గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉచిత ఇసుక పేరుతో జనాన్ని దోచుకున్నారనీ, తాము అధికారంలోకి వచ్చాం కనుక ఆ పరిస్థితిని సమూలంగా మార్చివేసి ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేసిన ప్రకటనలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. స్వాతంత్య్రోద్యమంలో చేసిన ఉప్పుసత్యాగ్రహాన్ని గుర్తుచేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో ఉచిత ఇసుక కోసం సత్యాగ్రహం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇసుక నూతన విధానం ప్రకటించిన తర్వాత వారానికి ఒక్కరోజు అదికూడా అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఆన్లైన్ ఓపెన్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇసుకను పూర్తి పారదర్శకంగా సరఫరా చేస్తున్నా తప్పుడు ప్రచారం చేస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అందుబాటులో లేకపోవడంపై సామాజిక మాధ్యమం వేదికగా నిలదీయడంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ అదంతా అసత్య ప్రచారం అని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని గనులశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఉచిత ఇసుక విధానంపై ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బేస్ లెవల్ స్థాయిలో ఒక ట్రాక్టర్ ఇసుక గతంలో రూ.4.500కే వచ్చేది ఇప్పుడు దాదాపు రూ.7.500 వరకు పెట్టినా దొరకడంలేదు. లారీ ఇసుకకు రూ.25 వేలు చెల్లించాల్సి వస్తోంది. బస్తా ఇసుక రూ.200, కిలోకు రూ.4 ఖర్చవుతోందని చెపుతున్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా పెరిగిపోయిందనీ, సిమెంట్ కంటే ఇసుక ధర ఎక్కువైందన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. వర్షాకాలం ముగిసే వరకూ నదీగర్భాల్లో రీచ్లు పనిచేయకపోవడం వల్ల స్టాక్యార్డుల సంఖ్య జులైలో 86 నుంచి 14కు తగ్గింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి, కనీసం చిన్నచిన్న మరమ్మతులకూ కూడా ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, ఇతర రంగాలవారు చేస్తున్న ఆందోళనలు ఉచిత ఇసుకపై రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఇసుకను నిత్యావసర వస్తువుగా భావించి సరఫరాకు ఉన్న అన్ని సమస్యలనూ తొలగించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకున్నట్టు కనిపించడంలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక విధానం జగన్ హయాంలో కన్నా చాలా ఘోరంగా ఉందన్న విమర్శలున్నాయి. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ఇసుక ఉచితంగా అందజేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అధికారం చేపట్టిన తర్వాత అమలు చేయడంలో చంద్రబాబు తీవ్రంగా విఫలమయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇసుక ధరలు గతంలో కంటే విపరీతంగా పెరిగిపోవడమేకాకుండా ఇసుక అందుబాటులో ఉండకపోవడంతో నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. తత్ఫలితంగా భవన నిర్మాణకార్మికులు, ఆ రంగంపై ఆధారపడిన ఇతర రంగాల కార్మికులు పనులులేక రోజువారీ జీవననౌకను నడపడంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత ఇసుక కోసం ఆందోళనకు దిగుతున్నారు. కలెక్టరేట్లు, తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. ‘బాబూ ఏదీ ఉచిత ఇసుక, ఎక్కడ ఉచిత ఇసుక’ అని నిలదీస్తున్నారు. ఉచిత ఇసుకను అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలని, నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని, పేద, మధ్య తరగతి ప్రజలకు ఇసుక భారం తగ్గించాలన్న వారి డిమాండ్లో న్యాయం లేకపోలేదు. వర్షాకాలం తరువాత ఇసుక సరఫరా కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని రాష్ట్ర భూగర్భ గనులశాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్కుమార్ మీనా కొద్ది రోజుల క్రితం తెలిపారు. ఇసుక లభ్యతను పెంచేందుకు జారీచేసిన జీఓ 59 ప్రకారం పట్టా భూముల నుంచి ఇసుక తవ్వకాలకు కూడా అనుమతి ఉందనీ, ఈ నెల 15 నుంచి స్టాకు యార్డులు డి సిల్టేషన్ పాయింట్లు, రీచ్ల ద్వారా ఇసుక డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 70 లక్షల టన్నుల సామర్థ్యంతో 108 రీచ్లు మాన్యువల్ పద్ధతులను ఉపయోగించి పనిచేయించడం వల్ల అన్ని జిల్లాల్లో సరఫరా పెరుగుతుందన్న ఆశాభావంతో అధికారయంత్రాంగం ఉంది. ఇసుక బుకింగ్ సౌలభ్యతను మెరుగుపరిచేందుకు ఆన్లైన్ పోర్టల్తోపాటు రీచ్ల వద్ద నేరుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లైతే ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు కూడా ఇసుక పొందడం సులభమవుతుంది. ఈ ప్రక్రియలో ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఇసుక లభ్యత, రవాణా, ఆపరేషన్ ఖర్చులు మొదలైన వాటి గురించి ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారం అందచేయాలి. తనిఖి, జీపీిఎస్, ట్రాకింగ్, ఆడిట్ విధానాలతో బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా చూడాలి. అప్పుడే ఇసుక సరఫరాపై గందరగోళం తొలగే అవకాశంవుంటుంది. రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి 70 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన 108 రీచ్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు చెపుతున్నారు. ఇసుక రీచ్ల సంఖ్య పెంచేందుకు రానున్న రోజులలో ప్రైవేటు వ్యక్తులు కూడా మైనింగ్శాఖ అనుమతితో తవ్వకాలు ప్రారంభిస్తారంటున్నారు. ప్రైవేటు ఇసుక రీచ్లలో కూడా డీఎల్ఎస్సీ నిర్ణయించిన ధరకే ఇసుక విక్రయాలు జరిగేలా చూడాలి.
ఊహలకు అందని మాస్టర్ స్కెచ్తో ఇసుకను దోపిడీ చేస్తున్నారని తన అనుభవాన్నంతా రంగరించి దోపిడీకి చంద్రబాబు పథకం పన్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2014-19 మధ్యలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఇసుక విధానం కోసం 19 జీవోలు ఇచ్చిందనీ, ఎమ్మెల్యేలు, నాయకులకు ఎలా దోచిపెట్టవచ్చో చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇసుక ఉచితంగా ఇస్తామని ఊరూర డప్పుకొట్టి మరీ ప్రచారం చేశారు ఇప్పుడు ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతోందా? అని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీస్తున్నారు. 2014-19 మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేసిన తీరు ఇప్పుడు పునరావృతం అయ్యిందన్నారు. ఈ ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక సరఫరాపై దృష్టి సారించి ఇసుకను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి. జగన్ హయాంలో కంటే ఇసుక విధానం ఘోరంగా ఉందన్న అప్రపదను తొలగించుకోవాలి. గతంలో కంటే ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలే కారణమన్న ఆరోపణలపై నిజం నిగ్గుతేల్చాలి. బాధ్యులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉచిత ఇసుకను అందుబాటులోకి తెచ్చి భవన నిర్మాణ రంగాన్ని కాపాడాలని, నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలి, పేద, మధ్య తరగతి ప్రజలకు ఇసుక ధర భారం తగ్గించాల్సిన అవసరం ఉంది. అక్రమ మైనింగ్ రవాణా నియంత్రణకు జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్లను బలోపేతం చేయాలి.