ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రభుత్వ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో సోమవారం జీతాలు జమ కావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. నాలుగున్నర సంవత్సరాలుగా ఒకటో తేదీ వచ్చిందంటే చాలు…ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం ఎదురు చూపులు చూసే పరిస్థితి ఉండేది. ఆలస్యమైనా జీతాలు ఎప్పుడు పడతాయో తెలియక ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వం నవరత్నాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యోగుల జీతాల చెల్లింపునకు ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై దృష్టిసారించిన సీఎం చంద్రబాబు… ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పిస్తూ ఒకటో తేదీనే జీతాలు వేయాలని అధికారులను ఆదేశించారు. ఫలితంగా మధ్యాహ్నం 12 గంటల నుంచే అకౌంట్లలో జీతాలు జమ కావడం ప్రారంభించాయి. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాచ్ నెంబర్ల వారీగా జీతాలు పడుతుండటంతో ఉద్యోగులు విస్తుబోయారు. నెలకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం 5500 కోట్ల రూపాయల నిధులు అవసరం. వీటితోపాటు సామాజిక భద్రతా పెన్షన్లకు రూ.4వేల 400 కోట్లు చెల్లింపులు ఒకటో తేదీనే జరగాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. వీటి అమలుకు సీఎస్ చర్యలు తీసుకోవడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.