పరిపాలనను గుప్పెట్లో పెట్టుకోవాలన్న నిరంతర దుగ్ధ ఉన్న పాకిస్థాన్ సైన్యం అంచనాలు అన్నీ తారుమారయ్యాయి. సైన్యం మద్దతు ఉన్న మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) ఘన విజయం సాధించాలని పాక్ సైన్యం పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము అయినాయి. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో (పార్లమెంట్) మొత్తం 265 స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 133 సీట్లు ఉండాలి. కానీ నవాజ్ షరీఫ్ పార్టీ 73 సీట్లతో సంతృప్తి పడవలసి వచ్చింది. ఆసిఫ్ అలీ జర్దారీ, ఆయన కుమారుడు బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీకి 54 స్థానాలు మాత్రమే దక్కాయి. విచిత్రం ఏమిటంటే పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇస్లాం నాయకుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఎన్నికల చిహ్నం కేటాయించలేదు. కానీ ఆయనను సమర్థించే వారు 102 మంది స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారు. పాకిస్థాన్లో అమలులో ఉన్న విధానం ప్రకారం రాజకీయ పార్టీ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఉంది. ఇమ్రాన్ ఖాన్ మీద అనేక ఆరోపణలు మోపి ఎన్నికలకు ముందు ఆయనను జైలులో పెట్టి ఎన్నికలలో పోటీ చేయకుండా చేశారు. పాకిస్థాన్ సైన్యం ఎత్తుగడలలో దిట్ట కావచ్చు. కానీ ప్రజల మనోభావాలను పసిగట్టడంలో ఘోరంగా విఫలమైనందువల్లే నవాజ్ షరీఫ్ పార్టీని ఎంత వెనకేసుకొచ్చినా ఆయన పార్టీ 73 స్థానాల దగ్గరే ఆగిపోయింది. పాకిస్థాన్ ప్రజలు వంశపారంపర్య పాలనతో, సైన్యం జోక్యంతో విసిగి పోయి ఉన్నారు. అందుకే సైన్యం పాచికలు పారని రీతిలో తీర్పు చెప్పారు. ఇమ్రాన్ పార్టీకి అనుకూలురైన ఇండిపెండెంట్లను భారీ సంఖ్యలో గెలిపించారు. 2002లో అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. అయినా సైన్యం ఆయనను వేటాడడం మానలేదు. ఒక వేపు పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. మరో వేపు మిలిటెంట్ల దాడులు జన జీవనాన్ని చిందరవందర చేస్తున్నాయి. ఈ రెండు సమస్యలను పరిష్కరించే మార్గమైతే సైన్యం దగ్గర లేదు కానీ ఎన్నికల ప్రక్రియలో బాహాటంగా జోక్యం చేసుకుని, నవాజ్ షరీఫ్ పార్టీకి మద్దతిచ్చి కొత్త ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి చేయవలసిందంతా చేసింది. అయినా ఫలితం దక్కలేదు. నవాజ్ షరీఫ్ పార్టీ జాతీయ అసెంబ్లీలో కనీసం వంద స్థానాలైనా సంపాదించి సునాయాసంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న పాకిస్థాన్ రాజకీయ వ్యాఖ్యాతల అంచనాలన్నీ తప్పాయి. ఇమ్రాన్ పార్టీకి ఎన్నికల చిహ్నం ఇవ్వడానికి నిరాకరించి నందువల్ల ఆయన మద్దతు దార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరు. ఆ పార్టీని సమర్థిస్తున్న మహిళలకు, సాంకేతిక నిపుణులకు ఇప్పుడు కేవలం ఒక్క స్థానం మాత్రమే సంపాదించిన మజ్లిస్-ఎ-వహాదతుల్ ముస్లిమీన్ తో జత కట్టక తప్పని పరిస్థితి ఏర్పడిరది. ఇమ్రాన్ ఖాన్ ను అనేక రకాలుగా వేదించినందుకు సైన్యం మీద ఉన్న జనాగ్రహం ఇండిపెండెంట్లను అధిక సంఖ్యలో గెలిపించడం దగ్గరే ఆగిపోయింది. పాకిస్థాన్ గత చరిత్రను గమనిస్తే ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు ఎక్కువ కాలం బతికి బట్ట కట్టిన ఉదంతాలు తక్కువ. అనేక సార్లు సైన్యం అధికారం చేపట్టి ప్రజాస్వామ్య ప్రక్రియను ధ్వంసం చేసింది.
