మోదీ నాయకత్వంలోని బీజేపీ లోక్సభ స్పీకర్ ఎన్నికపై మంకు పట్టు పట్టొచ్చు. షరతులు పెట్టొచ్చు. కానీ ఆనవాయితీ ప్రకారం ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని అడగడం మాత్రం షరతు విధించడం కింద లెక్క. ఏమైతేనేం 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వన్నె తగ్గినా పదేళ్ల నుంచి కొనసాగుతున్న చిన్నెలు మాత్రం అవే. మొత్తం మీద ఓం బిర్లా వరసగా రెండోసారి స్పీకర్ కావాలన్న బీజేపీ పంతం నెగ్గింది. ప్రభుత్వం ఇచ్చి పుచ్చుకునే ధోరణి అనుసరించడానికి సమ్మతించనందువల్ల ప్రతిపక్షం స్పీకర్ పదవికి పోటీ పెట్టాల్సి వచ్చింది. అయినా ప్రతిపక్షాలు ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టనందువల్ల మూజువాణీ ఓటుతో ఓం బిర్లా ఎన్నికయ్యారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తరవాత సంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఓం బిర్లాను సాదరంగా స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం వరకు కథ బాగానే నడిచింది. ప్రధాని మోదీతో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కరచాలనం చేయడం కూడా రక్తి కట్టిన దృశ్యమే. కానీ స్పీకర్ స్థానంలో ఆసీనుడైన తరవాత ఓం బిర్లా చేసిన మొట్టమొదటి పని ఎమర్జెన్సీ విధించి 49 ఏళ్లు గడిచిన సందర్భంగా ఓ తీర్మానం ప్రతిపాదించారు. ఆ తీర్మానం అధికార పక్షం రాసిచ్చిందని అర్థం అవుతూనే ఉంది. 1975 జూన్ 25-26 అర్థరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిరచడం స్పీకర్ ప్రతిపాదించిన తీర్మానం ప్రధాన ఉద్దేశం. ఎమర్జెన్సీ విధించడాన్ని నిరసిస్తూ రెండు నిముషాలు మౌనం పాటించాలని కూడా ఓం బిర్లా కోరారు. దీనికి సహజంగానే కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ పార్టీ సభ్యులు సైతం పాత గాయాలను ఎందుకు రేపుతున్నారు అని ప్రశ్నించారు. ఈ తీర్మానంతోనే ఓం బిర్లానే స్పీకర్గా ఎన్నుకోవాలని బీజేపీ ఎందుకు పట్టుబట్టిందో అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల తరవాత ఓం బిర్లా రెండోసారి స్పీకర్ అయ్యారు. స్పీకర్గా ఆయన అత్యుత్తమ పాత్ర పోషించిన ఉదాహరణే లేదు. నిష్పక్షపాతం గానో, నిరపేక్షంగానో ప్రవర్తించిన సందర్భమూ లేదు. స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాను అభినం దిస్తూ ప్రధాన మంత్రి మోదీ కిందటిసారి సభా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆమోదించిన బిల్లుల జాబితా ఏకరువు పెట్టడంచూస్తే మోదీకి ఎలాంటి స్పీకర్ కావాలో రూఢ అయిపోయింది. కిందటిసారి బిర్లా స్పీకర్గా ఉన్నప్పుడు సభా గౌరవాన్ని పరిరక్షించారని మోదీ పొగడ్తలతో ముంచెత్తారు. సభ్యులు ప్రసంగాల్లో ప్రభుత్వ పక్షానికి నచ్చని పేరాలకు పేరాలను రికార్డుల నుంచి తొలగించడం, అనేక బిల్లుల మీద అసలు చర్చే లేకుండా ఆమోదించడం, చీటికి మాటికి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్చేసి సభలో ప్రతిపక్షంలేని సమయంలో బిల్లులు ఆమోదిం చడానికి వెసులుబాటు కల్పించడం, మూకుమ్మడిగా వందమందికి పైగా సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం లాంటివే ఓం బిర్లా సభా గౌరవాన్ని కాపాడిన మహోజ్వల ఘట్టాలు. అయితే మోదీ హయాంలో తమ కనుసన్నల్లో నడుచుకునే వ్యక్తే స్పీకర్గా ఉండాలన్నది అధికార పక్షం అభిమతం అని తేలిపోయింది. స్పీకర్ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానం చదవడం పూర్తికాగానే నిరసనగా నినాదాలు సభలో మిన్నంటాయి. దీనితో రెండోరోజే సభను అర్థంతరంగా వాయిదా వేయక తప్పలేదు. ఇలా వాయిదా వేయడం కచ్చితంగా ఓం బిర్లా పెట్టిన ఒరవడే. ఆ తరవాత బీజేపీ సభ్యులు సభ వెలుపల ప్లకార్డులు పట్టుకుని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంటే స్పీకర్ ఎన్నిక సందర్భంగా జరిగే నాటకంలో ఈ ఘట్టం ఉంటుందని అధికార పక్ష సభ్యులకు ముందే తెలుసు. అంతా పథకం ప్రకారమే జరిగిందన్నమాట.
