ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలైనాయి, అందులో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎందరు లాంటి వివరాలు ప్రజలకు అందజేయవలసిన బాధ్యత చట్ట రీత్యా తమకు లేదని ఎన్నికల కమిషన్ వాదిస్తోంది. ఇందులోని ఉచితానుచితాలు సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయిన తరవాత, సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ముగిసిన తరవాతగానీ తేలేట్టు లేదు. ఎన్నికలు జరుగుతున్నందువల్ల మధ్యలో తాము కలగజేసుకుని ఎన్నికల కమిషన్మీద అదనపు భారం వేయలేమని సుప్రీంకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది. అంటే ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ వాదనే అమలు అవుతుంది. చట్టరీత్యా పోటీచేసే అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు మాత్రమే వివరాలు అందజేస్తామని సుప్రీంకోర్టుకు అందజేసిన ప్రమాణ పత్రంలో ఎన్నికల కమిషన్ వాదించింది. ఎన్నికల కమిషన్ వాదనలోని సారాంశం ఏమిటంటే పోలింగ్ వివరాలు ప్రజలకు అందించవలసిన బాధ్యత తమకు లేదనే. ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల క్రమంలో వింతగా ప్రవర్తిస్తోంది. దీన్ని సవాలు చేయడానికే ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఎ.డి.ఆర్.) తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా, కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్కు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడిరచవలసిన బాధ్యత చట్టరీత్యా ఎన్నికల కమిషన్కు లేదని, అందువల్ల దాన్ని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో కూడా ఉంచే ప్రసక్తిలేదని ఎన్నికల కమిషన్ తెగేసి చెప్తోంది. ఈ సమాచారం బయటపెడ్తే కొంతమంది దాన్ని దుర్వినియోగం చేయవచ్చునని ఎన్నికల కమిషన్ అనడం ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు లేదని, సమాచార హక్కు చట్టానికి ఈ విషయంలో విలువలేదని చెప్పడమే. ఎన్నికల బాండ్లు చెల్లవని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఎవరు ఏ పార్టీకి ఎన్ని నిధులు సమకూరుస్తున్నారో ప్రజలకు తెలియాలన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణమైంది కూడా. అలాంటప్పుడు పోలింగ్ కేంద్రాలలో ఓట్ల వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు ఎందుకు ఉండదు అన్నది అసలు ప్రశ్న. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సాకల్యంగా తీర్పు చెప్తే తప్ప ఎన్నికల కమిషన్ ప్రవర్తనలోని వైపరీత్యంలోని ఆంతర్యం ఏమిటో అంతు చిక్కదు. అది తేలడానికి కనీసం మరికొన్ని నెలలు పడ్తుంది. ఎన్నికలు ముగిశాయి కనక ఈ విషయం తేల్చడానికి ఇప్పుడు తొందరేమిటి అని సుప్రీంకోర్టు భావిస్తే ఎప్పటికి తేలుతుందో కూడా చెప్పలేం. సార్వత్రిక ఎన్నికలలో ఎంత మంది ఓటర్లు ఓటు వేశారన్న విషయానికి సంబంధించిన సమాచారం తెలుసుకునే హక్కు లేదని కమిషన్ తెగేసి చెప్పడమే. చట్టంలో ఎన్నికల కమిషన్కు ఈ బాధ్యత ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడ్తే ఎన్నికల కమిషన్ ధోరణి ప్రజలకు ఉన్న సమాచారం తెలుసుకునే హక్కును బాహాటంగా నిరాకరించడమే. ఇప్పటి దాకా అయిదు విడతల పోలింగ్ పూర్తి అయింది. శనివారం ఆరో విడత పోలింగ్ పూర్తి అవుతుంది. జూన్ ఒకటవ తేదీన ఏడవ, ఆఖరి విడత పోలింగ్ కూడా పూర్తి అవుతుంది.
