ముస్లిమ్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని గత పదేళ్ల మోదీ పాలనలో వివిధ రకాల చట్టాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) విషయంలో బీజేపీ ఆటలు ఇంకా సాగడం లేదు. రెండు మూడుసార్లు ప్రయత్నించినా అది సఫలం కాలేదు. అందుకు నెమ్మదిగా రాష్ట్రాల్లో యూసీసీ అమలుకు చట్టాలు చేయడం ద్వారా మైనారిటీలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవలనే ఉత్తరాఖండ్లో బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆమోదముద్ర వేసింది. తాజాగా అసోంలో ఈ ప్రయత్నం మొదలైంది. 1935వ సంవత్సరం నాటి అస్సాం ముస్లిమ్ మ్యారేజెస్ అండ్ డివోర్సెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ రద్దుకు అసోం ప్రభుత్వం శుక్రవారంనాడు ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశగా ఇదొక ముఖ్యమైన అడుగు అవుతుందని అసోం మంత్రి జయంత మల్లా బారువా తన మనసులోని మాటను వెల్లగక్కారు. ఈ చట్టాన్ని రద్దు చేయడం వల్ల రాష్ట్రంలో బాల్యవివాహాలను నిలువరించవచ్చని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సెలవిచ్చారు. క్యాబినెట్ మంత్రి మాత్రం ఈ చట్టం రద్దు వెనుక ఉద్దేశాన్ని మనసులో దాచుకోలేకపోయారు. బ్రిటిష్ కాలంలోనాటి ఈ చట్టాన్ని రద్దు చేయడంతో రాష్ట్రంలో యూసీసీ అమలుకు మార్గం సుగమమైందని తేల్చిచెప్పేశారు. వధూవరులకు 1821 ఏళ్లు నిండకుండానే పెళ్లి చేసుకోవడానికి అనుమతినిచ్చే శతాబ్దం క్రితం నాటి చట్టం మనకు అవసరమా? అని సీఎం హిమంత ‘ఎక్స్’ వేదికగా చెప్పుకొచ్చారు. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయడం అసోం చరిత్రలోనే కాకుండా దేశచరిత్రలోనే ఒక మేలిమలుపు అవుతుందని అర్థం వచ్చేలా పెద్దపెద్ద వచనాలు వల్లించారు. ఈ దేశాన్ని మనువు కాలం నాటికి మోసుకుపోవడానికి ఆర్ఎస్ఎస్
బీజేపీ చేస్తున్న యత్నాలను ఆయన విస్మరించినట్టున్నారు.
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) జోలికి రాజ్యాంగ నిర్మాతలే వెళ్లలేదు. ఎందుకంటే భిన్న మతాలు, సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశంలో యూసీసీ వల్ల ఉపయోగం లేదని, పైగా అది సమస్యలను తీసుకువస్తుందని గ్రహించి రాజ్యాంగంలో 25, 26, 27, 28 అధికరణలను చొప్పించారు. ప్రతి వ్యక్తీ తనకు ఇష్టమొచ్చిన మతాన్ని స్వీకరించి, ఆచరించవచ్చని ఈ రాజ్యాంగ అధికరణలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగ నిర్మాతలు ఎంతో పెద్ద మనసుతో చేసిన గొప్పపని అది. ఎటొచ్చీ మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44వ అధికరణను అడ్డంపెట్టుకొని దాన్ని ఉమ్మడి పౌర స్మృతికి వర్తింపచేయాలని తెగ ఆరాటపడిపోతున్నది. 44 ప్రకారం భారతదేశ భూభాగం అంతటా పౌరులకు ఒకే విధమైన పౌర నియమావళిని తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేది రాజ్యాంగ ఆదేశిక సూత్రం. ముస్లిమ్ తలాక్ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా యూసీసీ కోసం తొలి అడుగు వేసిన బీజేపీ ఇప్పుడు తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిమ్లకు హక్కులు కల్పించే చట్టాలను ఒక్కొక్కటిగా రద్దు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగమే అసోంలో ముస్లిమ్ వివాహాల చట్టం రద్దు చర్య. అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అసోం చేసిన ఒక చర్య గురించి ఇంతలా పట్టించుకోవాలా అనే సందేహం వద్దు. దీని వెనుక బీజేపీకి చెందిన అతిపెద్ద ఎజెండానే ఉంది. ఉమ్మడి పౌర స్మృతి అనేది సామాజిక విషయాలకు సంబంధించిన భారతీయ చట్టంగా పరిగణించవచ్చు. ఇది వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం మొదలైన అంశాలలో అన్ని మతాల ప్రజలకు సమానంగా వర్తిస్తుందనేది సహజవాదన. అంటే, భారతదేశం అంతటా భిన్న సంస్కృతులు, మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే న్యాయాన్ని అందించడానికి వీలు కల్పించడమన్నమాట. పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవనభృతి