. స్వతంత్ర పోస్టుకు రాజకీయరంగు
. పెండిరగ్ పరీక్షల షెడ్యూలు జాప్యం
. అయోమయంలో నిరుద్యోగులు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఏపీపీఎస్సీ చైర్మన్, పాలక మండలి నియామకాల ప్రక్రియ మారిందన్న విమర్శలు హల్చల్ చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే... వారికి అనుకూలంగా ఉన్న వారిని నియమించుకోవడం పరిపాటిగా మారింది. ఎంతో కీలకమైన గ్రూప్
1, గ్రూప్`2, ముఖ్యమైన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలున్నాయి. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకంలో జాప్యం ఏర్పడిరది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలవుతున్నప్పటికీ… ఇంతవరకూ చైర్మన్ను నియమించలేదు. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. ఉద్యోగ నియామకాలపై ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జులైలో ఆయన రాజీనామా చేయడం, వెనువెంటనే ఆమోదించడం జరిగిపోయాయి. దీనివెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు ప్రచారం జరిగింది. గౌతమ్ సవాంగ్కు ఇంకా కాలపరిమితి ఉన్నప్పటికీ… ఉన్నపళంగా రాజీనామా చేయడంతో ఏపీపీఎస్సీ చైర్మన్ కుర్చీ ఖాళీ అయింది. ఈ పదవి కోసం ప్రభుత్వ పెద్దలతో భారీ లాబీయింగ్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం టీడీపీకి సన్నిహితంగా ఉన్న కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. కొంతమేరకు నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసింది. అందులో కీలకమైన ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రస్తావన లేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా…సమర్థులైన సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్తో ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం ఉండాలన్న డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ల నియామకాలు, వారి పరిపాలన తీరు రాజకీయ వివాదాలకు దారితీసింది. అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ…వారిపై రాజకీయ ఒత్తిళ్లు, సహకరించకపోవడం, పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వకపోవడం తదితర చర్యలకు పాల్పడిన సంఘటనలున్నాయి. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో పిన్నమనేని ఉదయ్భాస్కర్ను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించారు. అనంతరం ఏర్పడిన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన పదవిలో ఉన్నప్పటికీ…సరైన సహకారం అందించలేదని, కనీసం అటెండర్నూ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినట్లు ప్రచారం జోరందుకుంది. ఆయా అంశాలను ఆయనే స్వయంగా గవర్నరు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉదయ్ భాస్కర్ పదవి ముగిశాక ఇన్చార్జి చైర్మన్గా ఏవీ రమణారెడ్డిని నియమించారు. ఆయన 2020 మార్చి నాలుగో తేదీన ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత గౌతమ్ సవాంగ్కు చైర్మన్గా పూర్తి బాధ్యతలను అప్పగించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గౌతమ్ సవాంగ్ పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేయడం వివాదస్పదంగా మారింది. దీంతో గవర్నర్ పరిధిలో ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకాలు…కేవలం అలంకార ప్రాయంగానే మారాయన్న విమర్శలున్నాయి.
నిలిచిపోయిన నోటిఫికేషన్లు
ఇంతవరకు ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు నిలిచిపోయాయి. నియామకాల ప్రక్రియకు పూర్తిగా ఆటంకం కలగడంతో నిరుద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లకు పరీక్షల షెడ్యూలు ప్రకటించలేదు. రాజ్యాంగబద్ధమైన సంస్థకు నాలుగు నెలలపాటు చైర్మన్ లేకపోవడంపై యువజన, నిరుద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన గ్రూప్`1, గ్రూప్-2 తదితర పరీక్షలను చంద్రబాబు ప్రభుత్వం వాయిదా వేసింది. వాటిని ఎప్పుడు నిర్వహిస్తారనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ఏపీపీఎస్సీ పరిధిలో 21 రకాల పరీక్షలు పెండిరగ్లో ఉన్నట్లు సమాచారం. లక్షలాది మంది నిరుద్యోగులు శిక్షణ పొందుతూ, నోటిఫికేషన్ల కోసం వేచిస్తున్నారు. ఇప్పటికే వాయిదా వేసిన పరీక్షలతోపాటు విడుదలైన నోటిఫికేషన్లకూ షెడ్యూలు ఇవ్వాల్సి ఉంది. జాబ్ క్యాలెండరులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉండి, ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోయే అన్ని ఉద్యోగాలకు ప్రకటనలు జారీజేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్గా సమర్థుడైన అధికారిని నియమించాలని కోరుతున్నారు.