న్యూదిల్లీ : దేశ రాజధాని దిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎదుట తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, నేతలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తకు దారితీసింది. కేంద్రంలోని మోదీ సర్కారు తమ పార్టీ నాయకులపై కక్ష గట్టి నాలుగు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంపై తృణమూల్ ఎంపీలు ఎన్నికల కమిషనర్లను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు ప్రధాన కార్యాలయం వద్ద 24 గంటల ధర్నాకు దిగారు. 24 గంటల ధర్నాకు దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఐటీ, ఎన్ఐఏ, ఈడీ డైరెక్టర్లను మార్చాలని డిమాండ్ చేశారు. అయితే సుమారు గంటసేపు ధర్నా కొనసాగిన తర్వాత పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. తమ అరెస్టును తృణమూల్ ఎంపీలు ప్రతిఘటించడంతో పోలీసులు బలవంతంగా వారిని ఎత్తి పట్టుకుని బస్సులోకి ఎక్కించారు. ఈ క్రమంలో పోలీస్ బలగాలు, ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల ముందు నాలుగు కేంద్ర దర్యాప్తు సంస్థల అధిపతులను ఎన్నికల కమిషన్ తొలగించాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్లను కలిసిన టీఎంసీ ఎంపీల బృందానికి రాజ్యసభ లో పార్టీ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ నాయకత్వం వహించారు. ధర్నాలో పాల్గొన్న ఎంపీలలో డోలా సేన్, సాగరిక ఘోష్, సాకేత్ గోఖలే, శంతను సేన్ తదితరులు ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అధికార బీజేపీ ఆదేశాల మేరకు తమ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నాయని… అన్ని పార్టీలతో సమానంగా వ్యవహరిస్తూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు. 2022 నాటి కేసుకు సంబంధించి ఎన్ఐఏ 2024లో అరెస్టు చేస్తోందని డోలాసేన్ అన్నారు. శాంతిభద్రతలు అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశమని, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, ఐటీ ఏజెన్సీల చీఫ్లను కచ్చితంగా మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు. అలాగే, దిల్లీకి బయల్దేరే ముందు కోల్కతా విమానాశ్రయం వద్ద డోలా సేన్ మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలు కేంద్రంలో భాజపా ఆదేశాలమేరకు పనిచేస్తూ విపక్ష పార్టీలను లక్ష్యంగా చేసుకొని వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్ర సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందన్నారు.
ఎన్ఐఏ, ఈడీ, సీబీఐ తృణమూల్ కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ పనిచేయడం సిగ్గు చేటన్నారు. రెండేళ్ల క్రితం నాటి ఓ పేలుడు కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోల్కతాకు తరలిస్తున్న ఎన్ఐఏ అధికారుల వాహనంపై ఇటీవల భూపతినగర్లో స్థానికులు రాళ్ల దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఆత్మరక్షణ చర్యగా సీఎం మమతా సమర్థించారు కూడా.