. మంత్రుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం
. అక్రమాలు జరిగితే సహించనని హెచ్చరిక
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉచిత ఇసుక విధానంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం మంత్రి మండలి సమావేశం అనంతరం మంత్రులతో ఆయన కీలక భేటీ నిర్వహించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినా ఇసుక పొందడంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశాలు… మంత్రుల తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక లక్ష్యం నెరవేరాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఉచిత ఇసుక పొందడంలో ఇబ్బందులతో పాటు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారని, కొందరు దళారుల ప్రమేయంతో సామాన్యులకు అందడం లేదని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఇసుక సామాన్యులకు భారంగా మారకూడదని, వెంటనే మార్పులు రావాలని సీఎం ఆదేశించారు. ఈ విధానంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని, వెంటనే మార్పు రావాలన్నారు. పది రోజుల్లో మార్పు కనిపించాలని, నిజమైన లబ్ధిదారుడికి ఉచిత ఇసుక పథకంతో ప్రయోజనం కలగాలన్నారు. ఏ స్థాయిలో తప్పు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని అడ్డంకులు తొలగించి సామాన్య ప్రజలకు ఉచిత ఇసుక అందించి తీరాలని సీఎం నొక్కిచెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక రీచ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ప్రతిపాదనకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. అదనంగా ప్రైవేటు రీచ్లనూ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రజలకు అవసరమైన ఇసుక, వారికి ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇసుక రీచ్లు గనుల శాఖ నియంత్రణలో ఉన్నాయి. వర్షాకాలం రీచ్ల్లో తవ్వకాలు చేపట్టడం లేదు. త్వరలో తవ్వకాలు ప్రారంభించినప్పటికీ డిమాండ్కు సరిపడేంత ఇసుక అందుబాటులోకి రాదనే ఉద్దేశంతో ప్రైవేటు రీచ్ల ప్రతిపాదన తెస్తున్నట్లు గనులశాఖ అధికారులు వివరించారు. ఇసుక సరఫరా ధరను జిల్లా ఇసుక కమిటీలే నిర్ణయించేలా చర్యలు తీసుకోవాలని, అక్రమాలకు తావులేకుండా చూసుకోవాలని, నిరంతర నిఘా, పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇసుక తవ్వుకు వెళ్తే రుసుములు వసూలు చేయవద్దని, ఇసుక అక్రమాలు జరగకుండా ఇన్చార్జి మంత్రులు బాధ్యత వహించాలని ఆదేశించారు. ఆంక్షల పేరుతో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.