. కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ డిమాండ్
. నీటి వాటాలపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమన్న ఏపీ
. నీటి నిర్వహణ అవుట్లెట్స్ కేఆర్ఎంబీకి అప్పగింత
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కృష్ణా జలాల్లో 50 శాతం నీటి వాటా కేటాయించాల్సిందేనని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలతో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. కొంతకాలంగా తెలంగాణ చేస్తున్న 50 శాతం నీటి వాటా డిమాండ్ను మరోసారి ఈఎన్సీ పునరుద్ఘాటించారు. నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించినందున దానిపై సమావేశంలో ప్రస్తావన అనవసరమని, ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించడానికి దిల్లీ వేదిక ఉందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డు పరిధిలోని ప్రాజెక్టుల ఆపరేషన్కు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి. సమావేశం అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్లో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్వి ఉన్నాయని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. ‘ఆపరేషన్ కోసం రెండు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుంది. నీటి కేటాయింపులపై మాత్రం త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటుంది. లెఫ్ట్మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీ, మార్చిలో రైట్మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారు. ఏప్రిల్లో ఐదు టీఎంసీలు ఏపీకి ముందుగానే ఉన్నాయి. ప్రాజెక్టుల ఆపరేషన్ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి వెల్లడిరచారు. మురళీధర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీకి ఇచ్చామని, విద్యుత్ కేంద్రాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జునసాగర్ను తెలంగాణ, శ్రీశైలంను ఏపీ చూసుకుంటుంది. ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయి. మా డిమాండ్లు అన్నింటిపై కేంద్రానికి లేఖలు రాశాం. ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుంది. కేఆర్ఎంబీ పరిధిలో ఉన్న 15 అవుట్లెట్స్ బోర్డు పరిధిలోకి వెళతాయి. ప్రాజెక్టులను పూర్తిగా కేఆర్ఎంబీకి అప్పగించలేదు. ఆపరేషనల్, నీటి విడుదల మాత్రమే బోర్డు చూసుకుంటుంది. సీఆర్పీఎఫ్ సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటుంది. నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40:45 కావాలని అడుగుతున్నాం’ అని మురళీధర్ వెల్లడిరచారు.