. శాసనసభాపక్ష నేతగా తిరిగి ఎన్నిక
. గవర్నర్కు రాజీనామా సమర్పించిన సీఎం చంపై సోరెన్
. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన జేఎంఎం నేత హేమంత్
రాంచీ : జార్ఖండ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. హేమంత్ సోరెన్ మరోసారి సీఎం పీఠాన్ని అధిష్ఠించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి పదవికి చంపై సోరెన్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాధాకృష్ణన్కు అందించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. అంతకుముందు చంపై సోరెన్ నివాసంలో సమావేశమైన జేఎంఎం సారథ్యంలోని కూటమి ఎమ్మెల్యేలంతా హేమంత్ సోరెన్ను సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో హేమంత్ కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు వీలుగా ప్రస్తుత సీఎం చంపై సోరెన్ తన రాజీనామాను గవర్నర్కు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ వద్ద చంపై సోరెన్ మాట్లాడుతూ జేఎంఎం కూటమి తీసుకున్న నిర్ణయం మేరకు రాజీనామా చేసినట్లు తెలిపారు. తమ కూటమి బలంగా ఉందన్నారు. ‘హేమంత్ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు నాకు బాధ్యతలు అప్పగించాయి. ఇప్పుడు కూటమి హేమంత్ సోరెన్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను హేమంత్ సోరెన్ కోరారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘సీఎం (చంపై సోరెన్) మీకు అన్నీ చెప్పారు. మీకు అన్నీ వివరంగా చెబుతాం. అన్ని విధానాలను అనుసరించాం’ అని తెలిపారు. ఐదు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన ఆయన తాను కుట్రకు గురైనట్లు చెప్పారు. ‘నన్ను తప్పుగా ఇరికించారు. నాపై కుట్ర పన్నారు. నేను ఐదు నెలలు జైలులో ఉండవలసి వచ్చింది. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయస్థానం తన ఉత్తర్వును జారీ చేసింది. నేను (బెయిల్పై) బయట ఉన్నాను. కానీ న్యాయ ప్రక్రియ సుదీర్ఘమైనది’ అని తెలిపారు. కాగా, చంపై సోరెన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. గురువారం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ పరిణామాన్ని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ధ్రువీకరించారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు ఐదు నెలల తర్వాత హేమంత్ సోరెన్ జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యారు. జనవరి 31న అరెస్టు కావడానికి ముందు ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.
హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేస్తే, నవంబరు 15, 2000న బీహార్ నుంచి ఏర్పాటయిన జార్ఖండ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి అవుతారు. బుధవారం జరిగిన కూటమి సమావేశానికి హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్, భార్య కల్పనతో పాటు కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ కూడా హాజరయ్యారు. ఇదిలాఉండగా, ఈ పరిణామాలపై బీజేపీ నాయకుడు నిష్కాంత్ దూబే ‘ఎక్స్’ లో చేసిన పోస్ట్లో, ‘జార్ఖండ్లో చంపై సోరెన్ శకం ముగిసింది. కుటుంబ ఆధారిత పార్టీలో కుటుంబానికి వెలుపల ఉన్న వ్యక్తులకు రాజకీయ భవిష్యత్తు లేదు. ముఖ్యమంత్రి… భగవాన్ బిర్సా ముండా నుంచి స్ఫూర్తి పొంది అవినీతిపరుడైన హేమంత్ సోరెన్ జీకి వ్యతిరేకంగా నిలబడాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. శిబూ సోరెన్ కుటుంబానికి వెలుపల ఉన్న గిరిజనులు జేఎంఎంలో తాత్కాలిక ముఖాలు మాత్రమేనని బీజేపీ జార్ఖండ్ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ నొక్కి చెప్పారు. ఆ కుటుంబం ప్రజలను వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. రాజకీయ వర్గాల్లో ‘కొల్హాన్ పులి’ గా పిలిచే చంపై సోరెన్ నేడు ఎలుకగా మారిందని ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్లో 12 మంది మంత్రులు ఉండగా, రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం 10 మంది మంత్రులు ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత, రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి బలం 45 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. జేఎంఎంకు 27, కాంగ్రెస్ 17, ఆర్జేడీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. ఇద్దరు జేఎంఎం ఎమ్మెల్యేలు నళిని సోరెన్, జోబా మారీa ఇప్పుడు పార్లమెంటు సభ్యులు కాగా, జామా శాసనసభ్యురాలు సీతా సోరెన్ బీజేపీ టికెట్పై సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేశారు. జేఎంఎం మరో ఇద్దరు శాసనసభ్యులను… బిషున్పూర్ ఎమ్మెల్యే చమ్రా లిండా, బోరియో ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్ను పార్టీ నుంచి బహిష్కరించింది. అదేవిధంగా అసెంబ్లీలో బీజేపీ బలం 24 కు తగ్గింది. దాని ఇద్దరు ఎమ్మెల్యేలు ధులు మహతో (బగ్మారా), మనీశ్ జైస్వాల్ (హజారీబాగ్) ఇప్పుడు ఎంపీలుగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్లో చేరిన మండు ఎమ్మెల్యే జైప్రకాశ్ భాయ్ పటేల్ను కాషాయ పార్టీ బహిష్కరించింది. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుత బలం 76.