1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడం ఆ నాటికి రాజ్యాంగ బద్ధమే కావొచ్చు. కానీ అది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించింది. ఆ రోజుల్లో మొదట ఎమర్జెన్సీని సమర్థించిన రాజకీయ పక్షాలు సైతం కొన్నాళ్లు గడిచాక తమ తప్పు తెలుసుకున్నాయి. ఇందిరా గాంధీకి మద్దతు ఉపసంహరించాయి. ఎమర్జెన్సీలో జరిగిన అకృత్యాలకు, అఘాయిత్యాలకు ఇందిరాగాంధీ భారీ మూల్యం చెల్లించారు. స్వయంగా తాను ఓడిపోవడమే కాక కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ప్రజలు తగిన గుణపాఠం నేర్పారు. ఇదే సందర్భంలో స్పీకర్గా ఓం బిర్లా వ్యవహరించిన తీరును బేరీజు వేయాల్సిందే. సభ్యులను సస్పెండ్ చేయడానికి తనకు ఉన్న అధికారాలను విశృంఖలంగా వినియోగించు కున్నారు. ప్రతిపక్షాలు తమ అభిప్రాయం వ్యక్తం చేయడానికి వీలు లేకుండా ప్రభుత్వం వారి గొంతునొక్కుతూ ఉంటే ఓం బిర్లా ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నారు. గత అయిదేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం అసమ్మతిని ఎలా అణచి వేసిందో ప్రపంచమే కోడై కూసి తెలియజేసింది. భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదకర దశలో ఉందని అనేక దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఘోషించాయి. అలాంటి ప్రభుత్వం నడిపిన వ్యక్తికి, పక్షానికి లోక్సభలో ఓం బిర్లా రక్షా కవచంగా ఉపకరించారు. పత్రికా రచయితలు, మేధావులు గొంతెత్తితే చాలు వారిని జైళ్లల్లోకి తోశారు. ఇప్పటికీ ఆ చీకటి గుయ్యారాల్లో మగ్గుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఇదంతా అప్రకటిత ఎమర్జెన్సీ అని ఓం బిర్లాకు తట్టలేదు. దిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళనచేస్తే వారి సమస్య ఒక్కసారి కూడా సభలో చర్చకు రానివ్వక పోవడం ఆయనకు అన్యాయం అనిపించలేదు. ఇదంతా అప్రకటిత ఎమర్జెన్సీ అని గ్రహించే లక్షణం ఆయనకు లేదు. ఈ దేశంలో పార్లమెంటును సర్వోత్తంగా పరిగణిస్తాం కనకే స్పీకర్కు కూడా అపారగౌరవం ఇస్తాం. కోరుకుంటేనో, దేబెరిస్తేనో గౌరవం దక్కదు. బాధ్యతాయుత స్థానంలో ఆసీనులైన వారు ఆ స్థానానికి ఉన్న గౌరవం కాపాడకపోతే ఆ వ్యక్తికీ గౌరవం దక్కదు. అన్నింటికన్నా మించి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్న పక్షాన్ని సమర్థించే స్పీకర్కు ఎమర్జెన్సీని ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టే హక్కు ఎక్కడిది? ఇతరుల నియంతృత్వ పోకడలను నిరసించినంత మాత్రాన నియంతలు అమాంతం ప్రజాస్వామ్య వాదులైపోరు. సభా గౌరవాన్నే కాదు, సభ్యుల గౌరవాన్ని, అధికారాలను, మాట్లాడే హక్కును పరిరక్షించ వలసిన బాధ్యత కచ్చితంగా స్పీకర్దే. ఆ బాధ్యత నిర్వర్తించిన చరిత్ర ఈ స్పీకర్కు లేదు. ఈ లోక్సభా కాలంలో ఆ లక్షణం అబ్బుతుందని ఆశించే పరిస్థితులూ కనిపించడం లేదు. మెజారిటీకి అల్లంత దూరంలో ఆగిపోయిన మోదీలోనే మార్పు కనిపించనప్పుడు ఆయనను నమ్ముకుని స్పీకర్ స్థానం సంపాదించుకున్న వ్యక్తి నుంచి దీక్షా దక్షత ఎలా ఆశించగలం! ఎమర్జెన్సీ కారణంగా లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ అశీస్సులతో బీజేపీ ఎదిగిన విషయాన్ని ఎలా మరిచిపోగలం!