రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి మోదీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీకి ఓట్లు, సీట్లతో సంబంధం లేదు. తగినన్ని సీట్లు లేకపోయినా ఇతర పార్టీలవారిని ప్రలోభ పెట్టగలదు, బెదిరించగలదు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్, ఆదాయపు పన్ను శాఖ ద్వారా భయకంపితంచేసి లొంగ దీసుకోగలదు. ఏదీ కుదరకపోతే ఇతర పార్టీలను నిలువునా చీల్చగలదు. ఆదివారం మహారాష్ట్రలో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్.సి.పి.) నాయకుడు అజిత్పవార్ పార్టీ అధినేత శరద్ పవార్పై తిరుగుబాటు చేయడం బీజేపీ అనుసరిస్తున్న ఈ బందిపోటు విధానాలలో భాగమే. శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ ఎప్పటి నుంచో అధికార పీఠంపై అధిష్టించాలని తాపత్రయ పడ్తున్నారు. ఇటీవల కూడా ఆయన ఆ ప్రయత్నం చేశారు. అప్పుడే శరద్ పవార్ ఎన్.సి.పి. స్వర్ణోత్సవాలకన్నా కొంచెం ముందు తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నాని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. తరవాత ‘‘పార్టీ శ్రేణుల’’ ఒత్తిడి కారణంగా రాజీనామా ప్రతిపాదన ఉపసం హరించుకున్నారు. సుప్రియా సూలేను కార్య నిర్వాహక అధ్యక్షురాలిని చేశారు. తన సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ను ప్రతిపక్ష నాయకుడిగా ఉంచేశారు. ఇదంతా శరద్ పవార్ రాజకీయ దురంధతకు నిదర్శనం అనుకున్నారు. కానీ బీజేపీ కుటిల పన్నాగాల ముందు పవార్ రాజకీయ దురంధత ఘోరంగా వీగి పోయింది. ఆదివారం ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన వర్గం, బీజేపీతో కూడిన మంత్రివర్గంలో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి అయితే, మరో ఎనిమిది మందికి మంత్రి పదవులు దక్కాయి. అజిత్ పవార్ సహా వీరందరికీ ఓ ఉమ్మడి లక్షణం ఉంది. అదేమిటంటే వీరంతా ఇంతకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థల వేధింపులకు గురైన వారే. మహారాష్ట్ర సహకార బ్యాంకుల కుంభకోణంలో అజిత్ పవార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ దర్యాప్తు సాగుతోంది. ఛగన్ భుజబల్ అయితే ఎన్ఫోర్స్మెంటు దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఏడాదికిపైగా జైలులో గడిపి వచ్చారు. హసన్ ముష్రిఫ్ మీద ఆదాయపు పన్నుశాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ అనేకసార్లు దాడులు చేసింది. సునీల్ తట్కరే మీద అవినీతి, డబ్బు అక్రమ చెలామణి కేసులున్నాయి. ఆయన పార్లమెంటు సభ్యులు. ఆయనే కుమార్తె అదితి తట్కరే ఆదివారం షిండే మంత్రివర్గంలో చేరిపోయారు. షిండే మంత్రివర్గంలో ఉన్న మొదటి మహిళ ఆమే. ముందు నుంచీ శరద్ పవార్కు కుడి బుజంలా ఉన్న ప్రఫుల్ పటేల్ కూడా అజిత్ పవార్తో పాటు తిరుగుబాటు చేశారు కానీ ఆయన మంత్రివర్గంలో చేరలేదు. ఆయన దేశ రాజకీయాల్లో కీలక భూమిక నిర్వహిస్తా రంటున్నారు. కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించే సూచనలున్నాయి కనక ఆయనకు కేంద్రమంత్రి పదవి దక్కొచ్చు. ఏమైతే నేమి 1999లో శరద్ పవార్ ఏర్పాటుచేసిన ఎన్.సి.పి. నిట్ట నిలువునా చీలిపోయింది. 40 మంది అజిత్ పవార్తో పాటు తిరుగుబాటు చేసినందువల్ల ఇప్పుడు శరద్ పవార్తో నిలబడిన ఎమ్మెల్యేల సంఖ్య దాదాపు పదమూడు ఉంటుందేమో. మోదీ ప్రచారం చేస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్కు పరిమితం కాకుండా మహారాష్ట్రలో మూడు ఇంజన్ల ప్రభుత్వానికి తెర తీసినట్టయింది. ఎన్.సి.పి. కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సిఫార్సు మేరకు శరద్ పవార్ సునీల్ తట్కరేను, ప్రఫుల్ పటేల్ను పార్టీ నుంచి బహిష్కరించారు.
శరద్ పవార్ బీజేపీ కంటికి అత్యంత ప్రమాదకారిగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయ చాతుర్యం, పలుకుబడి, ప్రతిపక్షాల ఐక్యతకోసం ఆయన నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు బీజేపీ గుండెలో దడపుట్టించాయి. అందుకే పవార్ కోటకు బీజేపీ పెద్ద గండే కొట్టగలిగింది. బీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం మహారాష్ట్ట్రకు సంబంధించినంత వరకు 13 నెలల కాలంలో రెండోసారి. మొదట గత ఏడాది శివసేనను నిట్ట నిలువునా చీల్చింది. దీనికి ఏక్నాథ్ షిండే సహాయ పడ్డారు. ఇప్పుడు అజిత్ పవార్ చీలికకు ప్రధాన సూత్రధారి అయ్యారు. ప్రాంతీయ పార్టీలను బతకనివ్వ కూడదన్నది బీజేపీ పథకం. అందుకే ఈ పార్టీలను చీల్చేస్తోంది. నిజానికి బాల్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన బీజేపీని మించిన హిందుత్వ వాది. శివసేన బలపడడం బీజేపీకి సుతరామూ గిట్టలేదు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేసింది. ఇప్పుడు ఎన్.సి.పి.ని చీల్చింది. విచిత్రం ఏమిటంటే షిండేతో కలిసి శివసేనను వదిలి వెళ్లిపోయిన దాదాపు 40 మందిలో మంత్రి పదవులు దక్కనివారు ఆ అవకాశం కోసం ఎదురుచూస్తుండగా ఆదివారం ఎన్.సి.పి.పై తిరుగుబాటు చేసిన తొమ్మిదిమంది మంత్రులుగా ప్రమాణం స్వీకరిస్తుంటే గుడ్లప్పగించి చూడడం తప్ప ఏమీ మిగలలేదు. ప్రభుత్వాలను పడగొట్టడానికి, పార్టీలను చీల్చడానికి బీజేపీ కనీసం మూడు పద్ధతులు అనుసరిస్తుంది. ఇందులో సులభమైంది ప్రలోభాలకు గురిచేసి డబ్బు సంచులు అందజేయడం. అది కుదరకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థల చేత దాడులు చేయిస్తుంది. వారి ఆస్తులను జప్తు చేయిస్తుంది. అదీ కాకపోతే వారి పార్టీనే చీల్చేస్తుంది. అందుకోసం బందిపోటులా వ్యవహరించడానికి వెనుకాడదు. పార్టీలనే మింగేయడం బీజేపీకి అలవాటైన విధానం. శరద్ పవార్ లాంటి రాజకీయ దురంధరుడిని బీజేపీ కంగు తినిపించ గలిగిందంటే ఆయన అంత బలహీన పడిపోయారా? అధికార దాహంతో తల్లడిల్లిపోతున్న తన పార్టీ వారిని కట్టడిచేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోంది. తనకు చీలికలు కొత్తకాదని, పార్టీని మళ్లీ బలోపేతం చేస్తానని పవార్ అంటున్నారు. అయితే తిరుగుబాటు నాయకుడు తాము పార్టీని చీల్చలేదని, ఎన్.సి.పి.నే ప్రభుత్వంలో చేరిందని ధీమాగా చెప్తున్నారు. ఎక్కువ మంది శాసనసభ్యులు తనతో ఉండడంవల్ల ఆయన ఆ మాట ధైర్యంగా చెప్తున్నారు. ఏది అసలైన పార్టీనో ఎన్నికల కమిషన్ తేల్చాలి. అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేం. తన స్వయం ప్రతిపత్తిని మోదీకి తాకట్టు పెట్టిన ఎన్నికల కమిషన్ ఏది అసలైన ఎన్.సి.పి. అని తేల్చడానికి పార్లమెంటు ఎన్నికలు పూర్తి అయ్యే దాకా సాగదీసినా చేయగలిగింది ఏమీలేదు. ఎన్.సి.పి. కి ప్రమాదం ముంచుకొస్తుందని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. మహారాష్ట్ర గడ్డ మీంచే ఎన్.సి.పి.కి గుణపాఠం నేర్పాల్సిన అవసరం ఉందని, ఎన్.సి.పి. నాయకులు భయంకరమైన అవినీతి పరులని చెప్పడానికి వారు చేసిన కుంభకోణాల విలువ రూ.70,000 కోట్లు అని ఆరోపించారు. ఎన్.సి.పి.లో అవినీతిపరులైన వారు జైలులో పిండి రుబ్బాల్సి వస్తుందని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. వారికి పిండి రుబ్బే పరిస్థితి నుంచి తప్పించడానికి కనికరించి బీజేపీ వారిని మూకుమ్మడిగా బీజేపీలో చేర్చేసుకుంది. ఆ వాషింగ్ మెషిన్లో వారు కడిగిన ముత్యాలైపోయారు. బీజేపీలో చేరిన వారు అంతకు ముందు ఎన్ని ఆరోపణలు ఎదుర్కున్నా ‘‘గంగా స్నానం’’ చేస్తారు కనక పునీతులై పోతారు. అవినీతితో రాజీ పడడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదు. అయితే ఆ పని చేయడానికి బీజేపీ బందిపోటులా వ్యవహరించడం భవిష్యత్తులో మోగనున్న ప్రమాద ఘంటికలకు సంకేతం.