దాదాపు నాలుగేళ్లకింద సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు రాహుల్గాంధీ మోదీ అన్న ఇంటిపేరు ఉన్న వారందరూ దొంగలే ఎందుకు ఉంటారు అని వ్యాఖ్యానించిన కేసులో కిందికోర్టులు ఆయన దోషి అనిచేసిన నిర్ధారణను రద్దు చేయడానికి గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. ఇది రాహుల్ గాంధీకి ప్రతికూలమైన పరిణామంఅని భావించే వారికి కొదవ లేదు. రాహుల్ ఇలా వ్యాఖ్యానించడంలో ఉచితానుచితాలు చర్చనీయాంశం కావచ్చు. కేవలం పరువునష్టం దావాలో సూరత్లోని కిందికోర్టు రాహుల్కు అత్యధికంగా విధించదగిన రెండేళ్ల శిక్ష వేయడం అపురూపమే. ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి పరువు నష్టం కేసులో అత్యధిక శిక్ష విధించడం ఇదే మొదలు అని ఈ వ్యవహారాలలో విజ్ఞులు చెప్తున్నారు. చాలా సందర్భాలలో పరువునష్టం కేసుల్లో క్షమాపణలు చెప్తే వదిలేస్తారు. కానీ క్షమాపణ చెప్పడానికి రాహుల్ నిరాకరించినందువల్ల కోర్టు శిక్షించి ఉండవచ్చు. సూరత్లోని మేజిస్ట్రేట్ కోర్టు గత మార్చి 23న రాహుల్ పరువు నష్టానికి పాల్పడ్డారని నిర్ధారించింది. విచిత్రం ఏమిటంటే నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ పేర్లు రాహుల్ చెప్పినా ఇవే పేర్లు వున్నవారందరినీ అవమానించినట్టేనని కోర్టు భావించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో. రాహుల్ ఎవరి పేర్లయితే ప్రస్తావించారో వారెవరూ తమ పరువుకు భంగం కలిగిందని ఫిర్యాదు చేయలేదు. కోర్టు కెక్కలేదు. అయితే గుజరాత్కు చెందిన బీజేపీ నాయకుడు పూర్ణేశ్ మోదీ సూరత్లోని కోర్టులో రాహుల్పై పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో దాదాపు రెండేళ్లు విచారణ జరిగింది. మధ్యలో కేసు దాఖలు చేసిన పూర్ణేశ్ మోదీనే విచారణ నిలిపి వేయాలని కోరారు. రాహుల్ పార్లమెంటులో అదానీ మీద తీవ్రమైన ఆరోపణలు గుప్పించిన తరవాత అదే పూర్ణేశ్ మోదీ విచారణ కొనసాగించాలని అర్జీ పెట్టుకున్నారు. సూరత్ మేజిస్ట్రేట్ కోర్టు సత్వరం విచారణ పూర్తిచేసి రాహుల్ను దోషిగా తేల్చి ఈ సందర్భాలలో విధించదగిన అత్యధిక రెండేళ్ల శిక్ష విధించారు. ఈ తీర్పు చెప్పిన మేజిస్ట్రేట్కు రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయో లేదో చెప్పలేం. కానీ ఈ తీర్పు తరవాత వెంటనే రాహుల్ గాంధీ లోకసభ సభ్యత్వం రద్దయి పోయింది. లోకసభ సభ్యుడిగా ఆయనకు కేటాయిచిన బంగళా ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎంపీలుగా గడువు ముగిసినా అనేకమంది ప్రభుత్వ బంగళాలను ఖాళీ చేయకపోవడం పరిపాటి. ఉదాహరణకు గులాం నబీ అజాద్ రాజ్యసభ సభ్యత్వం ముగిసి ఏడాదికన్నా ఎక్కువ కాలం గడిచినా ప్రభుత్వ భవనం నుంచి ఆయన మకాం మార్చలేదు. అయినా ఖాళీ చేయించలేదు. మరోవైపు కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ సెషన్స్ కోర్టుకు వెళ్లినా ఏప్రిల్ 20న రాహుల్ అర్జీని తిరస్కరించింది. శుక్రవారం గుజరాత్ హైకోర్టు వెలువరించిన తీర్పు రాహుల్కు వ్యతిరేకంగానే ఉంది. ఈ కేసులో కింది కోర్టు మొదలు కొని హైకోర్టు దాకా ఏ తీర్పు ఇచ్చినా అందులో న్యాయాన్యాయాలు, మంచి చెడ్డలు, చట్టపరమైన అంశాలు, పూర్వ ఉదంతాల మీద చర్చించవచ్చు. అవసరమనుకుంటే విమర్శించనూ వచ్చు. కానీ న్యాయమూర్తి తీర్పుకు దురుద్దేశాలు అంటకట్టలేం. ఈ సూత్రాన్ని ఇప్పటివరకూ అధిగమించకపోయినా రాహుల్ ఏ కోర్టుకెళ్లినా ప్రతికూలమైన తీర్పే ఎందుకు వస్తోంది అన్న ప్రశ్న మాత్రం తలెత్తుతోంది. రాహుల్ను దోషిగా తేల్చినా ఆయనకు విధించిన శిక్ష అమలును నిలిపివేసింది. పై కోర్టుకెళ్లడానికి అనుమతించింది. దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలన్న అభ్యర్థనను హైకోర్టు మన్నించలేదు కనక రాహుల్ ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించవలసిందే. ఆ పని చేయనూవచ్చు. ఇలాంటి కేసే సామాన్యుల మీద ఉంటే ఇలాంటి తీర్పే వెలువడినా సెషన్స్ కోర్టు, హైకోర్టు లాంటి ఎన్ని మెట్లెక్కినా అంతగా చర్చనీయాంశం అయ్యేదికాదు. దోషిగా తేలింది రాహుల్ గాంధీ కనక విస్తారంగా చర్చ జరుగుతోంది. దీనికి తోడు కోర్టుల వ్యవహార సరళిమీదా నీలి నీడలు ప్రసరిస్తున్నాయి. అసలు గుజరాత్ కోర్టులో కేసు దాఖలు చేయడమే చర్చకు దారితీసింది.
