గత ఏప్రిల్-మే నెలల్లో బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు మమతా బెనర్జీని ఎలాగైనా గద్దె దించడానికి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సర్వ శక్తులూ ఒడ్డారు. అయితే ఎన్నికలకన్నా ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ నందిగ్రాం శాసనసభా నియోజక వర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. తృణమూల్కు ఆమె తిరుగు లేని నాయకురాలు. మునుపటికన్నా మరి కొన్ని సీట్లు ఎక్కువే సంపాదించారు. నందిగ్రాంలో మమతా బెనర్జీని ఓడిరచ గలిగిన బీజేపీ బెంగాల్లో మాత్రం ఆమె ప్రాభవానికి భంగం కలిగించలేకపోయింది. సహజంగానే తృణమూల్ కాంగ్రెస్ శాసనసభా పక్షం మమతా బెనర్జీనే నాయకురాలిగా ఎన్నుకున్నందువల్ల ఆమె మూడో సారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆమె శాసన సభ్యురాలు కాదు గనక వచ్చే నవంబర్ అయిదవతేదీలోగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నిక కావాలి. లేకపోతే ఆమె ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చేది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆమె పోటీ చేయదలచుకున్న భవానీపూర్ నియోజకవర్గంతో సహా బెంగాల్లోని షమ్షేర్ గంజ్, జంగీర్ పూర్ నియోజక వర్గాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పోలింగ్ సెప్టెంబర్ 30న జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ మూడున జరుగుతుంది. బెంగాల్లోని మూడు నియోజకవర్గాలతో పాటు ఒడిశాలోని పిప్లి నియోజకవర్గానికి కూడా సెప్టెంబర్ 30నే పోలింగ్ జరుగుతుంది. అయితే దేశవ్యాప్తంగా మరో 31 అసెంబ్లీ స్థానాలకు, మూడు పార్లమెంటరీ నియోజక వర్గాలకు కూడా ఉప ఎన్నికలు నిర్వహించవలసి ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బెంగాల్లో మమతా బెనర్జీ పోటీ చేయదలచుకున్న భవానీపూర్కు ఎన్నికలు నిర్వహించకుండా ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేట్టు చూడడానికి కేంద్రం వ్యూహం పన్నుతోందన్న ఊహాగానాలు చెలరేగాయి. ఇటీవలి కాలంలో ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా నడుచుకుంటున్నందువల్లా ఈ ఊహాగానాలను నమ్మవలసి వచ్చింది. తృణమూల్ను దెబ్బ తీయడానికే సువేందు అధికారి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పంతానికి పోయి మమతా బెనర్జీ ఆయన పోటీ చేసే నియోజకవర్గంలోనే ఆయనను ఢీకొట్టాలనుకున్నారు. అయితే 1,956 ఓట్ల స్వల్ప తేడాతో మమతా బెనర్జీ ఓడిపోయారు. సువేందు అధికారి ప్రస్తుతం బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. నిజానికి 2011, 2016 ఎన్నికలలో మమతా బెనర్జీ దక్షిణ కోల్కతాలోని భవానీపూర్ నియోజక వర్గం నుంచే పోటీ చేసి గెలిచారు. సువేందు అధికారి తృణమూల్లో ఉన్నంత కాలం మమతకు కుడిభుజంగా ఉండేవారు.