ఈ స్థితిలో ఏదో ఒక పక్షమో, కొన్ని పార్టీలు కలిసో ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిరది. నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని ముస్లిం లీగ్ (ఎన్), బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఇటీవలి ఎన్నికలలో ప్రత్యర్థి పక్షాలుగా ఉన్నప్పటికీ ఆ రెండు పక్షాలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయక తప్పదు. ఈ రెండు పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుంటే మళ్లీ సైన్యం రంగంలోకి దిగి తన పని తాను చేసుకుపోయి ప్రజాస్వామ్యం గొంతు నులిమివేస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో నవాజ్ షరీఫ్ కీలక పాత్ర పోషించక తప్పదు. ఆయన మీదా అవినీతితో సహా అనేక ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ లో మనలేక ఆయన ప్రవాస జీవితం గడపవలసి వచ్చింది. ఎన్నికలకు నాలుగు నెలల ముందు మాత్రమే ఆయన పాకిస్థాన్ తిరిగి వచ్చారు. ఆ తరవాత కూడా ఆయన రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించకుండా నిష్క్రియాపరుడిగా ఉండిపోయారు. ఎన్నికల ప్రచారం కూడా 20 రోజుల ముందు మాత్రమే కొనసాగించారు. ఇంతకు ముందు తాను ఎన్ని ఇబ్బందులు పడవలసి వచ్చిందో ప్రజల ముందు గోడు వెలిబుచ్చారు తప్ప విజయం సాధిస్తే తమ పార్టీ ఏం చేస్తుందో చెప్పలేక పోయారు. నవాజ్ సొంత రాష్ట్రమైన పంజాబ్ లో ఎక్కువ సీట్లు సంపాదించ గలిగారు. పాకిస్థాన్ లో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితిని గ్రహించడంలో నవాజ్, బిలావల్ భుట్టో కూడా విఫలమయ్యారు. నవాజ్ లాప్టాప్ లు ఇస్తాను, విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను అని ప్రచారం చేశారు తప్ప రాజకీయ భవిష్యత్ చిత్రపటం ఎలా దిద్ది తీర్చుతారో మాత్రం చెప్పలేక పోయారు. ఇమ్రాన్ మీద జనం పెట్టుకున్న ఆశలను సైన్యం వమ్ము చేసింది. ఇమ్రాన్ పార్టీ మినహా మిగతా రెండు పార్టీలు వంశ పారంపర్యానికి ప్రాధాన్యం ఇచ్చేవే. వ్యక్తిగతంగా తన పరిస్థితి ఏమిటి అన్న అవగాహన ఉన్నందువల్ల తన తమ్ముడు షాబాజ్ షరీఫ్ను ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నారు. తమ బలహీనత తెలిసిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు ప్రధానమంత్రి పదవి కోసం పేచీ పెట్టకపోవడం గుడ్డి కన్నా మెల్ల నయం అనుకోవాలి. నవాజ్ షరీఫ్ ఆలోచనల్లో ఏ మాత్రం కొత్తదనం లేదు. ప్రజల ఆకాంక్షలను అసలే పట్టించుకోలేదు. గతంలో ప్రధానమంత్రిగా పని చేసిన అనుభవం ఆయనకు ప్రస్తుతం ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి అనువైన మార్గం చూపించలేక పోయింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడిని సమర్థిస్తూ ఉంటుంది. గతంలో ఇమ్రాన్ ఖాన్ ను ప్రోత్సహించింది కూడా పాక్ సైన్యమే. ఆ తరవాత ఇమ్రాన్ సైన్యాన్ని విమర్శించడం మొదలు పెట్టారు. ఇంతకు ముందు నవాజ్ షరీఫ్ కూడా అదే పని చేసేవారు. ఇప్పుడు ఆయన సైన్యాధిపతులకు ప్రియ మిత్రుడై పోయారు. నవాజ్ చేతిలో ప్రభుత్వ పగ్గాలు ఉండడం ఇప్పుడు పాకిస్థాన్ కు నచ్చొచ్చు. ఆ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే కాక బలహీనమైందిగా ఉంటుంది కనక సైన్యానికి నచ్చడంలో ఆశ్చర్యం లేదు. అయితే పాకిస్థాన్ లో అనిశ్చిత పరిస్థితి కొనసాగడం మాత్రం ఖాయం. ప్రభుత్వ ఏర్పాటులోనే అనేక సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఇల్లలకగానే పండగ కానట్టు కొత్త ప్రభుత్వం ఏర్పడితే పాకిస్థాన్ గట్టెక్కుతుందన్న హామీ లేదు. ఇమ్రాన్ ఖాన్ పడ్డ ఇబ్బందులే కొత్త ప్రభుత్వాధినేతలు పడక తప్పదు.