అయిదు విడతలు పూర్తి అయిన సార్వత్రిక ఎన్నికల సరళిని చూసి మోదీ నాయకత్వంలోని బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడ్తున్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేసినందువల్ల తమకు ఓట్లు రాలవని మోదీకి తెలిసిపోయింది. ముస్లింల మీద విద్వేషం నింపడంవల్ల బీజేపీ మీద అంతో ఇంతో అభిమానం ఉన్న ఓటర్లలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితిలో మోదీకి తోచిన ఒకే ఒక ఉపాయం ఆక్రమిత కశ్మీర్ (పి.ఒ.కె.) ప్రస్తావన తీసుకురావడం. అవసరమైనప్పుడల్లా మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామని హుంకరిస్తుంటారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయితే ఆరు నెలల్లోగా ఆక్రమిత కశ్మీర్ భారత్ లో భాగం అవుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ గంభీరమైన ప్రకటనలు చేస్తున్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీని ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి ఎవరు ఆపారు అని అడిగితే బీజేపీ నాయకులందరి నాలుక పిడచకట్టుకు పోతుంది. 2019 ఆగస్టు 5న కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని రద్దు చేసిన సమయంలో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ ఆక్రమిత కశ్మీర్ పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తే అమిత్ షా ఊగి పోతూ ‘‘ప్రాణమైనా ఇస్తాం కానీ ఆక్రమిత కశ్మీర్ను వదులుకోం’’ అని గొంతు చించుకుని మరీ చెప్పారు. ఆ మాటచెప్పి అయిదేళ్లు గడిచింది. మరి మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటాం అని చెప్పే మాటలు బూటకం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచినా, ఓడినా ఎన్నికలు పూర్తి అయితే బీజేపీ ఆక్రమిత కశ్మీర్ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా అటకెక్కిస్తుంది. అసోం ముఖ్యమంత్రి హేమంత బిస్వశర్మ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచార సభల్లో మళ్లీ పి.ఒ.కె. పల్లవి ఎత్తుకున్నారు. పాకిస్థాన్ లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. కశ్మీర్ పాకిస్థాన్లో భాగం అయిపోతుంది అని అక్కడి నాయకులు పోటీలు పడి చెప్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే ఆక్రమిత కశ్మీర్ తమదేనని పాకిస్థాన్ ఎన్ని మాటలు చెప్తున్నా దాన్ని ప్రత్యేక ప్రాంతంగానే పరిగణిస్తోంది తప్ప పాకిస్థాన్ లో అంతర్భాగంగా చూడడం లేదు. అందుకే అక్కడ ఓ ప్రధానమంత్రి ఉంటారు. ప్రత్యేక ప్రభుత్వం ఉంటుంది. ఇటీవల ఆక్రమిత కశ్మీర్ ప్రజలు అధిక ధరలకు వ్యతిరేకంగా పాకిస్థాన్ పై తిరగబడ్తున్నారు. వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మే పదో తేదీ నుంచి ఆక్రమిత కశ్మీర్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఒక వేళ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయిస్తే మన సేనలు ఎదురు చెప్పవు. మరి ఇన్నాళ్లుగా ఆ పని చేయడానికి ముహూర్తం ఎందుకు కుదరలేదు. ఎన్నికల సమయంలోనే ఆ విషయం ఎందుకు లేవనెత్తుతున్నారు?
