పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయని సందేశ్ఖలీ ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరోజు కాదు రెండ్రోజులు కాదు… కొన్ని నెలలుగా సందేశ్ఖలీ గిరిజనులపై అకృత్యాలు జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం. టీఎంసీ నేతల దౌర్జన్యాలు ఒక్కొక్కటికీ వెలుగులోకి రావడం ఆందోళనకరం. పోలీసుల పాత్రనూ త్రోసిపుచ్చలేం. ఈ అకృత్యాలను కనిపెట్టేందుకు వెళ్లిన నిజనిర్ధారణ బృందాన్ని పోలీసులు మధ్యలో ఆపేసి, అరెస్టు చేయడం ఈ అనుమానాలకు తావిస్తోంది. తృణమూల్ నాయకుడు షేక్ షాజహాన్, అతని సహచరులు సందేశ్ఖలీలో భూకబ్జాలు, గిరిజన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా పట్టని పోలీసులు ఈ ఘటనలపై ఎవరు గళమెత్తినా నోరునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. టీఎంసీకి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు పేద గిరిజన కుటుంబాల నుంచి ‘ఉపాధి’ వేతనాలను బలవంతంగా లాక్కున్నారని ఈ మధ్య జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్సీఎస్టీ) తెలిపింది. షాజహాన్, అతని సహచరులను పశ్చిమ బెంగాల్ పోలీసులు రక్షించారని ఫిర్యాదుదారులు చెపుతున్నట్లు ఈ కమిషన్ వైస్ చైర్పర్సన్ అనంత నాయక్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం తమ సంచలన నివేదికలో వెల్లడిరచింది. తాజాగా ఈ అంశంపై పశ్చిమబెంగాల్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. షాజహాన్ దుండగుల ముఠా గిరిజన మహిళలపై లైంగిక వేధింపులకు ఒడిగట్టారని, భూకబ్జాలకు పాల్పడ్డారని ప్రాథమికంగా 50కి పైగా ఫిర్యాదులు అందాయి. టీఎంసీ నేతల బెదిరింపులు, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ఇంకా చాలామంది గిరిజనులు ఫిర్యాదులు చేయడానికి ముందుకు రావడం లేదు. సందేశ్ఖలీ ప్రాంతమనేది కోల్కతాకు 100 కిలోమీటర్ల దూరంలో సుందర్బన్స్ సరిహద్దుల్లో ఉన్న పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని నదీతీరంలో ఉంది. నిరుపేద గిరిజనులు ‘ఉపాధి హామీ పథకం’ కింద అందుకున్న పైసలనూ తనకే ఇవ్వాలని షాజహాన్ ఆదేశిస్తాడని తేలింది. ఒకవేళ వారు ఆ డబ్బును అప్పటికే ఖర్చు చేసిఉంటే ఇంకెక్కడైనా డబ్బు అప్పుగా తీసుకుని ఇచ్చి తీరాల్సిందేనని బెదిరిస్తాడని గిరిజనులు వాపోయారు. ఈ తరహా అరాచకాలు పాచిపట్టిన బూర్జువా లక్షణాలు కావచ్చు. అయితే సందేశ్ఖలీలో హిందువులు మెజారిటీగా ఉన్నారని, అందుకే ముస్లిమ్ అయిన షాజహాన్ అఘాయిత్యాలకు అంతులేకుండా పోతున్నదని మోదీ ప్రభుత్వ మెచ్చుకోలుకోసం ఈ సమస్యను మతపరం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని మాత్రం ఖండిరచాల్సిందే. అదే సమయంలో సందేశ్ఖలీలో కొనసాగుతున్న ఉద్రిక్తతను చల్లార్చడానికి అవసరమైతే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాల్సి ఉంటుంది. షాజహాన్, అతని సహచరులు స్థానిక మహిళలను అర్ధరాత్రి సమావేశాలకు రావాలని బలవంతపెడుతున్నారనేది వాస్తవం. తన డిమాండ్లను పాటించని వారి కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులకు గురిచేయడం జుగుప్సాకరం. విచిత్రమేమిటంటే, బాధితులు పోలీసులను ఆశ్రయిస్తే…వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా షాజహాన్తో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోండని ఉచిత సలహాలిస్తున్నారు. ఈ కేసుల్లో నిందితులందరికీ పోలీసుల సంపూర్ణ మద్దతు ఉంది. టీఎంసీ నేతల కబ్జాకు గురైన తమ భూమిని తిరిగి అప్పగించాలని నిరసన వ్యక్తం చేస్తే పొలాల్లో ఉప్పు నీటిని వదులుతామని వారు బెదిరిస్తారు. 