కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ తాజాగా హెచ్చరించింది.ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనమ్ మాట్లాడుతూ, కరోనా వైరస్ ఎంత సుదీర్ఘంగా ప్రబలితే దాని ప్రభావం కూడా అంతే స్థాయిలో ఉంటుందని అన్నారు. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఆ మహమ్మారి మిగిల్చిన చేదు అనుభవాలను ప్రపంచ దేశాలు కొన్ని దశాబ్దాలపాటు మర్చిపోలేవని పేర్కొన్నారు. వైైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉండే గ్రూపుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి ఉన్నంతకాలం చేదు అనుభవాలు వెంటాడే అవకాశాలు ఉంటాయని హెచ్చరించారు.ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ అసమానతల గురించి డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకా పొందగలిగారని.. ఇంకా సగానికిపైగా టీకా తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23శాతం మాత్రమే ఉందన్నారు. టీకా పంపిణీలో వ్యత్యాసం చాలా ఉందని.. దీనిని పూడ్చి అందరికీ వ్యాక్సిన్ అందించడమే తమ సంస్థ తక్షణ కర్తవ్యం అని పేర్కొన్నారు.