న్యూదిల్లీ : మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ జూన్ 1న ముగియడంతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఇక్కడి తీహార్ జైలులో లొంగిపోయారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్పై కేజ్రీవాల్ మే 10న జైలు నుంచి బయటికి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఏడవ, చివరి దశ పోలింగ్ జరిగిన జూన్ 1న కేజ్రీవాల్ బెయిల్ గడువు ముగిసింది. తీహార్ జైలులో లొంగిపోయే ముందు కేజ్రీవాల్ రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి ముందు కేజ్రీవాల్ తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. లొంగిపోయే ముందు పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆప్ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ తాను అవినీతికి పాల్పడినందుకు కాదు… నియంతృత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినందుకే జైలుకు వెళుతున్నానని అన్నారు. దేశ ‘రక్షణ కోసం’ లోక్సభ ఎన్నికల సమయంలో తాను ప్రచారం చేశానని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేసిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ నకిలీవేనని కేజ్రీవాల్ నొక్కి చెప్పారు. ‘నిన్న ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. అవి నకిలీవని నేను మీకు రాతపూర్వకంగా ఇవ్వగలను. రాజస్థాన్లో 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కానీ ఒక ఎగ్జిట్ పోల్ అక్కడ బీజేపీకి 33 సీట్లు ఇచ్చింది. వారు నకిలీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేయడానికి కారణం ఏమిటి?’ అని బీజేపీ లక్ష్యంగా విమర్శించారు. ‘బీజేపీ జూన్ 4న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేదు. ఈ ఎగ్జిట్ పోల్స్ మిమ్మల్ని నిరాశలోకి నెట్టడానికి మైండ్ గేమ్లో భాగం’ అని కేజ్రీవాల్ అన్నారు. ‘ఇండియా కూటమి పార్టీలన్నీ అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ ఏజెంట్లను ముందుగానే వెళ్లనివ్వవద్దని నేను చెప్పాను. ఈవీఎం ఓట్లు, వీవీప్యాట్లను లెక్కించే సమయానికి కౌంటింగ్ ఏజెంట్లు చివరి వరకు ఆగాలి. అభ్యర్థి ఓడిపోయినా చివరి వరకూ ఆగాల్సిందే’ అని అన్నారు. ‘సుప్రీం కోర్టు నాకు 21 రోజుల గడువు (ఉపశమనం) ఇచ్చింది. ఈ 21 రోజులు మరచిపోలేనివి. నేను ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు. నేను దేశాన్ని రక్షించడానికి ప్రచారం చేశాను. ఆప్ ముఖ్యం కాదు, అది రెండవది. మొదటిది దేశమే’ అని కేజ్రీవాల్ అన్నారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఒక్క పైసా కూడా రికవరీ కాలేదని ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారని తెలిపారు. ‘నేను అనుభవం ఉన్న దొంగనని ఆయన అన్నారు’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘నేను రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించాను. నియంతృత్వాన్ని అంతం చేయడానికి గాంధీజీ మా స్ఫూర్తి. నేను హనుమాన్ మందిరానికి వెళ్లాను. నాకు బజరంగబలి ఆశీస్సులు ఉన్నాయి. జూన్ 4 మంగళవారం. బజరంగబలి నియంతృత్వాన్ని నాశనం చేస్తుంది’ అని కేజ్రీవాల్ తెలిపారు.
రాజ్ఘాట్లో కేజ్రీవాల్ పర్యటనపై బీజేపీ నిరసన
సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోవడానికి ముందు రాజ్ఘాట్కు వెళ్లడంపై నిరసన తెలుపుతున్న బీజేపీ దిల్లీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవాతో సహా అనేక మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజ్ఘాట్ ప్రాంతం నుంచి కొంతమంది నిరసనకారులను తొలగించి, కమ్లా మార్కెట్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ మాట్లాడుతూ ‘కేజ్రీవాల్, అతని మంత్రులు దిల్లీ ప్రజలకు సరైన నీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. అతను ఒక దొంగ అని అందరికీ తెలుసు’ అని అన్నారు.