బ్రిటన్లో పదేళ్ల తరవాత కన్సర్వేటివ్ పార్టీని ఘోరంగా ఓడిరచి లేబర్ పార్టీ శుక్రవారం అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ ప్రధానమంత్రి అయ్యారు. బ్రిటన్లో అధికార మార్పిడి ప్రభావం మన దేశంపై కూడా ఉండకతప్పదు. ఎన్నికల్లో రెండు దేశాల మధ్య సామ్యాలతో పాటు తేడాలూ ఉన్నాయి. మన దేశంలో 2019లో 17వ లోక్సభకు ఎన్నికలు జరిగాయి. అదే సంవత్సరం జులైలోనే బ్రిటన్ పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరిగాయి. బ్రిటన్ కామన్స్ సభ (మన లోక్సభ లాంటిది) లో 650 సీట్లు ఉన్నాయి. మెజారిటీ సాధించాలంటే 326 సీట్లలో విజయం సాధించాలి. అప్పుడు బోరిస్ జాన్సన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 365 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. కానీ బోరిస్ జాన్సన్ మూడు సంవత్సరాల 45 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగారు. అనేక ఆరోపణలు ఎదుర్కుని ఆయన పదవి వదులుకోవలసి వచ్చింది. ఆ తరవాత లిజ్ ట్రస్ 2022 సెప్టెంబర్ ఆరు నుంచి 2022 అక్టోబర్ 25 దాకా మాత్రమే అధికారంలో కొనసాగ గలిగారు. ఆ తరవాత రుషి ప్రధాని అయ్యారు. నిజానికి ఆయన ఎన్నికల ద్వారా ప్రధాని కాలేదు. కన్సర్వేటివ్ పార్టీ అంతర్గత రాజకీయాలవల్ల ఆయనను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. అయిదేళ్ల కాలంలో బ్రిటన్లో ముగ్గురు ప్రధానమంత్రులు మారడం రాజకీయ అస్థిరతకు సంకేతం. 2019లో నరేంద్ర మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత పరిపాలన ఎలా సాగింది అన్న అంశాన్ని పక్కన పెడ్తే రాజకీయ సుస్థిరత మాత్రం కొనసాగింది. ఇటీవల జరిగిన ఎన్నికలలో మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి అవసరమైన మెజారిటీ కన్నా 33 స్థానాలు తక్కువ వచ్చినప్పటికీ ఎన్.డి.ఎ. భాగస్వామ్య పక్షాల, తెలుగు దేశం, జనతా దళ్(యు) సహాయంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొన్నటి మన సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల ప్రచారమే భీషణంగా జరిగింది. మోదీ అన్ని అవధులూ దాటి అసత్యాలతో, విద్వేషం నింపడంతో ఎన్నికల ప్రచారం కొనసాగించారు. బ్రిటన్లో రాజకీయ సుస్థిరత లేదన్న మాట తప్పితే కన్సర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ మధ్య విభేదాలు ఉండొచ్చు కానీ వైమనస్యం లేదు. బ్రిటన్ రాజకీయ వ్యవస్థకు, మన వ్యవస్థకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఇదే. మన దేశంలోని సుస్థిరత్వం నుంచి బ్రిటన్ గుణపాఠం నేర్చుకుంటుందా లేదా సుస్థిరత్వం లేకపోయినా రాజకీయ విష ప్రచారాలకు దూరంగా ఉండాలన్న బ్రిటన్ వ్యవస్థ నుంచి బీజేపీ నడవడిక మార్చుకుంటుందా అన్నది ప్రధాన ప్రశ్న. పరస్పర అనుభవాల నుంచి ఏం నేర్చుకుంటాం అన్న విషయాన్ని పక్కనపెడ్తే ప్రధానమంత్రి మోదీ మాత్రం ఓడిపోయిన రుషి సునక్ను అభినందించారు. కొత్త ప్రధానమంత్రి స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ మర్యాదలు అవసరం కావచ్చు. రుషి సునక్ మన దేశానికి చెందిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తికి అల్లుడు. అందువల్ల మన అల్లుడు బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యాడని మురిసిపోయిన వాళ్లకు లెక్కలేదు. ఆ అల్లుడు ఇప్పుడు ఘోర పరాజయానికి గురై తప్పుకోవలసి వచ్చింది. సునక్ కుటుంబం నిజానికి బ్రిటన్కు చెందింది కాదు. ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం నుంచి బ్రిటన్లో స్థిరపడిరది.
