గోకరకొండ నాగ సాయిబాబాను గత మార్చి ఏడున సర్వోత్తమ న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. కానీ ఇన్నాళ్లూ నిష్కారణంగా ఆయన జైలులో మగ్గిపోవడానికి కారణం ఏమిటో అన్వేషించలేదు. దానికి నివారణోపాయామూ ఎప్పటిలాగే సూచించలేదు. ఆ ‘‘నిర్దోషి’’ అంతకు ముందు పదేళ్లపాటు జైలు గోడల మధ్యే నలిగి పోవలసి వచ్చింది. తీరా విడుదలైన ఏడు నెలలలోపె ప్రాణాలు వదిలాడు. చక్రాల కుర్చీ ఖాళీ అయిపోయింది. విడుదలైన తరవాత ఆయన అనుభవించిన స్వేచ్ఛా జీవితం కొంత కాలం మాత్రమే. జైలు నుంచి విడుదలయ్యానన్న వాస్తవాన్ని ఆయన నమ్మలేక పోయారు. జైలు ఆవరణ వెలుపల వీచే గాలీ, ప్రసరించే వెలుతురు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారన్న ఆరోపణపై కాలేజీలో పాఠం చెప్పి ఇంటికెళ్తున్న ప్రొఫెసర్ సాయి బాబాను మార్గ మధ్యమంలోనే పోలీసులు ఎత్తుకెళ్లి నాగపూర్ తీసుకెళ్లారు. అప్పటి నుంచి విడుదలయ్యే దాకా ఆయనకు జైలే నివాసమైంది. మధ్యలో అప్పుడప్పుడు బెయిలు మంజూరైనా ఆ వైభోగం న్యాయస్థానాలు మంజూరు చేసినన్ని రోజులు కూడా లేకుండా చేశారు. మళ్లీ తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఆయన తల్లి మరణ శయ్యపై ఉన్నప్పుడూ, తీరా ఆమె మృతి తరవాత కూడా ఆయనకు పెరోల్ మంజూరు చేసేపాటి సాహసం ఈ దేశంలోని న్యాయస్థానాలు చేయలేకపోయాయి. ‘‘నేను సన్యాసిని, ఎప్పుడు కావాలంటే అప్పుడు జోలె బుజాన వేసుకుని పోతాను’’ అని నిఖార్సైన అబద్ధం ఆడగల పాలకులు ఉన్న చోట మాతృప్రేమ గురించి న్యాయస్థానాలు మాత్రం ఎలా ఆలోచించగలుగుతాయి. ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడానికి అలవాటు పడిన న్యాయమూర్తులకు ఆ సాహసం ఎక్కడి నుంచి వస్తుంది. సాయిబాబాకు ప్రస్తుత వ్యవస్థ మీద అసంతృప్తి ఉండొచ్చు. దీన్నీ మార్చాలన్నా ఆకాంక్షా ఉండి ఉండొచ్చు. కానీ ఈ లక్ష్య సాధనకోసం ఆయన ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాడన్న నిరాధార ఆరోపణను న్యాయస్థానాల్లో రుజువుచేసే సరంజామా పోలీసుల దగ్గర కూడా లేకుండా పోయింది. హింస ఉద్యమకారుల వృత్తి కాదు, తత్త్వం కాదు, అలవాటూ కాదు. లక్ష్యం అంతకన్నా కాదు. రాజ్య వ్యవస్థ హింసను అనివార్యం చేస్తున్న సందర్భాలు అడుగడుగునా కనిపిస్తాయి. వ్యక్తి చేసే హింస కన్నా రాజ్య హింస పరమ నికృష్టమైంది. కిరాతకమైంది. సాయిబాబా వీటికే బలయ్యారు. ఆయన జైలులో ఉండగా మరణించి ఉండకపోవచ్చు. కానీ జైలులో గడిపిన దుర్భర జీవితమే ఆయనను మృత్యువుకు చేరువ చేసింది. అయిదున్నరేళ్ల వయసులోనే పోలియోవల్ల ఆయన రెండు కాళ్లూ చచ్చుబడి పోయాయి. జైలుకెళ్లక ముందు ఆయన తనంత తాను చక్రాల కుర్చీలో కూర్చోగలిగేవారు. తనంత తాను కాలకృత్యాలు తీర్చుకోగలిగే వారు. కాని దుర్భరమైన జైలు జీవితం ఇవేవీ సాధ్యం కాకుండా చేసింది. అరెస్టు చేసినప్పుడు పోలీసులు ఆయనను అమానుషంగా లాక్కెళ్లడంవల్ల ఆయన ఎడమచేయి పనిచేయకుండా పోయింది. జైలులో సరైన ఆరోగ్య సంరక్షణ లేనందువల్ల కుడిచేయి కూడా దెబ్బతిన్నది. ఆయనకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించాలని న్యాయమూర్తులు పెద్ద మనసుతో ఆదేశించినా అమలు చేయవలసిన ప్రభుత్వం, జైలు సిబ్బంది ఆ ఆదేశాలను కాలరాశారు. ‘‘ప్రాథమిక హక్కులు లేకుండా ప్రజాస్వామ్య హక్కులు సాధించుకోవడం సాధ్యం కాదు’’ అని సాయి బాబా అంటూ ఉండేవారు. ఈ మాట ఆయన విషయంలోనే రుజువైంది. బీమా కోరే గావ్ కేసులో అరెస్టయిన గిరిజన హక్కుల కోసం పోరాడిన స్టాన్ స్వామీ జైలులో మరణించలేదు. కానీ నిర్బంధంలో ఉండగానే అంటే బెయిలు మీద ఉన్నప్పుడు మరణించారు. సాయి బాబా నిర్దోషిగా విడుదలైన తరవాత మరణించినా దానికి ప్రధాన కారణం జైలులో ఆయన అనుభవించిన దుర్భర జీవితం, క్షోభే ప్రధాన కారణం. ఆయన విషయంలో న్యాయస్థానాలు న్యాయం చేయలేదు. చట్టాలూ ఆయనకు ఉపకరించలేదు. విడుదలైన తరవాత జైలు జీవిత ప్రభావంవల్లే ఆయన మృతి చెందారు. ఇది చట్ట పరిభాషలోనో, న్యాయ పరిభాషలోనే సహజ న్యాయం అంటారేమో తెలియదు. బెయిలు హక్కు అని విరామం లేకుండా చెప్పే అత్యున్నత న్యాయస్థానం ఆయన మీద రాజ్యం కొనసాగించిన కనికరంలేని దుర్వార్తనను ఆపలేకపోయింది. అలాంటప్పుడు బెయిలు హక్కు, జైలులో హింసా భరితమైన జీవనమే ప్రామాణికం, ఆనవాయితీ లేదా ప్రభుత్వ విధానం అనుకోవలసి వస్తుంది.
