. పట్టిసీమ నీటితో ప్రకాశం బ్యారేజీ ఫుల్
. చివరి భూములకూ నీరు అందిస్తాం
. మంత్రి నిమ్మల రామానాయుడు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కృష్ణా డెల్టాకు సాగు, తాగు నీటిని విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి చెందిన 17 పంపుల ద్వారా వారం రోజులుగా వస్తున్న 6,500 క్యూసెక్కుల నీటితో ప్రకాశం బ్యారేజీ నిండిరది. దీంతో బుధవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు, మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, ఎమ్మెల్సీ అశోక్బాబు, విజయవాడ సెంట్రల్, అవనిగడ్డ, పెడన, గన్నవరం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, మండలి బుద్ధ ప్రసాద్, కాగిత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకటరావు తదితరులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించి కృష్ణా తూర్పు డెల్టా హెడ్ రెగ్యులేటర్ వద్ద కాలువలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ సమర్థవంతమైన జల వనరుల నిర్వహణ ద్వారా పెద్ద ఎత్తున సంపద సృష్టించవచ్చని, తద్వారా సమాజంలోని అన్ని వర్గాలూ లాభపడటమే కాకుండా ఆయా ప్రాంతాలు, రాష్ట్రం సుభిక్షమవుతుందని తెలిపారు. ఉన్న ఆయకట్టును కాపాడుకుంటూ కొత్త ఆయకట్టు అభివృద్ధికి కృషి చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని, రైతులను అభివృద్ధి పథంలో నడిపించవచ్చన్నారు. ముఖ్యమంత్రి ఎంతో ముందుచూపుతో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారని, దానివల్లే నేడు గోదావరి జలాలు కృష్ణాకు చేరి దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 నుంచి 40 లక్షల మందికి తాగునీరు అందించేందుకు వీలవుతోందన్నారు. నిర్లక్ష్యానికి గురైన పట్టిసీమతో పాటు తాటిపూడి, పురుషోత్తపట్నం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పట్టిసీమ నుంచి 6,500 క్యూసెక్కుల వరకు నీరు విడుదలవుతోందని, మరో 500 నుంచి 600 క్యూసెక్కుల తాడిపూడి నీరు కూడా దీనికి తోడవుతోందని వివరించారు. ఈ నీటిని తొలి ప్రాధాన్యంగా తాగునీటికి, తర్వాత ఖరీఫ్ నారుమళ్లకు ఉపయోగించుకోవాలని సూచించారు. తూర్పు డెల్టాలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో 7,38,000 ఎకరాలకు సాగునీరుతో పాటు 11 నియోజకవర్గాల పరిధిలో చెరువులను నింపి ప్రజల దాహార్తిని తీర్చేందుకు వీలవుతుందన్నారు. డెల్టా కాలువలు, డ్రెయిన్లలో పూడిక, గుర్రపు డెక్క, తూటికాడ వల్ల నీరు సరిగా ప్రవహించడం లేదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా యుద్ధప్రాతిపదికన గుర్రపుడెక్క, తూడు తీసే పనులకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ సరైన నిర్వహణ లేక సాగునీటి రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. మరో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కృష్ణా డెల్టా ఆయకట్టుకు సంబంధించి చివరి ఎకరా వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సలహాదారులు ఎం.వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి, ఎస్ఈ టీజేహెచ్ ప్రసాద్బాబు, కేసీ డివిజన్ ఈఈ పీఆర్ కృష్ణారావు, సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.