ప్రతిపక్ష పార్టీలకు ఆశ్చర్యం కలిగించి విజయం సాధించాలన్న దృష్టితో ఎన్నికలు జరగాల్సిన సమయానికన్నా అనేక నెలల ముందే ఎన్నికలు నిర్వహించి సునక్ బోల్తా పడ్డారు. కన్సర్వేటివ్ పార్టీ ఇంత ఘోరంగా విఫలమవుతుందని కొద్ది వారాల కింద కూడా ఎవరూ ఊహించలేదు. దాదాపు పద్నాలుగేళ్లు ప్రతిపక్షంలో ఉన్న లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కన్సర్వేటివ్ పార్టీతో పోలిస్తే లేబర్ పార్టీ కాస్త అభ్యుదయకరంగా ఉంటుందన్న మాట చాలా కాలం వినిపించేది. ఇప్పుడు ఈ రెండు పార్టీల విధానాలకు పెద్ద తేడా కనిపించడం లేదు. అందువల్ల లేబర్ పార్టీ విజయం భారత్కు సానుకూలమో, ప్రతికూలమో చెప్పడానికి అవకాశం లేదు. కన్సర్వేటివ్ పార్టీ కేవలం వంద పై చిలుకు స్థానాల్లో మాత్రమే గెలవడం ఇదే మొదటి సారి. ఎన్నికలకు ముందు నిర్వహించిన జనాభిప్రాయ సేకరణలో కన్సర్వేటివ్ పార్టీకి జనంతో సంబంధం లేకుండా పోయిందని, ఆ పార్టీలో చీలికలున్నాయని, అపఖ్యాతిపాలు అయిపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అయింది. ఎన్నికలకు ముందు సర్వేలను బట్టి చూస్తే బ్రిటన్ ప్రజలు లేబర్పార్టీ వారిని సమర్థులని, విశ్వసించదగిన వారని భావించినట్టు తేలింది. ఇక్కడే ఎన్నికలకు ముందు, తరవాత మన దేశంలో జరిగిన ప్రజాభిప్రాయానికి కొట్టొచ్చినట్టు తేడా కనిపిస్తోంది. మన ఎన్నికల పండితుల్లో చాలా సంస్థల, వ్యక్తుల పస బయట పడిపోయింది. రుషి సునక్ హయాంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ, దౌత్య విధానాలు మెరుగ్గానే ఉన్నాయనుకున్నా ప్రజలతీర్పు మాత్రం ఆయనకు అనుకూలంగా లేదు. అధికారంలో ఉన్నన్నాళ్లు సునక్ సొంత పార్టీలో విభేదాలతో వేగక తప్పలేదు. తన నాయకత్వాన్ని సుస్థిరం చేసుకోలేకపోయారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఏ మాత్రం పసలేదని ఆయన పార్టీ వారే దెప్పి పొడుస్తున్నారు. లండన్లో న్యాయవాదిగా ఉన్న స్టార్మర్ లేబర్ పార్టీకి కొత్త రూపు ఇచ్చారు. లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు విధిస్తారన్న అభిప్రాయాన్ని మార్చగలిగారు. బ్రిటన్లో శరణు కోరిన వారిని మధ్య ఆఫ్రికాలోని రువాండాకు పంపించేయాలన్న సునక్ పథకం ఆయనకు ఉన్న అవకాశాలను వమ్ము చేసింది. స్టార్మర్ బ్రెక్సిట్ కు వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేశారు. మళ్ళీ యూరప్ సమాజంలో చేరే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. మరోవేపు లేబర్ పార్టీ నాయకులు చాలామంది భారత్లో ఉదారవాదానికి కలుగుతున్న విఘాతంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ తో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తానని కశ్మీర్ విషయంలో కూడ తమ విధానాన్ని మార్చుకుంటామని స్టార్మర్ అంటున్నారు. ఆయన ఏ మేరకు భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తారో ఆచరణలో కాని తేలదు. కానీ బ్రిటన్లో ఉన్న భారతీయుల మద్దతు ఆయనకు చాలా అవసరం. కశ్మీర్ లో మానవ హక్కులకు భంగం కలగడాన్ని లేబర్ పార్టీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. అయినా భారత్తో సత్సంబంధాలు బ్రిటన్కు అత్యవసరం అన్నది మాత్రం వాస్తవం. 2010 నుంచి అధికారానికి దూరమైన లేబర్ పార్టీ వాస్తవిక విధానాన్ని అనుసరిస్తామని అంటోంది. అయితే యూరప్ సమాజంతో భద్రతా ఒప్పందం చేసుకునే సూచనలే ఉన్నాయి. భారత్తో వ్యూహాత్మక సంబంధాలు మెరుగు పరుచుకుంటామని స్టార్మర్ అంటున్నారు. సాంకేతిక, భద్రత, విద్య, శీతోష్ణ స్థితిలో మార్పులను ఎదుర్కోవడం మొదలైన అంశాల్లో భారత్ సహకారం అవసరమని స్టార్మర్ భావిస్తున్నారు. బ్రిటన్లో అధికార మార్పిడిని మనం ఎలా వినియోగించుకుంటామో చూడాలి.