. ముఖ్య నేతలతో జగన్ భేటీ
. ఎంపీ, ఎమ్మెల్యేల హాజరు
. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంపై వైసీపీ ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య(నాని), శ్రీకొడాలి వెంకటేశ్వరరావు(నాని) తదితరులు గురువారం భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషించుకున్నారు. పార్టీ కీలక నేతలతోపాటు గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్తో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు జగన్ను కలిశారు. ఇంత ఘోర ఓటమి ఎందుకు వచ్చింది?, ఫలితాల్లో ప్రత్యర్థి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు భారీగా సీట్లు, మెజార్టీలు ఎలా వచ్చాయన్న దానిపై ఆరా తీవారు. అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితం కావడానికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణపైనా చర్చించారు. దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ క్రమేపీ పెరుగుతూ వస్తున్నది. కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులతో వైసీపీ ప్రస్థానం ప్రారంభించింది. కాంగ్రెస్ను విభేదించి జగన్తోపాటు వచ్చిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం, ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లోనూ వైసీపీ అధిక సీట్లు కైవసం చేసుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 67 ఎమ్మెల్యే సీట్లు, 9 ఎంపీ స్థానాలు గెలుపొందింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు గెలిచింది. 2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకే వైసీపీ పరిమితమైంది. ఇంత దారుణమైన ఫలితాలు రావడం వైసీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఎక్కడో తప్పిదం జరిగిందని అనుమానిస్తున్నారు. పార్టీ పరంగానా లేక ఈవీఎంల సాంకేతిక లోపంగానా అనేది తేల్చుకోలేకపోతున్నారు. వైసీపీ ఓటమిపై నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే కొందరు మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, జక్కంపూడి రాజా మీడియా ముందుకు వచ్చి…ఈవీఎంల తప్పిదంతోనే ఓటమి పాలైనట్లు చెబుతున్నారు. తాజాగా విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు పోతిన మహేశ్ కూడా ఈవీఎంల అంశాన్ని ప్రస్తావించారు. ల్యాండ్ టైటిల్ యాక్టుపై దుష్ప్రచారం, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయ లోపం, ఎన్నికల నిర్వహణలో వెనుకబాటుకు గురికావడం కారణాలుగా మరికొంతమంది భావిస్తున్నారు. జగన్తో జరిగిన భేటీలోను పార్టీ ఓటమిపై అనేక అంశాలను ధ్రువీకరించినట్లు సమాచారం. వైసీపీకి ప్రతిపక్ష హోదా లేనందున… పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న అంశంపై స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. సమావేశానికి వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ నేతలు శివప్రసాద్రెడ్డి, దేవినేని అవినాశ్, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఓట్ల లెక్కింపు అనంతరం వైసీపీ కార్యకర్తలు, వారి ఇళ్లపై టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న దాడులపై గవర్నరుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కాగా, తాడేపల్లిలో కొనసాగుతున్న పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలోకి మార్చాలని నేతలు నిర్ణయించారు.