. బెయిల్ మా పరిధిలో లేదన్న ఎన్ఐఏ కోర్టు
. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచన
. కేసు జాప్యాన్ని నిరసిస్తూ 11 నుంచి దీక్ష చేస్తానన్న శ్రీను
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: కోడికత్తి కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నాలుగు సంవత్సరాలుగా జైలులో మగ్గుతున్న నిందితుడు శ్రీనివాస్ బెయిల్పై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. బెయిల్ ఇవ్వాలని నిందితుడు శ్రీనివాసరావు మరోసారి కోర్టును అభ్యర్థించాడు. బెయిల్ అంశం తమ పరిధిలో లేదని ఎన్ఐఏ కోర్టు అతడికి స్పష్టం చేసింది. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. గతంలో శ్రీనివాసరావుకు ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన బెయిల్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు లిఖితపూర్వక వాదనలు దాఖలు చేయాలని సీఎం జగన్ తరపు న్యాయవాదిని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా కేసులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ జైల్లోనే దీక్ష చేపడతానని నిందితుడు శ్రీనివాసరావు చెప్పాడు. ఈనెల 11 నుంచి దీక్ష చేస్తానని తెలిపాడు.