నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ ఘన విజయం
హర్యానాను దక్కించుకున్న బీజేపీ
వరుసగా మూడోసారి గెలుపు
కమలనాధులను కట్టడి చేయని హస్తం
జమ్మూకశ్మీరు ‘ఇండియా’ చేతికి చిక్కింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. గెలుపే లక్ష్యంగా కుతంత్రాలు పన్నిన బీజేపీకి చావుదెబ్బ తగిలింది. ప్రజాభీష్టానికి విరుద్ధంగా ఆర్టికల్ 370ని రద్దు చేసిన బీజేపీపై జమ్మూకశ్మీరు ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. నిర్బంధాలు, అణచివేతల నుంచి విముక్తి కోసం నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టి… ప్రజాస్వామ్యాన్ని బతికించుకున్నారు. మరోవైపు హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ విజయం సాధించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. మొదటి నుంచీ గెలుపుపై విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్… ఓటమితో కంగుతిన్నది. అంతర్గత కుమ్ములాటలతోనే కాంగ్రెస్ ఓటమి చెందినట్లు భావిస్తున్నారు. అదేసమయంలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపించింది. హర్యానాలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని తీవ్రంగా విమర్శించింది. హర్యానా ఫలితాలను అంగీకరించబోమని తెలిపింది. హర్యానాలో కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ ఖాతా తెరవలేదు. అయితే, జమ్మూకశ్మీరులో ఒక సీటు గెలుచుకుంది. జమ్మూకశ్మీరు తదుపరి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అని ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించగా…పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమి పాలయ్యారు. హర్యానాలో సీఎం సైనీ, మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్, అత్యంత సంపన్న మహిళ సావిత్రీ జిందాల్ గెలుపొందారు. ఐఎన్ఎల్డీ నేత అభయ్ చౌతాలా, జేజేపీ నేత దుష్యంత్ చౌతాలా ఓటమి మూటగట్టుకున్నారు.మరోవైపు, జమ్మూకశ్మీరు పాలనలో జోక్యం చేసుకోవద్దని మోదీ సర్కారుకు మెహబూబా ముఫ్తీ విన్నవించారు. హర్యానాలో తమకు విజయం చేకూర్చిన ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు.