. తాడేపల్లి రోడ్డులో ఆంక్షల తొలగింపు
. ఉండవల్లి నుంచి మంగళగిరికి రాకపోకలు
. మాజీ సీఎం నివాసం వద్ద ప్రైవేట్ సిబ్బంది
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్కు భద్రత కుదించినట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆయన సాధారణ భద్రతకే పరిమితం కానున్నారు. దీంతో ఆయనకు మాజీ సీఎం స్థాయి తరహాలోనే ఇక నుంచి భద్రత కొనసాగనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి జగన్ భద్రత కోసం ప్రైవేట్ సిబ్బంది రావ డంతో… ప్రస్తుతం ప్రభుత్వ పరంగా ఉన్న భద్రత కుదించినట్లుగా వస్తున్న ప్రచారానికి బలం చేకూ రుతోంది. మరోవైపు ఇంతకాలం తాడేపల్లిలోని జగన్ నివాసం మీదుగా ఉన్న రహదారిపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరికి జగన్ ఇంటి ముందుగా ఉన్న రహదారిపై పెద్దఎత్తున రాకపోకలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫలితాల వరకు సీఎం హోదాలో జగన్ ఉండగా… ఆయన ఇంటి ముందు నుంచి ఎలాంటి వాహ నాల రాకపోకలకు అవకాశం కల్పించలేదు. జగన్ నివాస ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించారు. సామాన్యులకు అనుమతివ్వలేదు. జగన్ నివాసం చుట్టూ భద్రతా సిబ్బందితో పహరా ఉండేది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్కడున్న రెడ్ జోన్ను తొలగించారు. జగన్ ఇంటి ముందున్న రోడ్డును సాధారణ ప్రజలు వినియోగానికి అవకాశం కల్పించారు. దీంతో అక్కడ సామాన్యుల తాకిడి పెరిగింది. జగన్కు భద్రత తొలగించారన్న వార్తలతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జగన్ 30 మందితో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు. ఏకరూప దుస్తుల్లో ఉన్న వారంతా సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. అనంతరం జగన్ నివాస పరిసర ప్రాంతాల చుట్టూ భద్రత ప్రైవేట్ ఏజెన్సీల సిబ్బంది ఆధీనంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం జగన్కు ప్రభుత్వం తరపున భద్రతా సిబ్బందితోపాటు ప్రైవేటీ ఏజెన్సీ తరపున వచ్చిన వారు ఉంటారు. గతంలో ఓదార్పు యాత్ర సమయంలో జగన్ ఇదే తరహాగా భారీగా వ్యక్తిగత భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు. 2019 మందు వరకు వారంతా కొనసాగారు. అనంతరం జగన్ అధికారంలోకి రావడంతో ప్రభుత్వ పరంగాను, సీఎం హోదాలో భద్రతను కల్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవ్వడం, కనీసం ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోకపోవడంతో జగన్ భద్రతను కుదించేశారు.