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో వెయ్యి మందికి పైగా గిరిజన, గిరిజనేతరుల భూములను షాజహాన్ ముఠా లాక్కున్నట్లు ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి 20న జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు ప్రధానాధికారికి నోటీసులు జారీ చేసి, మూడు రోజుల్లో ఈ అంశంపై తీసుకున్న చర్యల నివేదికలు సమర్పించాలని కోరింది. కానీ ఆరు రోజులైనా అతీగతీలేదు. వారి నుంచి ఎలాంటి నివేదికలు అందకపోగా, తాత్సారానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలేనని తెలుస్తోంది. సందేశ్ఖలీ బ్లాక్లోని మజేర్పరా, హల్దర్పరా ప్రాంతాల్లో భూకబ్జాకు గురైన ప్రాంతం పూర్తిగా షాజహాన్, అతని సోదరుడు సిరాజుద్దీన్ ఆధీనంలో ఉంది. ఈ అకృత్యాలపై గత కొన్ని రోజులుగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఈ ఆందోళనలు కోల్కతా వరకూ వ్యాపించాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు చెపుతున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న షాజహాన్, సిరాజుద్దీన్లను అరెస్టు చేయాలన్నది కూడా వారి ప్రధాన డిమాండ్. కాకపోతే వారు కోల్కతాలో బహిరంగంగానే తిరుగుతూ బార్లు, రెస్టారెంట్లలో దర్శనమిస్తూ ప్రజల కళ్లకు గంతలు కడుతున్నారు. మమతా బెనర్జీ సానుభూతి తమకు అక్కర్లేదని, నిందితులకు మరణశిక్ష విధించాలని బాధితులు కోరుతున్నారు. సందేశ్ఖలీ పరిధిలోని పోలీస్స్టేషన్లలో షాజహాన్, అతని అనుచరులు అమాయక గిరిజనులను పోలీసుల ముందే దుర్మార్గంగా కొట్టిన ఘటనలను విస్మరించలేం. సందేశ్ఖలీలో పరిస్థితిపై పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ స్పందిస్తూ తప్పు జరిగిన విషయాన్ని అంగీకరించారు. ఫిర్యాదులివ్వాలే తప్ప చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని సలహాఇవ్వడం అర్థరహితం. స్పష్టంగా అగుపిస్తున్న అక్రమాలను అడ్డుకోవడంలో పోలీసుల దుర్నీతిని ఎందుకు విస్మరించారనే ప్రశ్నకు డీజీపీ వద్ద సమాధానం లేదు. గ్రామస్తుల ఫిర్యాదుల కోసం బెర్మోజూర్లో పోలీసులు శిబిరాన్ని ప్రారంభించగా, ఒక్కరోజే షాజహాన్, సిరాజుద్దీన్లపై 50కి పైగా భూకబ్జా ఫిర్యాదులు అందాయి. అయినప్పటికీ, పోలీసులు కదల్లేదు. సరికదా, అతన్ని తృణమూల్ కాంగ్రెస్ ఏనాడో బహిష్కరించిందని సందేశ్ఖలీ ఎమ్మెల్యే సుకుమార్ మెహతో ప్రకటించడం మరో విడ్డూరం. గత కొన్ని రోజులుగా నిందితులకు టీఎంసీ మంత్రులే ఆశ్రయం ఇస్తున్నారని తెలుసుకున్న నిజనిర్ధారణ బృందాన్నీ పోలీసులు ముందుకు కదలనివ్వలేదు. ఆందోళనకారులపై సందేశ్ఖలీలో ఆంక్షలు విధించారు. సీఆర్పీసీ 144 సెక్షన్ విధించారు. ఇద్దరు మంత్రులు మాత్రం బాహాటంగానే తిరుగుతూ ఇక శాంతించండంటూ గిరిజనులను బెదిరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచం ముందు ఎలాంటి చిత్రాన్ని చూపించాలనుకుంటుందో అర్థం కావడం లేదని, రాష్ట్రంలో పాలనా యంత్రాంగం కుప్పకూలిందని పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి రాజ్పాల్సింగ్, జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యులు చారువాలీ ఖన్నా, న్యాయవాది భావాబజాజ్లతో కూడిన నిజనిర్ధారణ కమిటీ ఆరోపించింది. టీఎంసీకి ఓటు వేయనందుకే ఇలా గిరిజనులను హింసిస్తుండటం అసహేతుకం, దురదృష్టకరం. సందేశ్ఖలీ ఉదంతాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించకముందే మమతా బెనర్జీ స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే దీని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది.