కేంద్రానికి రామకృష్ణ డిమాండ్
విశాలాంధ్ర -విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్గా మార్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ కారణాలతో అభివృద్ధికి నోచుకోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15 వేల కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనటాన్ని ఆక్షేపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న రూ.15 వేల కోట్లు గ్రాంట్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రం అప్పులకుప్పగా మారిందని, ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ద్వారా రుణభారం మోపటం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందనగా ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు. రుణాలు ఇప్పిస్తామనటాన్ని రాష్ట్ర ప్రజలు సమర్థించబోరని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నిర్వాసితులకు పరిహారంపై కేంద్రం స్పష్టత ఇవ్వకపోవటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. నిర్వాసితులకు కేంద్రమే రూ.30 వేల కోట్లు గ్రాంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపటం దుర్మార్గమన్నారు. మోదీ ప్రభుత్వం పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యత కేంద్రం తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.