. ప్రభుత్వ ఏర్పాటుపై తేల్చని గవర్నర్
. అనిశ్చితిలో జేఎంఎం కూటమి
. హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యేలు
రాంచీ : జార్ఖండ్ రాజకీయం సంక్షోభంలో పడిరది. ముఖ్యమంత్రి లేక పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ నేతృత్వంలో జేఎంఎంఎంకాంగ్రెస్
ఆర్జేడీ కూటమి ఎమ్మెల్యేలు గురువారం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి రాజ్భవన్కు వెళ్లారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరారు. తనకు 43 మంది (జేఎంఎం నుంచి 29, కాంగ్రెస్ నుంచి 17 మంది, ఆర్జేడీ నుంచి ఒకరు) ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పారు. అవసరమైన సంఖ్యాబలం నిరూపించారు. దీనిపై త్వరలోనే నిర్ణయిస్తానని గవర్నర్ హామీనిచ్చారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుపై ఆహ్వానం అందకపోవడంతో రాష్ట్రంలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కూటమి ఎమ్మెల్యేలంతా చార్టెర్డ్ విమానాల్లో హైదరాబాద్కు చేరుకున్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఆతిథ్యం ఇచ్చింది. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్లో విపక్షంగా ఉన్న బీజేపీకి 32 మంది బలం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే బీజేపీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇందులో ముగ్గురు దాని మిత్రపక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీ (ఏజేఎస్యూ) వద్ద ఉన్నారు. అంటే కేవలం ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు లభిస్తే జార్ఖండ్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. దీంతో జేఎంఎం కూటమి ముందు జాగ్రత్తగా తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించి, ఆపరేషన్ కమలాన్ని అడ్డుకుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టింది. ఆయనను ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. అలాగే, తనపై నమోదు చేసిన అక్రమ కేసును కొట్టివేయాలని కోరుతూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది. జార్ఖండ్ పరిణామాలపై విపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ కక్ష సాధింపు చర్యలను తూర్పారబట్టాయి.