రాజా, నారాయణ సహా నేతల అరెస్టు
న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో అన్నదాతలను కారుతో ఢీకొట్టి అత్యంత పాశవికంగా హత్య చేయ డాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిరచింది. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని డిమాండు చేసింది. సీపీఐ సోమవారం దిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా నాయకత్వంలో పార్టీ జాతీయ సమితి సభ్యులు అందరూ ప్రదర్శనలో పాల్గొన్నారు. సీపీఐ కేంద్ర కార్యాల యం అజయ్ భవన్ నుంచి ప్రదర్శన ప్రారంభమైంది. ఐటీసీ చౌక్ వద్దకు ప్రదర్శన చేరగానే పోలీసులు అడ్డుకున్నారు. సీపీఐ నాయకులందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విడుదల చేశారు. రైతులను కిరాతంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని రాజా వ్యాఖ్యానించారు. ప్రదర్శనలో రాజా, సీపీఐ జాతీయ సమితి సభ్యులతోపాటు ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్, ఎంపీ బినయ్ విశ్వం, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, సీపీఐ కార్యదర్శులు కె.నారాయణ, డా.బాలచంద్ర కాంగో, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అనీరాజా, సీపీఐ యూపీ కార్యదర్శి గిరీశ్ శర్మ, దిల్లీ కార్యదర్శి దినేశ్ వర్షిణీ పాల్గొన్నారు.