కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.7,211 కోట్ల నిధులు
పోలవరానికి రూ.2,800 కోట్లకు గ్రీన్సిగ్నల్
సీఎం దిల్లీ పర్యటనతో కదలిక
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా కింద రూ.7,211 కోట్లు విడుదల చేసింది. దీంతో లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి కాస్త ఊరట కానుంది. ఇప్పటికే భారీ వర్షాలు, వరద నష్టం సాయం కింద కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు విడుదలయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఓ వైపు చంద్రబాబు, మరోవైపు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణాలనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా అన్ని విధాలా కేంద్రంపై ఒత్తిడి పెంచడంతో రాష్ట్రానికి ఎంతోకొంత మేర నిధులు విడులవుతున్నాయి. కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధానికి రూ.15 వేల కోట్ల రుణ సాయం ప్రకటించడం వెసులుబాటు కల్పించింది. సీఎం చంద్రబాబు రెండు రోజులపాటు దిల్లీలో పర్యటించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికా రావాల్సిన సాయంపై విజ్ఞప్తులు చేశారు. పోలవరానికి రూ.2,800 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందించింది.
ఇదే ప్రాజెక్టుకు చెందిన పాత బిల్లుల రీయింబర్స్మెంట్ కింద రూ.800 కోట్ల విడుదలకు అంగీకరించింది. అడ్వాన్స్గా పనులు చేపట్టేందుకుగాను రూ.రెండు వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు రూ.30,436 కోట్లతో కొత్త డీపీఆర్కు ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుకుగా కేంద్రం ప్రకటించింది. అప్పటి నుంచి దీని పనులు వేగవంతం కావడం లేదు. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరానికి పనులు నిర్వహించగా…ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ రివర్స్ టెండర్ పేరుతో పనులకు ఆటంకం కలిగించిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు కేంద్రంలోను, రాష్ట్రంలోను ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో… పోలవరంతోపాటు రాష్ట్రాభివృద్ధికి నిధుల విడుదలకు మార్గం ఏర్పడిరది. పన్నుల వాటాల కింద ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన రూ.7,211 కోట్లతో కొంత ఊరట కలిగింది. కేంద్రంలో పన్నుల వాటాల కింద అన్ని రాష్ట్రాలకు రూ.1,78,173 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 2024లో చెల్లించాల్సిన సాధారణ వాయిదాకు అదనంగా ఒక ముందస్తు వాయిదా విడుదల చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాలు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడానికి అనుగుణంగా పన్నుల వాటా విడుదల చేసింది. ఇందులో ఏపీకి రూ. 7,211 కోట్లు, తెలంగాణకు రూ.3,745 కోట్ల నిధులు విడుదలయ్యాయి.