భారతీయ జనతా పార్టీ అవారసత్వం స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి నుంచి వచ్చింది కానందువల్ల మోదీ నాయకత్వంలో పదేళ్ల కింద కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరవాత బీజేపీ తన వారసత్వ మూలాలను జాతీయోద్యమంతో ముడి వేయడానికి ప్రయత్నించింది. భారత రాజ్యాంగం మీద బీజేపీకి, దాని పూర్వ రూపమైన భారతీయ జనసంఫ్ుకు ఈ రెండు రాజకీయ పార్టీలకు స్ఫూర్తినిచ్చే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్ు (ఆర్.ఎస్.ఎస్.)కు ఎన్నడూ ఇసుమంత అభిమానం కూడా లేదు. కానీ వచ్చే నెలలో మహారాష్ట్ర శాసనసభకు జరగాల్సి ఉన్న ఎన్నికలు ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనను, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి మాయోపాయంతో ఈ చీలిక వర్గాల దన్నుతో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి కాగలిగింది. శివసేనను చీల్చి వచ్చిన ఏక్ నాథ్ షిండేకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినా వెనక నుంచి మంత్రాంగం నడిపేది ఉప ముఖ్యమంత్రి పదవితో సంతృప్తి పడవలసి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీసే. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో మహారాష్ట్రలో బీజేపీ ఇది వరకటి కన్నా తక్కువ సీట్లు సంపాదించింది. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల మన్నన పొందలేక పోయింది. ఎన్.సి.పి.ని చీల్చి వచ్చిన అజిత్ పవార్లో ఇప్పటికీ ఊగిసలాటే కనిపిస్తోంది. గత లోకసభ ఎన్నికలలో భార్యనే గెలిపించుకోలేక పోయాడు. ఈ సూచనలన్నీ శాసనసభ ఎన్నికలలో ప్రస్తుతం షిండే నాయకత్వంలోని మహాయుతికి ప్రతికూలంగానే ఉంది. గెలుపు ఓటముల ప్రభావం షిండే, అజిత్ పవార్ నాయకత్వంలోని పార్టీలను పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు కానీ దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మహానగరం ఉన్న మహారాష్ట్రలో తిరుగులేని పట్టు సంపాదించలేకపోతే ఆ ఓటమి భారమంతా బీజేపీ నాయకుడైన దేవేంద్ర ఫడ్నవీస్ మోయాల్సి వస్తుంది. ఆ తరవాత ఆయన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం కావచ్చు. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టడం అప్పుడు బీజేపీకి అవసరం అయి ఉండొచ్చు. కానీ శాసనసభ ఎన్నికలలో ఎలాగోలా విజయం సాధించి పట్టు నిలుపుకోవడం బీజేపీకి చాలా అవసరం. అధికార కాంత చేలాంచలాలు పట్టుకు తిరగడంలో బీజేపీ ఆరితేరి పోయింది. ఎప్పటికి ఏ వేషం వేసుకోవలసి వస్తే ఆ వేషం వెయ్యగల నైపుణ్యం అపారంగా సంపాదించేసింది. అయితే ఇది ఒక్కటే చాలదు. దానికి ఓ సైద్ధాంతిక పునాదీ అవసరం. ఈ పునాది తమ అసలు సైద్ధాంతిక పునదితో ఏ మాత్రం పొసగకపోయినా నీట మునిగిపోతున్న వాడికి ఉలిపికట్టె కూడా ప్రాణ రక్షణకు మహోపాయం అనిపిస్తుంది. అందుకే దేవేంద్ర ఫడ్నవీస్ రాజ్యాంగం మీద ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తున్నారు. రాజ్యాంగం తమకు శిరోధార్యం అని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫడ్నవీస్ రాజ్యాంగానికి, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ కు మోకరిల్లుతున్న పోస్టర్లు మహారాష్ట్రలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. రాజకీయ తంత్రం ఎరిగిన బీజేపీ నాయకుడు ఫడ్నవీస్ అమాంతం ప్లేటు ఫిరాయించి రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద అపారమైన గౌరవ విశ్వాసాలున్నట్టు నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నాలను ఒక పిసరు అనుమానించక తప్పదు.
