సెక్యులర్ విధానాలు అనుసరించే రాజ్యాల దృక్కోణానికి, మత రాజ్యాల వైఖరికి మధ్య అపారమైన తేడా ఉంటుంది. మత రాజ్యాల దృక్పథం మారుతున్న దాఖలాలైతే కనిపించడం లేదు కానీ సెక్యులర్ రాజ్యం అనుకుంటున్న మన దేశంలో మాత్రం మత వ్యవహారాలలో మత రాజ్యాలను అనుసరించే ధోరణి విపరీతంగా పెరిగిపోతోంది. హిందూ మతాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్న బీజేపీ పాలిత రాష్ట్రాలలో హిందూ మతం నుంచి ఇతర మతాల్లోకి మారే వారికి కఠినమైన శిక్షలు అమలుచేసే సంకల్పం నానాటికీ బలపడ్తోంది. అల్జీరీయా ఇస్లాం మతాన్ని అధికారిక మతంగా రాజ్యాంగం ప్రకటించింది. ఆ దేశంలో 2006లో మత మార్పిడుల చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇస్లాం మతాన్ని విడనాడి మరో మతం స్వీకరిస్తే అయిదేళ్ల జైలుతో పాటు 70 నుంచి 140 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. భూటాన్ 2011లో మత మార్పిడి నిరోధక చట్టం ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. భూటాన్ మహాయాన బౌద్ధాన్ని అనుసరిస్తుంది. ఇదే రాజ్య వ్యవస్థ అనుసరించే మతం. ఈ మతాన్ని అనుసరించే వారు జనాభాలో 75 శాతం ఉన్నారు. మిగతా 25 శాతం హిందువులు, క్రైస్తవులు, ఇస్లాం, బాన్ మతం అనుసరిస్తారు. అక్కడ మహాయాన బౌద్ధాన్ని అనుసరించేవారు మరో మతం అనుసరించడం అంటే శిక్షార్హమైన నేరం చేసినట్టే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇస్లాం మతం వీడితే ఏకంగా మరణ శిక్షే. మన దేశం దగ్గరకు వస్తే మత మార్పిడులను నిరోధించే చట్టాలు తీసుకు రావడంలో అన్ని రాష్ట్రాలకన్నా ముందున్నది ఒరిస్సా. ఆ రాష్ట్రంలో 1967లో మత మార్పిడుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. అయితే ఇలాంటి చట్టాలన్నింటినీ మత మార్పిడి నిరోధక చట్టాలు అనకుండా మత స్వేచ్ఛను పరిగణించే చట్టాలు అని ముద్దుగా పిలుస్తున్నారు. ఆంతర్యం మాత్రం హిందూమతం నుంచి మరో మతంలోకి మారే వారిని అడ్డుకోవడమే. అయినప్పటికీ యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం హిందూమతం లోంచి ఇతర మతాలలోకి మారడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. మన దేశంలో మత స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏ మతాన్ని అయినా అనుసరించవచ్చు. అయితే బలవంత మతమార్పిడులు చెల్లవు. రాజ్యాంగంలోనే ఈ అంశం పొందు పరిచారు. ఏ మతాన్ని అనుసరించకుండా ఉండే హక్కు కూడా మన దేశంలో ఉంది. కానీ హిందూ మతానికి ముస్లింల ద్వారా ముప్పు ఉందని బీజేపీ దశాబ్దాల నుంచి ప్రచారం చేస్తూనే ఉంది. హిందూ అమ్మాయిలను ముస్లిం యువకులు పెళ్లి చేసుకుని ఇస్లాం మతంలో బలవంతంగా చేర్పిస్తున్నారన్న ప్రచారం బీజేపీ నిరంతరం కొనసాగిస్తోంది. దీనికి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ‘‘లవ్ జిహాద్’’ అన్న పేరు పెట్టారు. జిహాద్ అన్న మాట వాడడంలోనే లవ్ జిహాద్ కు ముస్లింలే కారణం అన్న ధ్వని స్పష్టంగా వినిపిస్తోంది. మతతత్వ రాజకీయాలు అనుసరించేవారు అధికారంలోకి వచ్చిన తరవాత మత మార్పిడులపై గగ్గోలు పెడ్తున్నారు. ఇంతకీ లవ్ జిహాద్ సంఘటనలు ఎన్ని జరిగాయి అంటే ఏ బీజేపీ ప్రభుత్వం దగ్గరా లెక్కలు లేవని న్యాయస్థానాల్లోనే తెల్లమొహం వేశారు. మత మార్పుడులు ఎక్కడైనా వివాదాస్పదంగానే ఉంటాయి. అయితే బలవంతపు మత మార్పిడులు ముందే నుంచే చట్టరీత్యా నేరమే. కానీ అది మతతత్వవాద బీజేపీకి ఎంత మాత్రం సంతృప్తి కలిగించదు. ముస్లింల మీద ఏదో ఒక రకంగా విద్వేషం విరజిమ్మితే తప్ప సంఫ్ు పరివార్ కు నిద్ర పట్టదు. స్వచ్ఛందంగా మతం మారడానికి రాజ్యాంగం ఇచ్చిన హామీని సంఫ్ు పరివార్ బొత్తిగా గుర్తించదు.
