. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో 300 ఎకరాల్లో హబ్
. 35 వేల మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ లక్ష్యం
. ఏఐ, మెషీన్ లెర్నింగ్ అనుసంధానంతో విప్లవాత్మక మార్పులు
. అమరావతి డ్రోన్ సదస్సు ప్రారంభ సభలో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ‘డ్రోన్ సిటీ ఆఫ్ ఇండియా’గా అమరావతిని తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేయబోతున్నాయని, వీటి అనుసంధానంతో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని చెప్పారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్స్లో కేంద్ర పౌర విమానయాన శాఖ, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమరావతి డ్రోన్ సదస్సును మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డితో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉందని, ఇది భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీలో గేమ్ ఛేంజర్ అవుతుందని అన్నారు. 1995లో తాను ఐటీ విధానం గురించి మాట్లాడితే ఆరోజు ఆ మాటలు కొందరికి అర్థం కాలేదని, ఇప్పుడు హైదరాబాద్ ఐటీ రంగంలో ఎలా అభివృద్ధి చెందిందో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. భవిష్యత్తులో డ్రోన్ల వినియోగం, ఏఐ, ఎంఎల్ అనుసంధానంతో జరిగే అభివృద్ధి కూడా అలాగే ఉంటుందన్నారు. థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ విధానాన్ని అనుసరించాలని కోరారు. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు. అక్కడ డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తే పెద్ద నగరాలైన హైదరబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతికి దగ్గరగా ఉంటుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.
రాబోయే కాలమంతా డేటాదే
రాబోయే కాలం అంతా డేటాదేనని చంద్రబాబు అన్నారు. ఎంత డేటా ఉంటే దేశానికి, పెట్టుబడిదారులకు అంత బాగుంటుందన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) ద్వారా నిర్ధిష్ట సమాచారం పొందవచ్చన్నారు. డ్రోన్లను మనం ఎక్కడికైనా పంపవచ్చు…సరైన సమాచారం పొందవచ్చు. ఇటీవల విజయవాడలో పెద్దఎత్తున వరదలు వచ్చినప్పుడు ఆహారం కలుషితం, వృధా కాకుండా అందించడానికి దేశంలోనే మొదటిసారిగా డ్రోన్లు వినియోగించి బాధితులకు ఆహారం అందించాం. హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందించిన సందర్భంలో పైనుంచి వేయడంతో ఆహార పొట్లాలు పగిలిపోయేవి. కానీ డ్రోన్ల ద్వారా సురక్షితంగా 1.50 లక్షల మందికి ఆహారం అందించామన్నారు. డ్రోన్లు సిటీలోకి పంపి ఎంత చెత్త ఎక్కడ పేరుకుపోయిందో సర్వే చేశామన్నారు. సరైన సమయంలో అన్నింటిని గుర్తించి 20 మెట్రిక్ టన్నుల చెత్తను నాలుగు రోజుల్లోనే తొలగించామన్నారు. రోడ్లు ఎక్కడ సరిగా లేకపోయినా డ్రోన్లు పంపి సమాచారం తెప్పించామని, ఏ రోడ్డు పక్కన చెత్త ఉన్నా పరిశీలించి శుభ్రం చేయించామని చంద్రబాబు వివరించారు. వరద నీరు బయటకు పోవడానికి కారణం డ్రెయిన్లు మూసుకుపోవడమని, బ్లాక్లను గుర్తించి, వాటిని తొలగించి నీటిని బయటకు పంపామని చెప్పారు. భవిష్యత్తులో డ్రోన్లను గేమ్ ఛేంజర్లుగా చెప్పొచ్చన్నారు.
వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విజిబుల్ పోలీసింగ్కు వినియోగిస్తామని, టెక్నాలజీ సహాయంతో నేరగాళ్ల ఆటకట్టిస్తామన్నారు. భూసార పరీక్షలు, పురుగుమందుల పిచికారీ, భూ సర్వే, భూసార పరీక్షలు తదితరాలను డ్రోన్ల ద్వారా నిర్వహించవచ్చని తెలిపారు. కనీసం 100 నుండి 150 వరకు డ్రోన్ అప్లికేషన్స్ (డ్రోన్ యూజ్ కేస్లు) వినియోగం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. తనకు కావాల్సింది డ్రోన్ల ద్వారా అభివృద్ధి. భారత్కు రెండంకెల వృద్ధిరేటు సాధించే సత్తా ఉంది. నాలెడ్జ్ ఎకానమీలో గ్లోబల్ సర్వీస్లు అందించగల సత్తా కూడా మన దేశానికి ఉందని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తల నుండి సలహాలు, సూచలు తీసుకుని పక్షం రోజుల్లోనే డ్రోన్ పాలసీని ఆవిష్కరిస్తామని, కనీసం 35 వేలకు పైగా డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు ప్రకటించారు. ప్రతి దాన్ని ఎలా వినియోగించుకోవాలో ఆలోచిస్తే భారతీయులను ఎవరూ ఎదుర్కోలేరన్నారు. రాష్ట్రంలో ఐదు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు..అమరావతిలో ప్రధాన కార్యాలయం ఉంటుందని, మిగతావి విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. 2047 నాటికి ఒక కుటుంబంలో .ఒక వ్యాపారవేత్త ఉండాలన్నది తన అభిమతమన్నారు. 25 ఏళ్ల క్రితం ప్రతి కుటుంబంలో ఒక ఐటీ వ్యక్తి ఉండాలని ఆకాంక్షించామని, ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యాపారవేత్త, ఒక స్టార్టప్ కంపెనీ ఉండాలని చెబుతున్నామన్నారు. ఇది విజయవంతమైతే భారత్.. టెక్నాలజీ, గ్లోబల్ సర్వీసెస్లో ముందుంటుందని చంద్రబాబు ఉద్ఘాటించారు.