రాజ్యాంగ రూపకల్పన పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 25న అంబేద్కర్ చేసిన ఆఖరి ప్రసంగంలో రాజ్యాంగ విశిష్టతను నొక్కి చెప్తూనే పొంచి ఉన్న ప్రమాదం గురించి ఊహించి హెచ్చరించారు. ఇది చాలా విశిష్టమైన రాజ్యాంగం అయినా దీన్ని అమలు చేసే తీరు మీదే దాని ప్రయోజనం పదిలంగా ఉంటుందని చెప్పారు. రాజ్యాంగం అమలులోకి వచ్చే రోజైన 1950 జనవరి 26 నుంచి మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటాం. అంటే ప్రజలు తమ కోసం తాము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, తామే నడుపే ప్రభుత్వం, ప్రజలకోసం ఉద్దేశించిన ప్రభుత్వం ఏర్పడే మాట నిజమే అని ఆయన అన్నారు. ఆ వెంటనే ‘‘కానీ రాజ్యాంగం భవిష్యత్తు ఏమిటి అని ప్రశ్నించారు. అంటే రాజ్యాంగాన్ని మనం సంపూర్ణంగా కాపాడుకోలేక పోతామన్న అన్న అనుమానం అప్పటికే అంబేద్కర్ కు ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోగలుగుతామా లేదా పోగొట్టుకుంటామా అని కూడా అంబేద్కర్ అనుమానం వ్యక్తం చేశారు. సరిగ్గా నాలుగు రోజుల తరవాత 1949 నవంబర్ 30నాటి ఆర్.ఎస్.ఎస్. అధికారిక పత్రిక ఆర్గనైజర్ పత్రికలో ఇదే సంఫ్ు పరివార్ రాజ్యాంగం మీద భయంకరంగా దుమ్మెత్తి పోసింది. రాజ్యాంగంలో భారతీయత అనేది ఉదాహరణ ప్రాయంగా కూడా లేదని దెప్పి పొడిచింది. రాజ్యాంగ నిర్మాలతలు మనుస్మృతిలో చెప్పిన సూత్రాలను రాజ్యాంగంలో చేర్చడంలో విఫలమయ్యారని విమర్శించింది. అంటే సంఫ్ు పరివార్ దృష్టిలో మనుస్మృతే మనకు రాజ్యాంగం కావాలి. చాలా కాలం దాకా ఆర్.ఎస్.ఎస్. భారత జాతీయ పతాకాన్నే గుర్తించలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘‘అబ్కీ బార్ 400 పార్’’ అన్న మోదీ నినాదంతో మంత్రముగ్ధులైన వారు తమకు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తున్నామని చెప్పారు. అంతెందుకు మర్యాదస్థుడు అనుకునే అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే రాజ్యాంగాన్ని పునర్లిఖించాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. దానీ కోసం న్యాయమూర్తి వెంకటాచలయ్య నేతృత్వంలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ నివేదిక కూడా సమర్పించింది. కానీ ‘‘భారత్ వెలిగిపోతోంది’’ అన్న ప్రచారాన్ని విపరీతంగా నమ్మేసిన బీజేపీ 2004 ఎన్నికలలో బోల్తా పడిరది. కానీ 2014లో మోదీ నాయకత్వంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో జాతీయ పోరాటంలో తమకు లేని స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి, నెహ్రూకు బదులు సర్దార్ పటేల్ తొలి ప్రధానమంత్రి అయిఉంటే ఎంతబాగుండేది అని మోదీ నాయకత్వంలో భారీ ప్రచారం జరిగింది. పనిలో పనిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ను కూడా ఆర్.ఎస్.ఎస్. సొంతం చేసుకోవాలని ప్రయత్నించింది. రాజ్యాంగం మీద ఎనలేని భక్తి ప్రవత్తులు ప్రదర్శించి జనాన్ని మోసం చేయాలని ప్రయత్నించింది. 2015 గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పత్రికల్లో విడుదల చేసిన వ్యాపార ప్రకటనల్లోంచి ‘‘రాజ్యాంగ పీఠికలోని సెక్యులర్, సోషలిస్ట్ అన్న మాటలను మినహాయించేసింది. అదేమంటే మేము తొలి రాజ్యంగా ప్రతి తీసుకున్నాం అని చెప్పారు. అమలులో ఉన్న రాజ్యాంగం అంటే లెక్కలేనట్టుగా ప్రవర్తించడంలో భాగమే ఇది. దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇప్పుడు హఠాత్తుగా రాజ్యాంగం గుర్తొచ్చింది. అంబేద్కరూ గుర్తు వచ్చారు. ఎన్నికల పబ్బం గడుస్తుందనుకుంటే బీజేపీ ఎన్ని రాజీలకైనా సిద్ధం అవుతుంది. ఎన్ని ఉడుపులైనా మారుస్తుంది. ఈ కుహనా ప్రచారానికి బలి కాకుండా ఉండాల్సింది మహారాష్ట్ర ప్రజలే.