మమతను దెబ్బ తీయడానికి గత ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరగడానికి ముందు భారీ ఎత్తున తృణమూల్ నాయకులను బీజేపీలో చేర్చుకున్నారు. కానీ అత్యవసరంగా బీజేపీలో చేరిన నాయకుల అంచనాలు తప్పి తృణమూల్ ఘన విజయం సాధించింది. దానితో కొంతమంది ఇప్పటికే మళ్లీ తృణమూల్లో చేరిపోయారు. మరి కొందరు అదే ప్రయత్నాల్లో ఉన్నారు. నవంబర్ 5 లోగా మమత శాసనసభకు ఎన్నిక కాకపోతే ఆమె ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అవకాశం ఉండదు కనక ఉపఎన్నిక నిర్వహించాలని తృణమూల్ ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి చేస్తూ వచ్చింది. బీజేపీ ఈ ఎన్నికలు నిర్వహించకుండా చూడడానికి అనేక సాకులు వెతికింది. శాసనసభ ఎన్నికలు ముగిసిన తరవాత బెంగాల్లో హింసా కాండ జరిగినందువల్ల శాంతిభద్రతల పరిస్థితి సవ్యంగా లేదు కనక ఎన్నికలు నిర్వహించకూడదని వాదిస్తూ వచ్చింది. ఈ వాదనలను తిప్పి కొట్టడంతో పాటు రాష్ట్రంలో కరోనా తగ్గు ముఖం పట్టింది కనక ఎన్నికలు నిర్వహించడానికి పరిస్థితి అనుకూలంగానే ఉందని తృణమూల్ వాదించింది. పరిపాలనా సంబంధమైన సమస్యలు తలెత్తకుండా, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భవానీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాలనీ పరిస్థితి సానుకూలంగానే ఉందని బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా అభిప్రాయపడినందువల్ల ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మమతా బెనర్జీ శాసనసభకు ఎన్నిక కావడానికి అనువుగా వ్యవసాయ శాఖ మంత్రి సొవన్ దేవ్ చట్టోపాధ్యాయ భవానీపూర్ నియోజవర్గం నుంచి శాసన సభ్యుడిగా రాజీనామాచేశారు. దానితో అక్కడ ఉపఎన్నిక అవసరం అయింది. బెంగాల్లో ఎన్నికల క్రమం ముగిసి, ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి మమతా బెనర్జీ భవిష్యత్తు మీద చర్చలు మొదలైనాయి. ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అనుగుణంగా నడుచుకుంటోంది కనక ఉప ఎన్నికలు జరగవేమో, ఆ రకంగా మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవడం అనివార్యం అవుతుందేమోనన్న మాటలు వినిపించాయి. ఎన్నికల కమిషన్ చివరకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేయడంవల్ల రెండు పరిణామాలు సంభవించినట్టు లెక్క. ఒకటి: బెంగాల్లో పరిపాలనా సంబంధమైన సమస్యలు తలెత్తకుండా నివారించడం. రెండు: కేంద్ర ప్రభుత్వ అభిప్రాయానికి తగ్గట్టుగా నడుచు కుని ఎన్నికల కమిషన్ పక్షపాత దృష్టితో నడుస్తోందన్న అభిప్రాయం బలపడకుండా నివారించగలగడం. ఈ విషయంలో చివరకు ఎన్నికల కమిషన్ స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంది. షమ్షేర్ గంజ్, జంగీపూర్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు మరణించడంవల్ల ఏప్రిల్-మేలో అక్కడ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. అందుకే భవానీపూర్తో పాటు ఆ రెండు చోట్ల కూడా ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారు. కరోనా తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తున్నా ఇంకా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. అయితే సెప్టెంబర్ 30న ఎన్నికల నిర్వహణలో కరోనానివారణ నిబంధనలను అమలు చేస్తారు. అగ్ర నాయకుల ఎన్నికలప్రచారం, ఇంటింటికీ వెళ్లి, వీధుల్లో ప్రచారం నిర్వహించడం మీద నియంత్రణ ఉంటుంది. ఈ సారి మమతా బెనర్జీ గెలుపోటముల గురించిన చర్చకు కూడా ఆట్టే అవకాశం లేదు. మమతా బెనర్జీ ఉప ఎన్నికల్లో భవానీ పూర్ నుంచి పోటీ చేసి గెలిస్తే అది కచ్చితంగా మోదీ, అమిత్ షా ద్వయానికి ఎదురు దెబ్బ తగిలినట్టే. నైతికంగా ఇది వారి ఓటమి కిందే లెక్క. ఎన్నికల ప్రచార సందర్భంగా వాతావరణం వేడెక్కడం సహజమే. కానీ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన తరవాత గెలిచిన వారితో పాటు ఓడిన వారూ హుందాగా వ్యవహరించాలి. చాలా వరకు రాజకీయ నాయకులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కానీ మోదీ, అమిత్ షా ద్వయం దీనికి భిన్నమైన విధానాలు అనుసరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను ఖాతరు చేయకపోవడమే.