చేతివృత్తిదారుల రాష్ట్రవ్యాప్త ఆందోళన
విశాలాంధ్ర బ్యూరో` కర్నూలు : ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలను విస్మరించి చేతి వృత్తిదారుల ఉపాధిని దెబ్బతీసేవిధంగా అమలు చేస్తున్న విధానాలను తక్షణమే ఉపసంహరించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ధర్నాలు జరిగాయి. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నగర కన్వీనర్ డి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ధర్నా నుద్దేశించి సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కె.రామాంజనేయులు మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చేతి వృత్తి దారులను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి,ఉపాధి కోల్పోయే విధానాలను కేంద్ర, రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్నారని విమర్శించారు. తరతరాలుగా మత్స్యకారులు చెరువుల్లో చేపలు పట్టుకొని జీవించే ఉపాధిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం జీఓ నంబరు124, రాష్ట్ర ప్రభుత్వం జీఓ నం 137ను తీసుకుని వచ్చి అమలు చేసేందుకు సిద్ధమయ్యారని దీని వల్ల డబ్బున్న వారు దోచుకునేందుకు సహకరిస్తున్నారన్నారు. టీటీడీలోి బట్టలు ఉతికే కాంట్రాక్టును రజక వృత్తిదారులకు ఇవ్వకుండా, కళ్యాణ కట్టలో క్షౌర వృత్తి దారులకు నామ మాత్రపు జీతాలు ఇచ్చి పొట్టకొడుతున్నారని విమర్శించారు.అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ లో ఏఓకు మెమోరాండం అందచేశారు. ఈ కార్యక్రమంలో డీహిెచ్పీిఎస్ జిల్లా కార్యదర్శి సి.మహేశ్, సీపీఐ ఓర్వకల్ మండలం కార్యదర్శి ఏ. రమేశ్, రోళ్ల కార్మిక సంఘం నాయకులు పాపన్న, భీముడు పాల్గొన్నారు.