లాంటి సామాజిక విషయాలకు సంబంధించిన చట్టాలు దేశంలో అందరికీ ఒకేలా లేవన్నది వాస్తవమే. అవి పౌరులు ఆచరించే మతపరమైన అచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఉన్నాయి. అయితే, మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాల్లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం ఆవశ్యకతను దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలోనే గుర్తించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 సారాంశం కూడా ఇదే. దీని ప్రకారం స్వాతంత్య్రం తరువాత మహిళల పట్ల వివక్షను తొలగించేందుకు 1993లో బ్రిటీష్ కాలపు నాటి కొన్ని చట్టాలను సవరించారు. దీని వల్ల కొన్ని అగాధాలు పెరిగాయి. భారతదేశంలో ట్రిపుల్ తలాక్ అనేది ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు ‘తలాక్’ అని మూడుసార్లు పలకడం, రాసి లేదా ఎలక్ట్రానిక్ రూపంలో పంపడం ద్వారా విడాకులు ఇచ్చే పద్ధతి. అయితే ఆర్డినెన్స్ రూపంలో సెప్టెంబరు 2018 నుంచి ఈ విధానాన్ని రద్దు చేస్తూ ఒక చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం మూడుసార్లు తలాక్ చెప్పి భార్యకు విడాకులు ఇస్తే మూడేళ్ల జైలు లేదా జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో యూసీసీలాంటి చట్టాలు ఉన్నాయి. అమెరికా, ఐర్లాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మలేషియా, టర్కీ, ఇండోనేషియా, సూడాన్, ఈజిప్ట్ వంటి అనేక దేశాలు యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేస్తున్నాయి. దీనికి బదులుగా భారతదేశంలో చాలా వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవులకు వారి స్వంత చట్టాలు ఉన్నాయి. ఇతర మతాల చట్టాలు భారత రాజ్యాంగంపై ఆధారపడి ఉంటాయి.
అసోంలో ముస్లిమ్ వివాహాల చట్టం రద్దు చేయడం వల్ల బాల్యవివాహాలను తగ్గించవచ్చని సీఎం హిమంత చేస్తున్న వాదనలో పసలేదు. తనకు తానుగా బాల్యవివాహాల వ్యతిరేక ఉద్యమ సంస్కర్తగా ప్రచారం చేసుకోవడానికి ఆయన తహతహలాడుతున్నారు. 94 ముస్లిమ్ వివాహ రిజిస్ట్రార్ల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా అసోం జిల్లా కమిషనర్లు, జిల్లా రిజిస్ట్రార్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఇవ్వకపోతే బలవంతంగా లాక్కోవాలని మౌఖిక ఆదేశాలున్నట్లు సమాచారం. ముస్లిం వివాహ రిజిస్ట్రార్లకు ఇకముందు పని ఉండదు కాబట్టి వారికి పునరావాసం కింద ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించడం కంటితుడుపు చర్య. ఇకపై ముస్లిమ్ వివాహాలు ప్రత్యేక వివాహాల చట్టం కింద నమోదవుతాయని మంత్రి బారువా చెప్పడం కొసమెరుపు. యూసీసీ బిల్లును త్వరలోనే తీసుకువస్తామని కూడా ఆయన సెలవిచ్చి, ప్రమాదం పొంచి ఉందని సంకేతాలిచ్చారు. హిమంత ప్రభుత్వం తమ వీఐపీల వైమానిక ప్రయాణాలకే దాదాపు 59 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఈ ఆరోపణల నుంచి దృష్టి మళ్లించడానికే యూసీసీ వంటి కూతలు కూస్తున్నట్లు విశ్లేషకులు చెపుతున్నారు. మరోవైపు, ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ఆదివాసీలను మినహాయిస్తుంది. కాకపోతే ఇప్పటికే ఉత్తరాఖండ్లో ముస్లిమ్, ఇతర మైనారిటీలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తమ మత విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని, తమకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును కాలరాస్తున్నారని ఆవేదన వెలిబుచ్చడంలో ఆశ్చర్యం లేదు. గుజరాత్లోనూ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును సిద్ధం చేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే యూసీసీ బిల్లును దేశవ్యాప్తంగా అమలయ్యేలా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ లాంటివారి మాటలు చెల్లుబాటు కాకపోయినా, ఉమ్మడి పౌర స్మృతి అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందనేది పచ్చి నిజం.