ఉత్తరప్రదేశ్ లో 2020లో చట్ట విరుద్ధ మత మార్పిడుల నిరోధక ఆర్డినెన్సు 2020లో జారీ చేశారు. అది ఆ మరుసటి సంవత్సరం చట్టం అయింది. ఆ చట్టాన్ని ఇప్పుడు సవరించారు. మునుపటిచట్టంలో ఉన్న శిక్షలకన్నా చాలా కఠినమైన శిక్షను కొత్త చట్టంలో నిర్దేశించారు. చట్టాన్ని సవరించడానికి సోమవారం బిల్లు ప్రతిపాదిస్తే మంగళవారం నాటికి ఆ బిల్లు శాసనసభ ఆమోదం పొందింది. చట్ట రూపంలోకి రావడం ఇక లాంఛనప్రాయమే. సవరించిన బిల్లు ప్రకారం మతం మార్పించే ఉద్దేశంతో ఒక వ్యక్తి మతం మారాలని బెదిరించినా, దాడి చేసినా, పెళ్లాడినా లేదా పెళ్లాడతానని వాగ్దానం చేసినా, కుట్ర చేసినా కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు అనుభవించవలసి వస్తుంది. అదనంగా అయిదు లక్షల రూపాయల జరిమానా కూడా చెల్లించాలి. బలవంతపు మత మార్పిడులను నిరోధించడానికి ఇలాంటి చట్టాలు తీసుకొస్తే అభ్యంతర పెట్టవలసిందేమీ లేదు. కానీ మతంతార వివాహాలన్నింటినీ బలవంతపు మత మార్పిడుల కింద పరిగణించి నేరం అంతా ముస్లింల మీదకుతోసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. అంతకు ముందు ఉత్తరప్రదేశ్లో మత మార్పిడులకు పదేళ్ల జైలు శిక్ష, రూ.50,000 జరిమానా విధించే వారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ మంగళవారం ఆమోదించిన బిల్లులో అనేక విచిత్రాలు, విశేషాలూ ఉన్నాయి. మత మార్పిడులు జరిగాయని భావిస్తే ఎవరైనా ఎఫ్.ఐ.ఆర్.దాఖలు చేయవచ్చు. ఇంతకు ముందైతే మతమార్పిడికి గురైన వారి తరఫున వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు మాత్రమే ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎవరైనా పోలీసులకు సమాచారం అందించవచ్చు. ఒకవేళ పోలీసులు అరెస్టు చేస్తే బెయిలు రావడం కూడా దుర్లభమే. సెషన్స్ కోర్టు కన్నా కిందిస్థాయి కోర్టు ఏదైనా ఈ కేసులను విచారించ వచ్చు. ప్రభుత్వ తరఫు న్యాయవాదికి తన వాదనలు వినిపించే అవకాశం ఇస్తేనే గాని బెయిలు మంజూరు చేయడమూ కుదరదు. ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, ఏ కింది కోర్టు అయినా విచారణ చేపట్టవచ్చు అంటే అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి అది మత మార్పిడి అనుకుంటే ఫిర్యాదు చేసేయొచ్చు. అది ఇష్ట పూర్వక మత మార్పిడేమోనన్న అనుమానం కూడా రావడానికి అవకాశంలేని పరిస్థితిలో ఉన్నాం కనక ఈ ఫిర్యాదులన్నీ బలవంతపు మత మార్పిడులను అరికట్టే రూపమే సంతరించుకుంటాయని చెప్పడానికి లోతైన పరిశోధన అవసరమేలేదు. ఈ చట్టం తీసుకురావడంలో ఉత్తరప్రదేశ్ ఆంతర్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యు.పి. చట్టంలో ఉన్న కఠినమైన అంశాలను ఇదివరకే ఇలాంటి చట్టాలున్న రాష్ట్రాలు మునుపటి చట్టాలను సవరిస్తే కాదనే నాధుడే ఉండకపోవచ్చు. ఈ కేసులు సివిల్ కేసులైనా కావొచ్చు. క్రిమినల్ కేసులైనా కావొచ్చు. లవ్ జిహాద్ అన్న మాటే ముస్లింలను బోనెక్కడానికి ఉద్దేశించింది కనక ఎక్కువ కేసులు నిస్సందేహంగా ముస్లింల మీదే దాఖలవుతాయి. అంటే ఇలాంటి చట్టాల గురి ఎక్కడుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు.