దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయినా దళితులపై దౌర్జన్యకాండ ఘటనలు సర్వసాధారణమైపోతున్నాయి. దేశంలో ప్రతిరోజూ దళితులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు దళితులను బహిరంగంగా కొట్టడం, మరి కొన్నిసార్లు వారిని గుడిలోకి రానివ్వకపోవడం, చేసిన పనికి జీతం అడగితే దాడులకు దిగడం, దొంగతనం చేశారన్న ఆరోపణలతో అకృత్యాలకు పాల్పడడం నిత్యకృత్యంగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. నివేదికల ప్రకారం ప్రతిరోజూ ఇద్దరు ముగ్గురు దళితులు హత్యకు గురవుతున్నారు. దళితులను అవమానించడం, సాంఘిక బహిష్కరణ కేసులు కూడా నిత్యం వెలుగులోకి వస్తూనేవున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి ప్రతిరోజూ 150కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఎన్డీయే పాలనలో 2018 నుంచి 2022 మధ్య దళితులపై లైంగికదాడులు 35 శాతం పెరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రకారం 2018 నుంచి ప్రతి సంవత్సరం కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉన్నది. దళితులపై నేరాలకు సంబంధించి 2018లో 42,793 కేసులు నమోదయ్యాయి. 2021లో 50,900 కేసులు, 2022లో 57,582 కేసులు నమోదయ్యాయి. దళితులపై దాడుల కేసులు బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఎక్కువగా నమోదవుతున్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడిరచింది. ఆ నివేదిక ప్రకారం ఉత్తరప్రదేశ్లోని యోగి పాలనలో దళితులపై అఘాయిత్యాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. 2022లో అక్కడ దళితులపై 15 వేలకుపైగా అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఎనిమిదిన్నర వేలకు పైగా కేసులు నమోదైన రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. అక్కడ సగటున రోజుకు 12 మంది దళిత మహిళలు లైంగికదాడికి గురవుతున్నట్టు గణాంకాలు కూడా చెబుతున్నాయి. 2022లో దళిత మహిళలపై 4,241 లైంగికదాడి కేసులు నమోదయ్యాయి. ఇదొక్కటే కాదు, దళిత పిల్లలపై 1400కు పైగా అఘాయిత్య కేసులు నమోదయ్యాయి. ఎన్ని కేసులు నమోదవుతున్న చర్యలు లేకపోవడంతో దళితులపై చిన్నచిన్న కారణాలతో కూడా దాడులకు పాల్పడుతున్నారు. యోగీ ఇలాకాలోని భరూచ్ జిల్లా తాజ్పూర్ తెడియా గ్రామంలో ఇద్దరు కోళ్ల ఫారం యజమానులు దొంగతనం చేశారన్న అనుమానంతో మంగళవారం ముగ్గురు దళిత బాలురపై దాష్టీకానికి దిగారు. ఆ బాలురను కొట్టి, వారికి గుండు గీయించి, ముఖానికి నల్లరంగు పులిమి గ్రామంలో ఊరేగించారు. 5 కిలోల గోధుమలు అపహరించారని ఆరోపిస్తూ 12-14 ఏళ్ల్ల వయసున్న ముగ్గురు బాలురను కోళ్లఫారాల యజమానులు దారుణంగా కొట్టడమే కాకుండా వారికి శిరోముండనం చేయించారు. ముఖానికి నల్ల రంగు పూశారు. రెండు చేతులు కట్టేసి, ముంజేతులపై ‘దొంగ’ అని రాసి గ్రామంలో ఊరేగించారు. ఈ ఘటన మొత్తాన్ని ఘనకార్యం చేసినట్టు వీడియో కూడా తీశారు. ఎప్పటిలానే బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదుచేసి చేతులు దులుపుకున్నారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ అధికారంలో ఉన్న బీహార్లోనూ దళితులపై అఘాయిత్యాలు సర్వసాధారణమే. భూవివాదం కారణంగా నవాడాలోని దళితకాలనీలోని దళితులపై ఆకృత్యాలు జరిగి నెలరోజుల కూడా గడవక ముందే ముజఫర్పూర్ జిల్లా చౌపర్ మదన్ గ్రామంలో మరో దారుణం చోటుచేసుకుంది. చేసిన పనికి జీతం అడిగినందుకు దళిత వ్యక్తిపై యజమాని, అతడి కుమారుడు, మరో వ్యక్తి కలిసి దాడి చేశారు. నేలపైకి తోసి కొట్టారు. కులం పేరుతో దూషించి ముఖంపై ఉమ్మి వేయడంతోపాటు మూత్ర విసర్జన చేసి ఎంతగా హింసించాలో అంతగా హింసించారు. పోలీసులకు ఫిర్యాదుచేస్తే చంపుతామని బెదిరించారని బాధితుడు చెపుతున్నాడు. రమేష్ పటేల్ కోళ్ల ఫారంలో దళితుడైన రింకూ మాంరీa కొన్ని రోజులు పనిచేశాడు. చేసిన పనికి వేతనం అడిగినందుకు రింకూని సభ్యసమాజం తలదించుకునే విధంగా నానా చిత్రహింసలకు గురిచేశారు.
దళితులు, గిరిజనుల రక్షణ కోసం షెడ్యూల్డ్ కులాల/షెడ్యూల్డ్ తెగ (అత్యాచారాల నిరోధక) చట్టాన్ని 1989లో చేశారు. దళితులు, గిరిజనులపై నేరాలకు పాల్పడిన వారిని శిక్షించడమే ఈ చట్టం ఉద్దేశం. ఎస్సీ-ఎస్టీ వర్గాల ప్రజలకు రక్షణ, హక్కులను ఈ చట్టం అందిస్తుంది. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఏర్పాటవుతాయి, ఇలాంటి కేసుల్లో ఆ న్యాయస్థానాలు త్వరగా నిర్ణయాలు తీసుకుంటాయి. ఇదంతా కేవలం రాతల్లోనే… ఆచరణలో ఒక్కటీ అమలు జరగదు. చట్టం చేసిన తరువాత వాటిలో లొసుగులను ఆధారంగా చేసుకుని కోర్టుల నుంచి నిందితులు ఉపశమనం పొందుతుంటారు.
ఎస్సీ,ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల్లో తక్షణ అరెస్టులను 2018 మార్చిలో సుప్రీంకోర్టు నిషేధించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. ఎస్సీ,ఎస్టీలైన ప్రతి వ్యక్తికి రక్షణ కల్పించాలన్న లక్ష్యంతోనే ఈ చట్టాన్ని రూపొందించారు. కానీ దళితులపై అరాచకాలు, వేధింపులకు పాల్పడిన పెత్తందార్లు, మాఫియా, రాజకీయ నేతలపై ఈ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంలేదన్న దళిత సంఘాల విమర్శలలో ఏమాత్రం అవాస్తవంలేదని చెప్పవచ్చు. దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు శిక్ష విషయానికొస్తే ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం నేరారోపణ రేటు 34 శాతం. గత రెండేళ్ల్లుగా శిక్షల రేటు తగ్గుతూ వస్తోంది. వాస్తవానికి పోలీసు స్టేషన్లలోనే వాటిని రాజీ చేయటమో…లేక బెదిరించి కేసులు ఉపసంహరించుకునేలా చేస్తున్నారనేది దళిత సంఘాల వాదన. 2018లో నేరారోపణ రేటు 42 శాతం కంటే ఎక్కువగా ఉంది, ఇది 2021లో 36 శాతానికి తగ్గింది. 2022లో శిక్షా రేటు 34 శాతంగా ఉంది. చట్టాలు సక్రమంగా అమలు చేయకపోవడం, దళితులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై చర్యలు లేకపోవడంతో పెత్తందారులు, రాజకీయ నాయకులు తదితరులు యథేచ్చగా దాడులకు పాల్పడుతున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎమ్మెల్సీ దళితుడైన తన కారు మాజీ డ్రైవర్ను కొట్టిచంపి మృతదేహాన్ని స్వయంగా కారులో తీసుకువచ్చి దళితుడి ఇంటి వద్ద పడవేస్తే ఇంత వరకు ఆ ఎమ్మెల్సీపై చర్య లేకపోవడం చట్టాల అమలుతీరును ప్రతిబింబిస్తోంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు, మద్దతిస్తున్న పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో దళితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఎప్పుడో పోయింది, పాలకులు, కోర్టులు చట్టాలు కఠినంగా అమలు జరిగేలా చూసి దళితులపై ఆగడాలకు పాల్పడేవారిని శిక్షించాల్సిన అవసరంవుంది. అప్పుడే దళితులపై అత్యాచారాలు, అగడాలకు అంతం ఉంటుంది. ఈ విధమైన దాడులు జరగకుండా రాజకీయ పార్టీలు కూడా చర్యలు తీసుకోవాలి. దాడులకు పాల్పడిన వారిపై పార్టీ పరంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.