గుజరాత్లోని కోర్టులు భిన్నమైనవా? అవునని చెప్పలేం కాని జనంలో అనుమానాలైతే ఉన్నాయి. నీరవ్ మోదీ, లలిత్ మోదీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు కూడా ఎత్తడం తప్పేనని సూరత్ మేజిస్ట్రేట్ అంగీకరించడం విడ్డూరం. మోదీ అన్న ఇంటి పేరున్న వారందరినీ రాహుల్ అవమానించారన్న నిర్ధారణకు వచ్చారు. పైగా రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడు కనక, ఆయన మాటలను జనం నమ్ముతారు కనక జాగ్రత్తగా వ్యవహరించాలని మేజిస్ట్రేట్ హదిరాశ్ వర్మ హితోక్తి కూడా పలికారు. మోదీ పేరెత్తడం రాహుల్ రాజకీయ దురాశను తీర్చుకోవడానికేనని టీకా తాత్పర్యాలు కూడా చెప్పారు. రాహుల్ సావర్కరును విమర్శించడమూ తప్పేనని మేజిస్ట్రేట్ అన్నారు.
మోదీ అన్న ఇంటిపేరున్న 13కోట్ల మందిని రాహుల్ అవమా నించినట్టేనని కూడా అన్నారు. మోదీ అన్న ఇంటి పేరున్న వారు 13 కోట్ల మంది అని ఏ లెక్కల్లో తేలిందో తెలియదు. రాహుల్ అర్జీని హైకోర్టు కూడా నిరాకరించినందువల్ల ఆయన లోకసభ సభ్యత్వం పునరుద్ధరణ ఇప్పట్లో అసాధ్యం. మోదీ సర్కారుకు కావలసింది కూడా అదే. అదానీ, పెగాసస్, రాఫేల్ మొదలైన కీలకాంశాలను పార్లమెంటు వేదిక మీంచి రాహుల్ లేవనెత్తడం మోదీ సర్కారుకు కంటిలోని నలుసుగా తయారైంది. మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పు ‘‘అజేయమైంది, సముచితమైంది, చట్టబద్ధమైంది’’ అని శుక్రవారం రాహుల్ అర్జీని తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించడాన్ని ప్రత్యేకంగా గమనించవలసిందే. ఇలాంటి కేసులు రాహుల్ మీద పది దాకా ఉన్నాయనీ, ఈ కేసు నడుస్తుండగానే మరో కేసు దాఖలైందని అందువల్ల దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరడాన్ని అంగీకరించలేమని హైకోర్టు వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కల్గిస్తోంది.
కోర్టులు సాధారణంగా తమ ఎదుట ఉన్న కేసుకు సంబంధించిన అంశాలనే ప్రస్తావిస్తాయి తప్ప ఇతర కేసులను, దీనికి సంబంధంలేని వ్యవహారాల్లో నిందితుడి నడవడికను, అది మంచిదైనా చెడ్డదైనా పట్టించుకోవు. కానీ రాహుల్ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. ఆరోపణలను నిర్ధారించడం మీద స్టే విధించాలన్న నిబంధన ఏమీ లేదు అని కూడా హైకోర్టు పేర్కొంది. అలా అయితే ఇతరేతర అంశాలను ప్రస్తావించకూడదు అన్న నిబంధన హైకోర్టు న్యాయమూర్తులకు ఎందుకు గుర్తుకు రాలేదో! వెరసి తేలుతున్నదేమిటంటే కోర్టు వెలుపలి పరిణామాలను పట్టించుకో కూడదన్న నియమాన్ని కోర్టులు ఖాతరు చేయడంలేదు. అలాగే న్యాయస్థానాల్లో జరిగే వ్యవహరాలను రాజకీయం చేయకూడదన్న సూత్రాన్ని రాజకీయవాదులూ లెక్క చేయడం లేదు. సర్వం రాజకీయమయం.