ఆక్రమిత కశ్మీర్కు సుదీర్ఘ చరిత్ర ఉంది. అందులో రెండు భాగాలున్నాయి. పూంచ్ పక్కన ఉన్నది ఒక భాగం. దీన్ని పాకిస్థాన్ ఆజాద్ కశ్మీర్ అంటుంది. మనం ఆక్రమిత కశ్మీర్ అంటున్నాం. రెండవది గిల్గిట్, బాల్టిస్థాన్ ప్రాంతం. దీన్ని పాకిస్థాన్ చాలా కాలం ఉత్తర ప్రాంతం అనే ప్రస్తావించేది. ఈ ప్రాంతాన్ని మనం మన భూభాగం కిందే పరిగణిస్తున్నాం. అందుకే జమ్మూ-కశ్మీర్ శాసన సభలో కొన్ని నియోజకవర్గాలు వదిలేస్తున్నాం. కశ్మీర్ భారత్లో భాగమని పాకిస్థాన్ ఎప్పుడూ అంగీకరించలేదు. అందుకే స్వాతంత్య్రం వచ్చిన వెంటనే దాడికి దిగింది. అప్పటికి కశ్మీర్ భారత్లో విలీనం కాలేదు. అనేక సంస్థానాలు భారత్లో చేరిపోయినా రాజా హరీ సింగ్ స్వతంత్రంగా ఉండాలనుకున్నారు. జమ్మూ-కశ్మీర్, లడాఖ్, లేప్ా, హిమాచల్లోని కొన్ని భాగాలను కలిపి డొగ్రిస్థాన్ ఏర్పాటు చేయాలన్నది ఆయన కల. కానీ పాకిస్థాన్ దాడిని ఎదుర్కోలేక భారత్ శరణు జొచ్చాడు. విలీనం అయితే తప్ప సహాయం చేయబోమని నెహ్రు, పటేల్ పట్టుబట్టడంతో 1947 అక్టోబర్ 26న తప్పనిసరి పరిస్థితిలో హరీసింగ్ కశ్మీర్ను భారత్లో విలీనం చేయలేదు. హరీసింగ్ కశ్మీర్ను భారత్లో విలీనం చేయకముందే బ్రిటిష్ సైన్యాధికారి మేజర్ బ్రౌన్ గిల్గిట్, బాల్టిస్థాన్ను పాకిస్థాన్కు కట్టబెట్టారు. హరీసింగ్ హయాంలోనే జమ్ము నుంచి అయిదు లక్షల మంది ముస్లింలను తరిమేశారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే రాజా హరీసింగ్ కశ్మీర్ను భారత్ లో విలీనం చేసి ఉంటే ఆక్రమిత కశ్మీర్ ఊసే ఉండేది కాదు. పాక్ దాడికి తట్టుకోలేక హరీ సింగ్ డబ్బా డవాలు సర్దుకుని జమ్ము వెళ్లిపోయారు. ఆయన మళ్లీ ఎప్పుడూ కశ్మీర్కు రాలేదు. 1948 డిసెంబర్ 31న కాల్పుల విరమణ జరిగింది. వ్యవహారం ఐక్యరాజ్య సమితికి వెళ్లింది. అమెరికా, యూరప్ పాకిస్థాన్ను సమర్థించాయి. కానీ ఐక్యరాజ్య సమితిలో ఆ దేశాల పన్నాగాలను నెహ్రూ సాగనివ్వలేదు. సిమ్లా ఒప్పందం ప్రకారం కశ్మీర్ వ్యవహారం భారత-పాకిస్థాన్ ద్వైపాక్షిక అంశం అని అంగీకరించినందువల్ల అప్పటి నుంచి పాకిస్థాన్ ఐక్య రాజ్య సమితిలో ఆ విషయాన్ని పరోక్షంగా తప్ప ప్రత్యక్షంగా ప్రస్తావించే అవకాశం లేకుండా పోయింది. సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయాలని బీజేపీకి పూర్వ రూపమైన జనసంఫ్ు చేసిన ఆందోళనను ఎలా విస్మరించగలం. కాల్పుల విరమణ జరిగినప్పుడు ఆక్రమిత కశ్మీర్ అయితే మనకు దక్కలేదు కానీ పాక్ సేనలు ఆక్రమించుకున్న చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకోగలిగాం. అప్పుడు ఆ సీమను కాల్పుల విరమణ రేఖ అన్నాం. ప్రస్తుతం వాస్తవాధీన రేఖ అంటున్నాం. ఈ వాస్తవాధీన రేఖనే భారత-పాకిస్థాన్ మధ్య సరిహద్దుగా గుర్తించాలని బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి చేసిన ప్రయత్నాన్ని మోదీ, అమిత్ షా కప్పి పుచ్చవచ్చు. కానీ దేశ ప్రజలు ఎలా మరిచిపోగలరు. ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి యుద్ధం చేసి సాధించుకోవడం. రెండు ఆక్రమిత కశ్మీర్ ప్రజలను మనకు అనుకూలంగా మలుచుకోవడం. పాకిస్థాన్ దగ్గరా అణ్వస్త్రాలు ఉన్నాయి కనక యుద్ధం విపత్కర నిర్ణయమే అవుతుంది. మోదీ ప్రభుత్వం నిరంతరం ముస్లింలపై ద్వేషం నింపుతూ ఉంటే ఆక్రమిత కశ్మీర్లోని ముస్లింల మద్దతు సంపాదించడం అసంభవం. ఎన్నికలు ముగిస్తే ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామన్న ప్రకటనలు తాటాకు మంటలా చల్లారిపోక తప్పదు.