ఆయనకు ఒక సమయంలో బెయిలు మంజూరైన సందర్భంలో చట్టా రీత్యా ఆయన మీద తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని, ఆయన మీద తమకు కోపం ఏమీ లేదనీ పోలీసులు నిండు న్యాయస్థానం కొలువులోనే ప్రకటించినప్పుడూ న్యాయస్థానాలు అంతిమ న్యాయానికి అడ్డేమిటో ఆలోచించలేదు. కింది కోర్టుల విచారణలో ఆయనకు ఎన్నడూ న్యాయం కలగలేదు. పై కోర్టులు తమ ముందుకు వచ్చిన పరిశీలానాంశాల పరిధి దాటి ఆలోచించలేదు. ఆయన మనోస్థైర్యాన్ని దెబ్బ తీయాలని జైలు అధికారులు సకలవిధ ప్రయత్నాలూ చేశారు. ఆయన బెసక లేదు. బెయిలు ఇవ్వాల్సివచ్చినప్పుడు పోలీసులు ఆయనను విడుదల చేసినా సమ్మతమే కానీ బయటకెళ్లి క్రియాశీల కార్యకర్తగా ఉండకూడదన్న షరతు పెట్టారు. దీన్ని ఆయన తృణీకరించారు. ఇటలీ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆంటోనియో గ్రాంసీని జైలులో పెట్టినప్పుడు నియంత ముస్సోలినీ ఇలాగే ‘‘ఆయన బుర్ర పని చేయకుండా చూడండి’’ అని ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం అంతకన్నా తక్కువ కిరాతకంగా ఏమీ లేదు. ఆయన వైకల్యాన్ని చూసి రాజ్య వ్యవస్థే ఎన్నడూ కనికరం చూపలేదు. ఇలాంటి శారీరక స్థితి గురించి ప్రజాస్వామ్యం ముసుగు తొడుక్కున్న ప్రభుత్వాలు మాత్రం ఏందుకు ఆలోచిస్తాయి? రాజ్యానికి ఉన్న అభ్యంతరమల్లా ఆయన ఆలోచనతోనే. తన ఆలోచనలను ఆచరణలో పెట్టే శారీరక శక్తి స్థాయి బాబాకు లేదు. ఆలోచనలను అదుపుచేసే శక్తి ఏ రాజ్య వ్యవస్థకూ ఉండదు. ఎలాంటి ఆలోచనలైనా చట్టవిరుద్ధమైనవి కావు. ఈ వాస్తవాన్ని రాజ్య వ్యవస్థ ఒప్పుకోదు. ఆలోచనలను, భావజాలాన్ని, భావధారను నియంత్రించగలమన్న భ్రమలోనే రాజ్య వ్యవస్థ ఉంటుంది. అది దాని స్వభావం. పౌరులు చేయగూడని పనులు చేసే హక్కు రాజ్యానికీ లేదు. కానీ అనునిత్యం జరిగేది అదే. పౌరుల విషయంలో చట్టబద్ధం కానివి రాజ్యానికి పాలనా తంత్రంలో భాగం అవుతున్నాయి. ఈ అన్యాయాన్ని ఎవరు నివారించాలి. కోర్టులకు ఆ అధికారం ఉన్నా అవీ తప్పించుకుంటున్నాయి. ప్రవచనాలకే పరిమితం అవుతున్నాయి. జైలులో సాయిబాబాకు కష్టాలే మిగిలాయి. ఆ కష్టాల ప్రభావం చివరకు ఆయన ప్రాణాలు తీసింది. ఈ పరిస్థితి ఎదురుకావడమే మహా విషాదం. న్యాయం కోసం, పౌర హక్కులకోసం, ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో చేరిపోయిన మరో పేరు సాయిబాబా. ఈ పేరు చాలా కాలం మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. జైలులో సాయిబాబా పడ్డ కష్టాలకు ఆయన భార్య వసంత మోసిన భారం, కార్చిన కన్నీళ్లు, నిలబెట్టుకున్న ధైర్యం, కూడదీసుకున్న ఆత్మవిశ్వాసం ఏ మాత్రం తక్కువ కాదు. ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అందుకే వసంత ఒంటరి కాదు.