. మద్యం ప్రియుల ఉత్సాహంపై నీళ్లు చల్లిన కొత్త పాలసీ
. గతానికీి ఇప్పటికీ రేట్లలో తేడా లేదని మందుబాబుల నిట్టూర్పు
. నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చిన కొత్త షాపులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మద్యం ప్రియులకు ముఖ్యమంత్రి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఊరువాడ తిరుగుతూ వివిధ వర్గాలకు హామీలు ఇస్తున్నట్లుగా మందుబాబులకు కూడా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి తెస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని చెబుతూ వచ్చారు. దీంతో కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్న మందు బాబులకు నిరాశే మిగిలింది. నూతన ఎక్సైజ్ పాలసీ కోసం మంత్రుల బృందం వివిధ రాష్ట్రాల్లో పర్యటించి వచ్చింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు, మద్యం ధరలను కూడా అధ్యయనం చేసింది. వీటన్నింటినీ పరిశీలించి మెరుగైన పాలసీ తీసుకొస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రైవేటు దుకాణాల ఏర్పాటునకు ధరఖాస్తులు స్వీకరించింది. కేవలం టెండర్ రుసుము ద్వారానే ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ఈ నెల 16వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ప్రైవేటు షాపులు అందుబాటులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో లేని విధంగా జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ, ధరల విషయంలో మాత్రం గత వైసీపీ సర్కార్లోని రేట్లకు ప్రస్తుత రేట్లకు పెద్దగా తేడా లేదని మందుబాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తక్కువ ధరలో లిక్కర్ క్వార్టర్ రూ.130, రూ.150 రకాలు అందుబాటులో ఉండగా, ఇప్పుడూ అదే రేట్లతో వేరే బ్రాండ్ మద్యం బాటిళ్లను ప్రైవేటు మద్యం షాపుల వారు విక్రయిస్తున్నారు. రూ.99 లకే క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి వస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది కానీ ఆ ధరతో మద్యం ఎక్కడా లభ్యం కావడం రాలేదు. దీంతో పేద వర్గాలకు చెందిన మందుబాబులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కావాల్సిన బ్రాండ్లు లభిస్తుండటంపై మరి కొందరు సంతోషిస్తున్నారు. విస్కీ బ్రాండ్లలో క్వార్టర్ 180 ఎంఎల్ ప్రారంభ ధర రూ.130లు ఉండగా, బ్రాందీలో క్వార్టర్ 180 ఎంఎల్ రూ.120ల నుండి నుంచి లభిస్తున్నాయి. రమ్లో తక్కువ ధరలో క్వార్టర్ రూ.230లు ఉండగా, ఓడ్కా క్వార్టర్ ధర రూ.230లు నిర్ణయించారు. బీర్ల విషయానికి వస్తే రూ.180ల నుంచి రూ.270 వరకూ నిర్ణయించారు. కొత్తగా ఏర్పాటైన షాపుల వద్ద మందుబాబులు రూ.99ల క్వార్టర్ బాటిళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని దుకాణదారులను ప్రశ్నిస్తున్నారు. దీనికి వారి నుండి సమాధానం లభించడం లేదు. మరో పక్క వైసీపీ ప్రభుత్వంలో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ప్రైవేటు మద్యం దుకాణాలు కావడంతో గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, నివాస ప్రాంతాల మధ్యకు వచ్చేశాయి. నివాస ప్రాంతాల్లోని రద్దీ ప్రదేశాల్లో మద్యం షాపులను ఏర్పాటు చేయడంపై కొన్ని ప్రాంతాల్లో మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
రూ.99 క్వార్టర్ మద్యం కేసులు వచ్చేశాయ్: నిషాంత్కుమార్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. మద్యం తయారీ, విక్రయాల్లో జాతీయ స్థాయిలో పేరున్న 5 సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఈ ధరకు మద్యం విక్ర యాలు చేసేందుకు సిద్ధం అయ్యాయన్నారు. గురువారం నాటికి పది వేల కేసుల రూ.99 మద్యం మార్కెట్కు చేరిందని, సోమవారానికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుందని వివరించారు. దశల వారీగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల చౌక మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ క్రమంలో మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మధ్యం ఈ నెలలో అందుబాటులోకి రానుందన్నారు. వినియోగాన్ని అనుసరించి తదుపరి నెలలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని నిషాంత్ కుమార్ వివరించారు.