. ఐదేళ్ల తర్వాత మళ్లీ రాజధాని పనులు
. ఇదొక స్వయం సమృద్ధి ప్రాజెక్టు
. సంక్షేమ కార్యక్రమాలకు గని లాంటిది
. కర్నూలులో హైకోర్టు బెంచ్, ఆర్థిక రాజధానిగా విశాఖ
. సీఆర్డీఏ కార్యాలయ పనులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఐదు సంవత్సరాల తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు మళ్లీ పున: ప్రారంభమయ్యాయి. రాయపూడిలో రూ.160 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీఆర్డీఏ ఏడంతస్తుల భవనాల నిర్మాణ పనులను శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు అవుతాయని, అంతడబ్బు తమవద్ద లేదంటూ గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఐదేళ్లపాటు కాలయాపన చేశారని తెలిపారు. అప్పటివరకు శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులను అర్థాంతరంగా నిలిపివేశారని అన్నారు. అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని, దీనికి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పినా వారు వినిపించుకోలేదు. కావాలని అమరావతిని విధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కానీ రాజధానికి వేసిన పునాది గొప్పది కావడంతో దీనిని ఏమీ చేయలేకపోయారని అన్నారు. గతంలో హైదరాబాద్లో కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టలేదు. భూమి, నీరు ఇచ్చాం. దీంతో అక్కడ సంపద సృష్టి జరిగింది. ప్రభుత్వ డబ్బు అవసరం లేకుండా అమరావతిని అభివృద్ధి చేస్తాం. ఉపాధికి కేంద్రంగా మారుస్తాం. పేద ప్రజలకు భవిష్యత్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి అమరావతి గని లాంటిది. అలాంటి అమరావతిని పట్టుకుని స్మశానం, ఎడారి, మునిగిపోతుందని దుష్ప్రచారం చేశారు. చెన్నై, హైదరాబాద్కు కూడా నీళ్లొచ్చాయి. జగన్ కట్టుకున్న యలహంక ప్యాలెస్లోకి సైతం నీళ్లు వచ్చాయి. ఒకరు చెడిపోవాలని కోరుకుంటే భగవంతుడు కూడా క్షమించడు. అమరావతికి ఎంతో పవిత్రత ఉంది. ఇది దేవతల రాజధాని. అమరావతికి విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు వచ్చాయి. ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ కూడా వస్తుంది. లా స్కూలు కూడా ఏర్పాటవుతుంది. దేశంలో టాప్-10 విద్యాసంస్థల బ్రాంచ్లు ఇక్కడికి రావాలి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతి మీదుగా బుల్లెట్ రైలు కావాలని కేంద్రాన్ని అడిగా. అమరావతికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. అమరావతిలో నిర్మాణ పనులు జెడ్ స్పీడ్గా సాగేలా, గ్రీన్ ఎనర్జీ మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటాం.
రూ.52 వేల కోట్లతో పనులు
అమరావతి రాష్ట్ర రాజధాని అని రాష్ట్రంలో ప్రతిచోటా చెప్పానని, విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని కూడా చెప్పానని, అమరావతే రాజధాని అని విశాఖ, కర్నూలు వాసులతో ఒప్పించానని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తాం. అమరావతిలో ఈవీ స్టేషన్లు, వాకింగ్ ట్రాక్, సైకిలింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తాం. రాజధానిలో తలపెట్టిన పనులన్నీ మూడేళ్లలో పూర్తి కావాలి. ప్రజలు గెలవాలి. 1631 రోజుల పాటు రాజధానిని కాపాడుకోవడం కోసం రైతులు ఉద్యమం చేశారు. విధ్వంసం పోయింది… నిర్మాణం ప్రారంభమైంది. మనం చేసే మంచి పనులే శాశ్వతం. దేశ చరిత్రలో అమరావతి ఒక్కటే సుందరంగా ఉంటుంది. గత పాలకులు చేసిన విధ్వంసంతో నిలిచిన పనుల వల్ల రూ.7 వేల కోట్లు అదనంగా భారం పడుతోంది. రూ.52 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తాం. కేంద్రం రూ.15 వేల కోట్లు అందించేందుకు ముందుకొచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆల్ ఇండియా అధికారులు, న్యాయమూర్తుల కోసం రెసిడెన్షియల్ టవర్స్ పూర్తి చేస్తాం. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేస్తాం. 8,603 కి.మీ సీఆర్డీయే, 217 చ.కిమీ పరిధిలో రాజధాని ఉంటుంది. 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ కేపిటల్ ఉంటుంది. ఇదంతా అభివృద్ధి చేసేందుకు అమరావతి ప్రాంతంలో 183 కి.మీ.తో ఓఆర్ఆర్ వస్తుంది. దేశంలో ఏపీ నంబర్ వన్గా ఉండాలన్నది నా కల. కష్టాలు చూసి పారిపోయేవాడిని కాదు. రాష్ట్రంలో అభివృద్ధిని పట్టాలెక్కిస్తున్నాం. ఇందులో భాగంగానే అమరావతిని ప్రారంభించాం. పోలవరం 72 శాతం పూర్తి చేస్తే… వాళ్లొచ్చాక డయాఫ్రం వాల్ దెబ్బతీశారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాం. రాష్ట్ర భవిష్యత్ కోసమే 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. గత ఐదేళ్లు ఏ రాక్షసుడు ఎప్పుడు వస్తాడో తెలియక ప్రజలు భయంతో బతికారు. కానీ ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా, ఆనందంగా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన గెలుపుతో రాష్ట్ర పరపతి పెరిగింది. అయితే రాష్ట్రం నుంచి భూతం పోయిందని ఏమరపాటుగా ఉండకుండా ఆ భూతాన్ని శాశ్వతంగా దూరం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రద్ముమ్న, లక్ష్మీపార్థసారధి తదితరులు పాల్గొన్నారు.