువల్ల హేమంత్ సొరేన్ను గవర్నర్ నివాసానికి తీసుకెళ్లారు. ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాల శాసనసభ్యులతోపాటు చాలా మంది శాసనసభ్యులు అప్పటికే అక్కడికి చేరుకోవడంతో గవర్నర్ చేయగలిగింది ఏమీ లేకుండా పోయింది. వెంటనే చంపై సొరేన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ హేమంత్ సొరేన్ శాసనసభలో బల పరీక్షకు అనుమతించింది. ఇది జార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభ్యుల్లో మరింత ఉత్సహం నింపింది. విశ్వాస పరీక్షకు ముందు హేమంత్ సొరేన్ దమ్ముంటే తనమీద ఉన్న అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని సవాలు విసిరారు. ఆరోపణలు కనక రుజువైతే రాజకీయాలనుంచి తప్పుకోను కానీ జార్ఖండ్లో ఉండను అని కూడా చెప్పారు. రాజ్ భవన్ ప్రోద్బలం మేరకు ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన జనవరి 31వ తేదీ జార్ఖండ్్ చరిత్రలో చీకటి రోజు అని హేమంత్ సొరేన్ అన్నారు. జార్ఖండ్లో ఏ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు బీజేపీ కొనసాగనివ్వదని కూడా ఆయన తెలియజేశారు. అది నిజమే. జార్ఖండ్్ 2000 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే 23 ఏళ్ల కాలంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంపై సొరేన్ తో కలిపి 12 మంది ముఖ్యమంత్రులయ్యారు. నిర్బంధంలో ఉన్నప్పటికీ తాను కన్నీళ్లు కార్చననీ సమయం వచ్చినప్పుడు ఫ్యూడల్ శక్తులకు గట్టి సమాధానం చెప్తానని హేమంత్ ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ ఆదివాసులను అంటరానివారిగా పరిగణిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. విశ్వాస పరీక్షలు, బలాబలాలు, బీజేపీ కుట్రలు ఎలా ఉన్నా సోమవారం చంపై సొరేన్ ప్రభుత్వం బల పరీక్ష?లో నెగ్గడం ఒక రకంగా బలహీన పడ్డట్టు కనిపిస్తున్న ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు కొత్త ఊపిరులూదడానికి ఉపకరిస్తుంది. ఈ మధ్య కాలంలో ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలో భిన్న రాగాలు వినిపిస్తున్నాయి. ఈ ఐక్య సంఘటనకు సూత్రధారి అయిన నితీశ్ కుమార్ అలవాటు ప్రకారం మళ్లీ విద్రోహానికి తలపడి బీజేపీలో చేరిపోయారు. మరోవేపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోకసభ ఎన్నికల్లో అన్ని స్థానాలకు తమ తృణమూల్ పార్టీ అభ్యర్థులే పోటీ చేస్తారని సర్దుబాటుకు దారులు మూసేశారు. వామపక్ష పార్టీలతో ఆమెకు సయోధ్య ఎటూ కుదరదు కానీ కనీసం కాంగ్రెస్తోనైనా సీట్ల సర్దుబాటు కుదిరితే కేంద్రంలో బీజేపీని గద్దె దింపడం సాధ్యం కావచ్చు అనుకుంటున్న దశలో మమత బిగుసుకు కూర్చున్నారు. ఇంకోవేపు పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని ప్రకటించింది. ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ మొదటి నుంచి కాంగ్రెస్ను ఓడిరచి ఆ పార్టీకి పలుకుబడి ఉన్న చోటల్లా తమ ఆధిపత్యం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. జార్ఖండ్్ లో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గడం ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు కూడా సానుకూలమైన అంశమే.