. ఉపాధ్యాయుల నియామక షెడ్యూల్ విడుదల
. 12న నోటిఫికేషన్, మార్చి 15 నుంచి పరీక్షలు
. 6,100 ఖాళీల భర్తీకి చర్యలు బ ‘టెట్’కూ రంగం సిద్ధం
. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. దీని ద్వారా మొత్తం 6,100 ఉపాధ్యా పోస్టులను భర్తీ చేయ నున్నారు. వీటిలో ఎస్జీటీ పోస్టులు 2,280 ఉండగా.. స్కూల్ అసిస్టెంట్ 2,299, టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపాళ్లు 42 చొప్పున ఉన్నారు. బుధవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ డీఎస్సీ 2024, ఏపీ టెట్` 2024 పరీక్షల వివరాలను వెల్లడిరచారు. ఏపీ టెట్, డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూలును ప్రభుత్వం వేర్వేరుగా జారీజేసింది. ఏపీ టెట్కు ఈనెల 8వ తేదీన, ఈనెల 12వ తేదీన టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (డీఎస్సీ) నోటీఫికేషన్లను జారీజేస్తారు. డీఎస్సీ పరీక్షకు మార్చి5న హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుతారు. మార్చి 15 నుంచి 30వరకు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. సెషన్ 1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెషన్ 2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. మార్చి 31వ తేదీన డీఎస్సీ ప్రాథమిక కీని విడుదల చేసి, ఏప్రిల్ 1వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 2న తుది కీ విడుదల చేసి, తుది ఫలితాలను ఏప్రిల్ 7వ తేదీన ప్రకటిస్తారు.
ఏడు యాజమాన్యాల కింద 6,100 ఉపాధ్యాయ ఖాళీలు
రాష్ట్రంలోని ఏడు యాజమాన్యాల కింద ఉన్న అనగా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూటషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(గురుకులం), ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ(ఆశ్రమ), ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సొసైటీల కింద పనిచేస్తున్న విద్యాసంస్థల్లోని 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం పరీక్షలను నిర్వహించనుంది. ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఎపీటెట్)కు సంబంధించి ఈనెల 8న నోటిఫికేషన్ను జారీజేస్తారు. ఆరోజు నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. ఈనెల 27 నుంచి మార్చి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)విధానంలో పరీక్షలు నిర్వహించి, మార్చి 14న ఫలితాలు వెల్లడిస్తారు. సమీప రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచు కుని ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని కేంద్రాలతో పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, బరంపురాలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను అభ్యర్థులకు కల్పించారు.
డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్లో నియామక ఉత్తర్వులు: మంత్రి బొత్స
డీఎస్సీలో ఎంపికైన వారికి జూన్లో ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులను జారీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14వేల 219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని వివరించారు.వచ్చే ఏప్రిల్ నాటికి ఖాళీ అయ్యే ఉపాధ్యాయ ఖాళీలన్నిటినీ రానున్న డీఎస్సీ ద్వారా జీరో వేకెన్సీ విధానంతో భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఈప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని, విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని వివరించారు.ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లను ఖర్చు చేశామన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ జిల్లాల వారీగా ఖాళీల వివరాలను రిజర్వేషన్లతో సహా నోటిఫికేషన్లో పొందుపరుస్తామన్నారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల నిర్వహణపై ఫిర్యాదుల నివృత్తికి ఈనెల 8వ తేదీ నుంచి విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.