. ఆదుకున్న దక్షిణాది
. సుపాలన, అభివృద్ధిపై దృష్టి పెడతాం
. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మోదీ
. లోక్సభా పక్ష నేతగా ఎన్నిక
. రేపు ప్రధానిగా ప్రమాణస్వీకారం
న్యూదిల్లీ: ఎన్డీఏ 3.0 ప్రభుత్వంలో తీసుకునే అన్ని నిర్ణయాల్లో ఏకాభిప్రాయం ఉండేలా కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాబోయే పదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో సుపరిపాలన, అభివృద్ధి, నాణ్యమైన జీవితం అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. పౌరుల జీవితాల్లో జోక్యాన్ని తక్కువ చేస్తామన్నారు. దేశ చరిత్రలో ఎన్డీఏనే అత్యంత విజయవంతమైన కూటమి అని మోదీ చెప్పుకున్నారు. ఎన్డీఏ విజయవంతంగా మూడు పర్యాయాలు పూర్తి చేసుకుని నాలుగో పర్యాయంలోకి అడుగుపెడుతుందని తెలిపారు. ఎన్డీఏ … నేషన్ ఫస్ట్ అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉందని అన్నారు. దిల్లీలోని పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో శుక్రవారం జరిగిన ఎన్డీఏ పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యానించారు. తొలుత లోక్సభా పక్ష నేతగా మోదీని ఎన్డీయే నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ పేరును రాజ్నాథ్సింగ్ ప్రతిపాదించగా చంద్రబాబు, నితీశ్కుమార్, అమిత్షా, పవన్ కల్యాణ్ తదితరులు బలపరిచారు. అనంతరం మోదీ మాట్లాడుతూ మిత్రపక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ అంటే అంటే ‘న్యూ ఇండియా, డెవలప్డ్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా’ అని కొత్త అర్థం చెప్పారు. ఇక దక్షిణాది రాష్ట్రాలు ఎన్డీఏను ఆదరించాయని మోదీ చెప్పారు. ‘దక్షిణాది ప్రజలు ఎన్డీయేను ఆదరించారు. కర్నాటక, తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయి. లోక్సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి అండగా నిలిచారు. తమిళనాడులో సీట్లు గెలవలేకపోయినా ఓట్లు పెరిగాయి. కేరళలోనూ మా కార్యకర్తలు ఎన్నో బలిదానాలు చేశారు. తొలిసారి అక్కడి నుంచి మా ప్రతినిధి సభలో అడుగుపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, సిక్కింలో క్లీన్స్వీప్ చేశాం. ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. చంద్రబాబుతో కలిసి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నాం. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టింది’ అని మోదీ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ప్రశంసిస్తూ… పవన్ అంటే పవనం కాదు… తుపాను అన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించినప్పటికీ విపక్షాలు మన విజయాన్ని తిరస్కరించేందుకు ప్రయత్నించాయన్నారు. ఎన్నికల ముందు ఈవీఎంలను కొందరు సందేహించారని, ఫలితాల తర్వాత అవన్నీ పటాపంచలైనట్లు చెప్పారు. ఇకనైనా విపక్షాలు పార్లమెంట్కు వచ్చి చర్చల్లో పాల్గొంటాయని భావిస్తున్నానన్నారు.
మరో పదేళ్లయినా కాంగ్రెస్ 100 దాటదు
కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తూ… కాంగ్రెస్ చాలా వేగంగా పతనమవుతోందని, మరో పదేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. ఇప్పటికీ తన శక్తి సామర్థ్యాలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. కాంగ్రెస్ హయాంలో వారి సొంత ప్రధానినే అవమానించారు. ఆయన నిర్ణయాలను లెక్క చేయలేదు. గత మూడు ఎన్నికల్లో వారికొచ్చిన స్థానాలు… ఈ ఒక్క ఎన్నికల్లో మేం సాధించిన సీట్ల కంటే తక్కువే. మరో పదేళ్లయినా ఆ పార్టీ 100 స్థానాల మార్క్ దాటలేదని మోదీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
రేపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం
భారత ప్రధానిగా వరుసగా మూడోసారి జూన్ 9వ తేదీ సాయంత్రం నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని తెలిపారు. సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నాయకులైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాస్వాన్, హిందూస్థానీ అవామీ మోర్చా అధ్యక్షుడు జితన్ రామ్ మాంరీa, అనుప్రియ పటేల్తోపాటు ఎన్డీయే పక్షాల ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రధాని మోదీని ఎన్డీఏ లోక్సభా పక్షనేతగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను బీజేపీ నేతలు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి తదితరులు బలపరిచారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎన్డీఏ కూటమిలోని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశాయి. మోదీ నాయకత్వాన్ని, ఎన్డీఏ గత పదేళ్ల పాలనను కీర్తిస్తూ ఎన్డీఏ పక్షాల నేతలు ప్రసంగాలు చేశారు. నూతన ప్రధానిగా మోదీకి సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ దేశానికి ప్రధాని కాలేదన్నారు. మోదీ దూరదృష్టిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారని పేర్కొన్నారు. పదేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వం దేశానికి సేవలందించిందని వెల్లడిరచారు. ప్రపంచ దేశాల నేతలు మోదీని ప్రశంసిస్తున్నారని, దేశానికి దశ దిశ నిర్దేశించడంలో మోదీ సఫలమయ్యారని తెలిపారు.
ఇటీవల విడుదలైన లోక్సభ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీఏ 293 సీట్లు సాధించింది. మెజారిటీ మార్కు 272 కంటే ఎక్కువ సీట్లు రావడం వల్ల కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వరుసగా మూడోసారి అధికారం చేపట్టనుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కు దాటలేకపోయింది. దీంతో మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో చకచకా పావులు కదిపి ఎన్డీఏ పక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.