నితీశ్ బీజేపీతో మళ్లీ చేయి కలపడంవల్ల మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారును వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఓడిరచడానికి ఉపయిక్తంగా ఉంటుందనుకున్న ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో కొంత నిజం ఉండొచ్చు. కానీ మోదీ పల్లకి బోయిలా మారిన గోదీ మీడియా ఈ ప్రచారం విస్తృతంగా చేస్తోంది. ‘‘ఇండియా’’ కూటమి ఏర్పడడానికి నితీశ్ కుమార్ సూత్రధారిగా వ్యవహరించినందువల్ల ఆయన హఠాత్తుగా ఆర్.జె.డి.తో ఉన్న బంధం తెంచేసుకుని బీజేపీ విష కౌగిలిలో ఒదిగిపోయారు. దానివల్ల ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు కొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. ఈ ఐక్య సంఘటనకు సూత్రధాని నితీశ్ అన్న మాటా నిజమే. కానీ ప్రతిపక్షాల ఐక్యత ఒక్క నితీశ్ కుమార్ మీద ఎన్నడూ ఆధారపడి లేదు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనకు నితీశ్ కుమార్ ను సమన్వయకర్తగా నియమించాలన్న ప్రతిపాదనను బాహాటంగా వ్యతిరేకించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధిపతి, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా నితీశ్ బీజేపీతో అంటకాగినందుకు అభ్యంతరం పెడ్తూనే ఉన్నారు. ఇలా అమాంతం ఫిరాయించడం వల్ల నితీశ్ పొరపాటు చేశారని కేజ్రీవాల్ అన్నారు. ప్రతిపక్షాలను ఒక్క తాటి మీదకు తీసుకురావడం కోసం నితీశ్ దాదాపు గత రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశం జరగడానికి ఆయన కృషే ప్రధాన కారణం. వ్యక్తిగతంగా నితీశ్ కుమార్ అవినీతిపరుడన్న ఆరోపణలైతే లేవు. రాజకీయాలలో ఆయనకు చాలా అనుభవం ఉండడంతో పాటు చాతుర్యం కూడా ఉంది. ఆయనకు ధన దాహం లేకపొవచ్చు కానీ వల్లమాలిన అధికార దాహం ఉంది. గత 14 ఏళ్లుగా ఆయన ఈ అధికార దాహాన్ని చాలా బహిరంగంగా నిస్సిగ్గుగా ప్రదర్శించారు. అందుకే బీజేపీతో జట్టు కట్టడం, మళ్లీ వదులుకోవడం, మళ్లీ పిల్లి మొగ్గ వేసి బీజేపీకి బద్ధ శత్రువులైన రాజకీయ పక్షాలతో ఐక్య సంఘటన ఏర్పాటు చేయడం నితీశ్ కు ఒక రాజకీయ కేళీ విలాసంగా మారింది. ప్రతిపక్ష ఐక్యత కోసం పాటు పడ్తున్నందువల్ల దేశంలో వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రతిపక్షాలను కూడగట్టడం కోసమే ఆయన పాలనా బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు వదిలేశారు. ఈ ప్రతిపక్ష పార్టీలలో చాలా వాటికి కాంగ్రెస్ మీద సదభిప్రాయం లేదు. ఈ అనుమానాలను, అభ్యంతరాలను తొలగించడానికి నితీశ్ చాలానే శ్రమ పడ్డారు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలో ఉన్న కొన్ని లోపాలు నితీశ్ ను నిరాశ పరిచాయి. అంత మాత్రం చేత తన విశ్వాసాలను, సిద్ధాంతాలను వదులుకుని అమాంతం ఫిరాయించవలసిన అగత్యం నితీశ్ కు ఏమీ లేకపోయినా ఆయన విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు. తన, తన పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన పిల్లి మొగ్గ వేశారా అంటే ప్రతిపక్షా పార్టీలు ఆయనను వ్యతిరేకించిన సందర్భమే లేదు. ఇంత జరిగిన తరవాత కూడా నితీశ్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన ఆర్.జె.డి. నాయకుడు తేజస్వీ యాదవ్ తమ దృష్టిలో ఇప్పటికీ గౌరవనీయుడేనంటున్నారు. బిహార్లో జె.డి.(యు)-ఆర్.జె.డి. తదితర పక్షాల ఐక్య సంఘటన అధికారంలోకి వచ్చిన తరవాత తేజస్వీ యాదవ్ నితీశ్ను అవమానించేటట్టుగా, ఈసడిరచేట్టుగా మాట్లాడిన సందర్భమే లేదు. నితీశ్ బీజేపీతో కత్తు కలిపినంత మాత్రాన ఆయన చొరవతో బిహార్లో కుల గణన పూర్తి చేయడంవల్ల కలిగే ప్రయోజనానికి నష్టమేమీ లేదు. ఎందుకంటే ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న చిత్తశుద్ధి, సామర్థ్యం ఉన్న తేజస్వీ ఉండనే ఉన్నారు. బిహార్ కులగణన దేశమంతటా ఆ పని జరగాలన్న డిమాండ్లు పెరిగాయి. బీజేపీ వద్దన్నా కద్దన్న ఇది రాబోయే ఎన్నికలలో ప్రధానాంశంగా ఉండి తీరుతుంది. నితీశ్ కుమార్ ఎన్.డి.ఎ.లో చేరడంవల్ల ఎన్.డి.ఎ.కే ఎక్కువ నష్టం జరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు.
