. కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించండి
. ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతి
. అమిత్షా సహా వివిధ కేంద్రమంత్రులతో వరుస భేటీలు
. నేడు మరికొందరు మంత్రులతో సమావేశాలు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆర్థికంగా నష్టపోయి, అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈనెల చివరిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో శాఖల వారీ కేటాయింపుల లక్ష్యంతో బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి గురువారం బిజీబిజీగా గడిపారు. ఉదయం 10.15 గంటలకు ప్రధానితో భేటీ అయి రాష్ట్ర అవసరాలను వివరించారు. ఆర్థిక సాయం సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి సహకారాన్ని కోరారు. గత ప్రభుత్వ విధ్వంసకర చర్యలతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తికి తోడ్పాటును కోరారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన పోలవరం, అమరావతి ప్రాజెక్టుల నాశనం వల్ల ఏపీకి కోలుకోలేనంత నష్టం జరిగిందన్నారు. అనంతపురం-అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంతో పాటు కీలక రహదారులకు మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదలకు ఇళ్లు, జల్జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీటి సరఫరా వంటి ముఖ్యాంశాలపై ప్రధానికి విజ్ఞప్తులు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయిన పెండిరగ్లో ఉన్న విభజనాంశాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. విజయవాడలో నిడమానూరు ప్లైఓవర్ పొడిగింపుకు గడ్కరి హామీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో భేటీ సందర్భంగా అనంతపురం
అమరావతి ఎక్స్ప్రెస్ హైవే, విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు, రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ దగ్గర నుంచి నిడమానూరు వరకు ప్లైఓవర్ పొడిగింపు వంటి అంశాలను చంద్రబాబు చర్చించారు. తూర్పు బైపాస్, నిడమానూరు వరకు ప్లైఓవర్ పొడిగింపుకు కేంద్రం పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హరదీప్ సింగ్ పూరీ, మనోహర్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ డాక్టర్ అరవింద పనగారియా తదితరులతోనూ చంద్రబాబు భేటీ అయ్యారు.
ఆయా శాఖల సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. చంద్రబాబు శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా శీతారామన్తో పాటు మరికొందరు మంత్రులతో సమావేశం కానున్నారు. చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్రెడ్డి ఉన్నారు.