కాంగ్రెస్పై ఇండియా మిత్రపక్షాల మండిపాటు
న్యూదిల్లీ : ముందస్తు విశ్లేషణలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటల్లో కాంగ్రెస్ గెలుపు దిశగా వెళుతున్నట్లు కనిపించినా… తర్వాత బీజేపీ పుంజుకుంది. కాగా, హర్యానా ఫలితాలు వెలువడటంతో ఇండియా ఐక్య సంఘటన పార్టీలు కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు గుప్పించాయి. అహంకారం, మితిమీరిన విశ్వాసంతోనే కాంగ్రెస్ ఓటమికి కారణమైందని మండిపడ్డాయి. ‘మేము గెలుస్తున్నామని భావిస్తే… ఏ ప్రాంతీయ పార్టీని చేర్చుకోము. కానీ మా పరిస్థితి బాగా లేని రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలు సహకరించాలి. అహంకారం, ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూడటం ఈ విపత్తుకు మూలం.. తెలుసుకోండి’ అంటూ ఇండియా పార్టీలు హితవు పలికాయి. తృణమూల్ కాంగ్రెస్, ఆప్, శివసేన(ఉద్ధవ్), వామపక్షాలు సైతం కాంగ్రెస్ తీరును ఎండగట్టాయి. హర్యానాలో గెలుస్తామన్న ధీమాతో ఇతర ప్రాంతీయ పార్టీలతో కనీసం సంప్రదించలేదని తృణమూల్ నేత సాకేత్ గోఖలే పేర్కొన్నారు. తాము సూచించిన విషయాల గురించి పట్టించుకొని ఉంటే… పరిస్థితి వేరేలా ఉండేదని ఆప్ నేత రాఘవ్ చద్దా అన్నారు. ఆప్ను కాదన్నందుకు ఇప్పుడు కాంగ్రెస్ తీవ్రంగా చింతిస్తున్నదని పేర్కొన్నారు. కలిసి నడిస్తే పరిస్థితి మరోలా ఉండేదని రాఘవ్ చద్ధా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎంత తీవ్రంగా వీచినా…మరోసారి విజయం దక్కించుకున్నందుకు బీజేపీకి శివసేన(ఉద్ధవ్) పార్టీ నేత ప్రియాంక చతుర్వేది అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాల గురించి పునరాలోచించుకోవాలని, ఎక్కడైతే బీజేపీతో ప్రత్యక్ష పోరు ఉంటుందో… అక్కడ కాంగ్రెస్ బలహీనపడుతోందని ఆమె తెలిపారు. ‘హర్యానాలో ఇండియా ఐక్యసంఘటన లేదు. కాంగ్రెస్ నేతలు అతివిశ్వాసంతో వ్యవహరించారు. సమాజ్వాదీ పార్టీ లేక ఆప్తో కలిసివెళ్లి ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవి. గతంలో మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లోనూ బీజేపీ అధికారంలోకి రాదని విశ్లేషణలు వినిపించాయి. కానీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత గందరగోళం బీజేపీకి లాభించింది’ అని శివసేన(యూబీటీ) పార్టీ పత్రిక సామ్నా తీవ్రంగా స్పందించింది. హర్యానాలో ఇండియా ఐక్యసంఘటన పార్టీలైన కాంగ్రెస్, ఆప్ ఒంటరిగా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.