2020 శాసనసభ ఎన్నికలలో జె.డి.(యు) బలాన్ని దిగజార్చడం కోసం కుట్రలు పన్నిన బీజేపీతోనే మళ్లీ పొత్తు పెట్టుకోవడానికి నితీశ్ లో గూడుకట్టుకున్న అధికార దాహం తప్ప మరో కారణం ఏదీ కనిపించడం లేదు. శరద్ పవార్ సైతం నితీశ్ అయిదో పిల్లిమొగ్గను మెచ్చలేదు. నితీశ్ ద్రోహం చేశారని కాంగ్రెస్ తూలనాడిరది. సరైన సమయంలో బిహార్ ప్రజలు నితీశ్ కు బుద్ధి చెప్తారని కాంగ్రెస్ విమర్శించింది. బిహార్ ప్రజలు బుద్ధి చెప్పకముందే నితీశ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుకు, జె.డి.(యు) అస్తిత్వానికి భంగం కలగక తప్పదు. 2025లోగానే జె.డి.(యు) అంతమవుతుందని తేజస్వీ యాదవ్ నమ్మకంగా చెప్తున్నారు. తాజాగా నితీశ్ మంత్రి మండలిలో ఉప ముఖ్యమంత్రి పీఠం మీద ఆసీనులైన ఇద్దరు బీజేపీ నాయకులకూ నితీశ్ మీద నమ్మకమూ లేదు. గౌరవమూ లేదు. అసెంబ్లీ స్పీకర్ పదవి తమకే దక్కాలని బీజేపీ భావిస్తోంది. అవసరమైతే ఆర్.జె.డి. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే తమ సత్తా నిరూపించుకోవచ్చు. రాజకీయ నాయకులు పార్టీలు ఫిరాయిస్తే నితీశ్ కుమార్ పార్టీ ఫిరాయించకుండానే కూటములనే మారుస్తుంటారు. నితీశ్-తేజస్వీ బంధాన్ని ఎలా విడగొట్టాలా అని కాచుకు కూర్చున్న బీజేపీ ఆ పని చేసే చూపించింది. కానీ బీజేపీ అసలు ఉద్దేశం జె.డి.(యు) అస్తిత్వమే లేకుండా చేయడం. ఆ లక్ష్యం నెరవేరాడానికి బీజేపీ పల్టూరాంలనే బురిడీ కొట్టించగలదు. 2019 లోకసభ ఎన్నికల సమయంలో నితీశ్ బీజేపీతో ఉన్నారు. అదుకనే రెండు పక్షాలూ కలిసి 39 లోకసభ స్థానాలు సంపాదించగలిగాయి. ఇప్పుడు ఆ లెక్కలు కుదరక పోవచ్చు. జె.డి.(యు) పరిస్థితి అద్వానంగా మారొచ్చు. నితీశ్ ఎప్పుడు ఏ కూటమి పక్షాన ఉన్నా అందులో తన అధికార కాంక్ష తీర్చుకోవడమే ప్రధానం. ఎన్ని సార్లు కోట్లు మార్చినా 14 ఏళ్లు బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక నాయకుడు అన్న రికార్డు అయితే సాధించగలిగారు. డబ్బు సంచుల మీద ఆశ లేకపోయినా అధికార పీఠం వదలడానికి ససేమీ అంగీకరించని తత్వం నితీశ్ లో దండిగా కనిపిస్తుంది. ఈ స్థితిలో ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన నిరాశ పడి అస్త్ర సన్యాసం చేయనక్కర్లేదు. అయితే తన వ్యూహాలను, ఎత్తుగడలను మార్చుకోగలగాలి. ఉన్న సమయం తక్కువ కనక వడివడిగా అడుగులు వేయ గలగాలి. బీజేపీ విద్వేష పూరిత సిద్ధాంతాన్ని ఎదుర్కోగలిగిన సిద్ధాంత ప్రాతిపదిక సమకూర్చుకోవాలి. ఇది సైద్ధాంతిక పోరాటం అన్న మాటను ఆచరణలో నిరూపించు చూపించాలి. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడం, ప్రజానుకూల సైద్ధాంతిక ప్రాతిపదిక సమకూర్చుకోవడం సాధ్యమేనని రుజువు చేయగలగాలి. మోదీపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను సంఘటితం చేయగలగాలి. నితీశ్ లాంటి వారు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఫ్రజానుకూల సిద్ధాంతమే శాశ్వతం.