ఈ ఏడాది భారత రత్నాల ఉల్బణం కనిపిస్తోంది. ఏకంగా అయిదుగురికి భారత రత్న ప్రకటించారు. ఇందులో కూడా మోదీ ఓ పద్ధతి అనుసరించారు. అందరికన్నా ముందు ఇతర వెనుకబడిన కులాల వారికి 26 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన కర్పూరీ ఠాకూర్కు భారత్ రత్న ఇస్తున్నట్టు ప్రకటించారు. అప్పుడు ఇది బీజేపీ మండల్ రాజకీయాలలో భాగం అనుకున్నాం. ఆ తరవాత బీజేపీ అగ్రనేత, రామమందిర ఉద్యమం, రథ యాత్ర ద్వారా బీజేపీ క్రమంగా అధికారంలోకి రావడానికి బాటలు వేసిన లాల్కృష్ణ అడ్వాణీకి భారత్రత్న ప్రకటించారు. మళ్లీ వారం రోజులు గడిచిన తరవాత ఏకంగా ముగ్గురికి – మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్కు కూడా భారతరత్న ప్రకటించేశారు. 1999లో నలుగురికి భారత రత్న ఇచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత 2016, 2017, 2018, 2020, 2021, 2022, 2023లో ఎవరికీ భారత రత్న ఇవ్వలేదు. అధికారాంతంలో ఏకంగా అయిదుగురికి వాయిదాల పద్ధతి మీద భారత రత్న ఇచ్చేశారు. భారత రత్న మన దేశంలో అన్నింటికన్నా ప్రధానమైన పౌర సత్కారం. కొన్ని సంవత్సరాలు ఎవరికీ ఈ సత్కారం ఇవ్వని సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. మాజీ ప్రధానుల్లో చూస్తే మండల్ కమిషన్ దుమ్ము దులిపిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్కు మాత్రమే భారతరత్న ఇవ్వలేదు. మండల్ రాజకీయాల దృష్ట్యా చూస్తే వీపీ సింగ్కు ఆ గౌరవం దక్కి ఉండాల్సింది. క్రీడారంగంలో కీర్తి ప్రతిష్ఠ సంపాదించి పెట్టిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్కు ఈ సత్కారం దక్కాలన్న చిరకాల వాంఛ మాత్రం ఇప్పటికి తీరనే లేదు. పీవీ నరసింహారావుకు, స్వామినాథన్కు, చౌదరీ చరణ్ సింగ్కు భారత రత్న ఎందుకు ఇస్తున్నారో మోదీ వివరించారు. పీవీ నరసింహారావు దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట దశలో ఉన్నప్పుడు నూతన ఆర్థిక విధానాలు ప్రవేశ పెట్టి ఆర్థిక పరిస్థితిని పట్టాల మీదకు ఎక్కించారని మోదీ పేర్కొన్నారు. ఆయన గొప్ప పండితుడని, రాజనీతుజ్ఞుడని కూడా మోదీ పొగిడారు. ఆయన దూరదృష్టివల్లే దేశం ఆర్థికంగా ఎదిగిందని, దేశాభ్యున్నతికి ఆయన పునాదులు వేశారని కూడా మోదీ చెప్పారు. రైతుల బంధువు అయిన చౌదరీ చరణ్సింగ్కు, హరిత విప్లవానికి ప్రేరణ కలిగించిన ఎం.ఎస్. స్వామినాథన్కు భారత రత్న ఇచ్చామని మోదీ వివరించారు. ఇంతవరకు భారత రత్న అందుకున్న వారందరూ దీనికి అర్హులనే అనుకోవచ్చు. వారిలో లోపాలు ఉండి ఉండవచ్చు. కానీ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని అంచనా వేసినప్పుడు లోపాలోపాల మూల్యాంకనం జరిగి తీరుతుందనుకోవాలి. మోదీ హయాంలో ముఖ్యంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో భారత రత్న ఇవ్వడం వెనక రాజకీయాలు ఎటూ ఉంటాయి. ఇందులో విచిత్రమైన రాజకీయ పరిణామాలకు దారితీసిన సందర్భాలూ ఉన్నాయి. కర్పూరీ ఠాకూర్కు భారత రత్న ఇచ్చిన వెంటనే దాదాపు అదే భావధారకు చెందిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్.జె.డి. చేయి వదిలి మరోసారి మోదీ నాయకత్వంలోని ఎన్.డీ.ఏలో కత్తు కలిపారు. ఇప్పుడు చౌదరీ చరణ్ సింగ్ రైతు పక్షపాతి కనక ఈ సత్కారం అందజేస్తున్నామని చెప్తున్నారు. ఆయన మనవడు జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు. ఇంతకాలం ఆయన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ను అంటి పెట్టుకుని ఉండే వారు. తన తాతకు భారత రత్న దక్కినందుకు మహదానందంగా ఉందని జయంత్ చౌదరి చెప్తున్నారు. రాజకీయ దృక్కోణంతో చూస్తే ఆయనా త్వరలో ఎన్.డి.ఎ.లో చేరే సూచనలు దండిగా ఉన్నాయి.