ఈ ఒక్క అంశంలోనే కాదు పోలింగ్ వివరాలను ప్రకటించడంలో ప్రస్తుత ఎన్నికల కమిషన్ ఇంతకు ముందెన్నడూలేని వక్రమార్గం అనుసరిస్తోంది. సాధారణంగా పోలింగ్ జరుగుతున్న క్రమంలోనే ప్రతి రెండు గంటలకు ఒకసారి ఎన్ని ఓట్లు పోలైనాయో పోలింగ్ కేంద్ర అధికారులు రిటర్నింగ్ అధికారికి తెలియజేయడం, ఆ అధికారి ఎన్నికల కమిషన్ కు అందజేయడం ఆనవాయితీ. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇ.వి.ఎం.)లు లేనప్పుడు కూడా సాయంత్రానికి ఎన్నికల కమిషన్ ఈ లెక్కలు వెల్లడిరచేది. పోలింగ్ సమయం ముగిసినా బారుల్లో నిలిచిన వారందరికీ ఓటువేసే సదుపాయం ఉంది కనక తేడాలు ఏమైనా ఉంటే మహా అయితే మరుసటి రోజు కచ్చితమైన వివరాలు ఎన్నికల కమిషన్ ప్రకటించేది. మామూలుగా పోలింగ్ పూర్తి అయిన తరవాత ఆ రోజు సాయంత్రమే ఎన్నికల కమిషన్ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించి పోలింగ్ వివరాలు వెల్లడిరచేవారు. ఈ విడత ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టడం ఎవరికోసమో తేలాలి. తొలి దశ పోలింగ్ వివరాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ కు 11 రోజులు పట్టింది. ఇంతవరకు జరిగిన అయిదు విడతల పోలింగులో మిగతా నాలుగు విడతల పోలింగ్ వివరాలను ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ కనీసం నాలుగు రోజులు జాప్యం చేసింది. ముందు ప్రకటించిన వివరాలకు, కొన్ని రోజుల జాప్యం తరవాత వివరాలకు మధ్య చాలా అంతరం ఉంది. సాధారణంగా తాత్కాలిక అంచనాలకు మహా అయితే ఒక శాతం వ్యత్యాసం ఉండేది. పోలింగ్ సమయం ముగిసినా ఇంకా ఓటు వేయవలసిన వారు పొద్దు పోయినా బారులు తీరి ఉండడమే దీనికి కారణం. వారు అమాంతం ఎనిమిది శాతానికి పెరగరు గదా. దీనికి ఎన్నికల కమిషన్ దగ్గర సమాచారం లేదు. తుది వివరాల్లోనూ ఎన్నికల కమిషన్ పోలింగ్ శాతాన్ని మాత్రమే బయట పెట్టింది తప్ప ఎన్ని ఓట్లు పోలైనాయన్న విషయం వెల్లడిరచలేదు. ఏ దురుద్దేశమూ లేకపోతే పోలైన ఓట్ల సంఖ్యను ప్రకటించకుండా ఎందుకు దాచి పెడ్తున్నట్టు? పోలైన ఓట్ల శాతాన్ని పోలైన మొత్తం ఓట్ల ఆధారంగానే లెక్క కడ్తారు కదా. అంటే ఆ సంఖ్య ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ అందుబాటులో ఉంటుంది. ఈ వివరాలు మరుసటి రోజుకైనా ఎన్నికల కమిషన్కు అందుతాయి. ఆ వివరాలను ప్రకటించకపోవడం అనుమానాలకు తావివ్వక మానదు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎన్నికల కమిషన్ నడవడిక చూస్తే ఏదో ఒక పక్షానికి, ప్రధానంగా అధికార పక్షానికి ప్రయోజనం కలిగించడానికి పోలింగ్ లెక్కలు ప్రకటించవలసిన బాధ్యత చట్టరీత్యా తమకు లేదని డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నట్టు స్పష్టంగానే తేలిపోతోంది. పోలింగ్కు సంబంధించి పూర్తి వివరాలు ప్రకటించకపోవడం అంటే ఎన్నికల ప్రక్రియలో ఏదో దాపరికం ఉందని అనుమానించక తప్పదు. ఎన్నికల ప్రకటన విడుదల చేస్తున్న సమయంలో ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రాజీవ్ కుమార్ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కడమే. పోలైన ఓట్లలో లెక్కించిన ఓట్ల వివరాలు ప్రకటిస్తున్నప్పుడు ఎన్ని ఓట్లు పోలైనాయో చెప్పే బాధ్యత చట్టరీత్యా తమకు లేదని ఎన్నికల కమిషన్ వాదించడం దిగ్భ్రాంతికరం. ఎన్నికల కమిషన్ మీద తమకు విశ్వాసం లేదని ఇటీవల జరిగిన ఒక సర్వేలో 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి చేటు. అధికారంలో ఉన్న ప్రభుత్వం అసమర్థులను ఎన్నికల కమిషన్ అధిపతులుగా నియమించడాన్ని నిరోధించే అవకాశం రాజ్యాంగంలో లేదు అని 1949 మే 16న డా.అంబేద్కర్ చేసిన హెచ్చరిక ఇప్పుడు నిజమైంది. తమకు అనుకూలమైన వారిని ఎన్నికల కమిషన్ అధికారులుగా నియమించడంవల్ల్లే ప్రస్తుత దుస్థితి.