స్వామినాథన్ హరిత విప్లవానికి ప్రేరణ కలిగించిన మాట వాస్తవమే. ఈ విప్లవం వల్లే మనదేశం అతి కష్టకాలాన్ని అధిగమించగలిగింది. ప్రస్తుతం ఆహార ధాన్యాల విషయంలో మన దేశం స్వయం సమృద్ధంగా ఉన్నదీ వాస్తవమే. ఆయన నాయకత్వంలోని కమిషన్ రైతుల వ్యవహారంలో అనేక సిఫార్సులు చేసింది. వీటిని పట్టించుకున్న నాథుడే లేడు. దిల్లీ పొలిమేరల్లో రైతులు ఏడాదికి పైగా బైఠాయించిన తరవాత గానీ మోదీ ప్రభుత్వం మూడు వివాదాస్పదమైన చట్టాలు వెనక్కు తీసుకోలేదు. అవి రైతులకు అపకారం చేసేవి అని మోదీ అంగీకరించలేదు. ‘మా తపస్సులో ఏదో లోపం ఉన్నట్టుంది’ అని వేదాంతం ప్రవచించారు. మద్దతుధర గురించి స్వామినాథన్ కమిషన్ కూడా సిఫార్సు చేసింది. మద్దతు ధరకు చట్ట ప్రతిపత్తి కల్పించాలని రైతులు కోరుతున్నారు. కమిషన్ సిఫార్సు చేసినా, రైతులు ఉద్యమించినా, మళ్లీ వచ్చే పదహారో తేదీన గ్రామీణ బంద్, దిల్లీలో ఆందోళన చేయనున్నా చలించని మోదీ…చరణ్ సింగ్కు, స్వామినాథన్కు భారత రత్న ఇచ్చి ఎవరిని నమ్మించాలని చూస్తున్నట్టో! ఏమైతేనేం బాబ్రీ మసీదు విధ్వంసానికి అనువైన వాతావరణం ఏర్పరచడానికి రథ యాత్ర సాగించిన అడ్వాణీకి, ప్రధానమంత్రిగా ఉంటూ మసీదును కాపాడడంలో విఫలమైన అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చేశారు. ఎవరికి ఎందుకు భారత రత్న ఇచ్చారో మోదీ ఎన్ని కబుర్లు చెప్పినా సార్వత్రిక ఎన్నికలలో ఓటమి భయం లేదా ‘‘అబ్కీ బార్ 400 పార్’’ అన్న నినాదం సఫలం కాదనే స్వస్వరూప జ్ఞానం ఉన్నందువల్లే అయిదుగురికి భారత రత్నలు టోకున ఇవ్వడం వెనక ఆయన రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల్ల్లో లబ్ధి పొందాలన్న లక్ష్యమూ అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఏ అంశాన్ని అయినా ఎన్నికల దృష్టిలో చూడగలిగిన చక్షువులు మోదీకి ఉన్నాయి. మోదీ సమీకరణలను, ఎన్నికల పొత్తును భారత రత్న సమీకరణలు, పొత్తులు అనొచ్చు. ఎవరెవరికి భారత రత్న ఇస్తున్నామో దఫ దఫాలుగా ప్రకటించడంలోనే మోదీ రాజకీయం ఉంది. పనిచేసి జనం మద్దతు సంపాదించడం కన్నా జనాన్ని ఆశ్చర్య చకితుల్ని చేసి ప్రయోజనం పొందడంలో మోదీని మించినవారు ఎవరుంటారు గనక! రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హరియాణాలో రైతుల్లో మోదీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది కనకే రైతు బాంధవుడైన చరణ్ సింగ్కు, వ్యవసాయ శాస్త్రజ్ఞుడైన స్వామినాథన్కు ఈ సత్కారం దక్కింది. అలాగే దక్షిణ భారతదేశంలో బీజేపీకి కాలుమోపే అవకాశం సంపాదించడానికి పీవీ నరసింహారావు, తమిళుడైన స్వామినాథన్కు ఈ సత్కారం బాగా ఉపయోగపడ్తుం దనుకుంటున్నారు. రేవడీలకు వ్యతిరేకినని చెప్పుకునే మోదీ భారత రత్న సత్కారాన్నే తాయిలంగా మార్చేశారు.